అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

3, అక్టోబర్ 2025, శుక్రవారం

లాభనష్టాలు

పొద్దున్న ఏదో పనిలో ఉండగా, మిత్రుడు  రవి ఫోన్ చేశాడు.

అది తన వాకింగ్ టైం.

"నవరాత్రులు బాగా జరిగాయా?" అడిగాడు.

"ఆ. జరిగాయి" అన్నాను.

"పలానా గురువుగారి ఆశ్రమంలో అమ్మవారి పూజలకు, అలంకరణకు బాగా డబ్బులు వసూలు చేశాడు. తెలుసా?" అడిగాడు.

"నాకనవసరం. అలాంటి చెత్త నాకు చెప్పకు" అన్నాను.

నన్ను రెచ్చగొట్టడం రవికి సరదా. నేనేదైతే వద్దంటానో అవే చెబుతూ ఉంటాడు.

"అలాకాదు. అమ్మవారికి అలంకరణ చెయ్యాలి, పూజలు చెయ్యాలి. డబ్బులు పంపండి, పంపండి' అని శిష్యుల వెంటపడి మరీ అడుక్కున్నాడు. బాగానే పోగయ్యాయిట మొత్తంమీద" అన్నాడు.

గతంలో ఆయన దగ్గర ఏదో అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం పొందాడు రవి. ప్రస్తుతం ఇద్దరికీ చెడింది. కానీ వదలకుండా వాళ్ళ న్యూసు మాత్రం సేకరిస్తూ ఉంటాడు.

'ఇంతకీ ఏమంటావ్?' అన్నాను.

'నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుందేమో?', అన్నాడు.

'అలంకరణ నేనే చేసుకోను, ఇక అమ్మవారికేం చేస్తాను?' అన్నాను.

'ఇంత సమయాన్ని ఇతరులకోసం వెచ్చిస్తున్నందుకు నీకు లాభం ఉండాలి కదా?" అన్నాడు.

' అలాంటిదేమీ ఉండదు. ఇక్కడ ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. అంతే ' అన్నాను.

'మరి నీ శిష్యులకైనా ఏదో ఒక లాభం ఉండాలి కదా?' అడిగాడు.

'ఉంటుంది. అది డబ్బుతో కొలవబడేది కాదు' అన్నాను.

' ఇలా అయితే నీ దగ్గరకెవరొస్తారు? ' అన్నాడు.

' రమ్మని ఎవడు దేబిరిస్తున్నాడు?' అన్నాను.

' అదికాదు. లాభం లేకుండా ఎలా? ' మళ్ళీ అడిగాడు.

'లాభనష్టాలను దాటి ఆలోచించలేవా?' అడిగాను.

'ఎలా? జీవితమంతా అవేగా?' అన్నాడు.

'లాభం కోరుకుంటే నష్టం. నష్టం అనుకోకపోతే లాభం' అన్నాను.

' నీ ధోరణి నీదేగాని నా మాటవినవు కదా? ' అన్నాడు.

' నువ్వు వాకింగ్ మానేసి యోగాభ్యాసం చెయ్యమంటే చెయ్యవు కదా?' అన్నాను.

'బై' అంటూ ఫోన్ పెట్టేశాడు రవి.

read more " లాభనష్టాలు "

2, అక్టోబర్ 2025, గురువారం

గర్భగుడి

'అష్టమి నాడు దర్శనానికి 8 గంటలు పట్టిందట?'  అన్నాడు శిష్యుడు మొన్న.

'ఎక్కడ?' అడిగాను.

'విజయవాడ కనకదుర్గా అమ్మవారి గుడిలో' అన్నాడు.

'అలాగా' అన్నాను.

'మనకేంటో ఇక్కడ? అసలివాళ ఏ తిథో కూడా తెలీడం లేదు' అన్నాడు.

నవ్వాను.

'గుడిని దాటాకే గర్భగుడి' అన్నాను.

read more " గర్భగుడి "

మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 74 వ పుస్తకంగా 'యోగినీ హృదయము' అనే ప్రాచీన తంత్రగ్రంధమునకు నా వ్యాఖ్యానమును 
ఈ నవరాత్రులలో విడుదల చేస్తున్నాను. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి ప్రాచీనగ్రంధము. దీనికి నిత్యాహృదయమని, సుందరీహృదయమని పేర్లున్నాయి.

శ్రీయంత్రములో నవావరణలున్నాయి. ఆయా ఆవరణదేవతలను యోగినులంటారు. వారిపేర్లు ఖడ్గమాలాస్తోత్రంలో వస్తాయి. ఆ యోగినుల యొక్క ఉపాసనను ఏ విధముగా చేయాలనిన సారమును వివరిస్తుంది గనుక, ఈ గ్రంధమునకు 'యోగినీ హృదయమని' పేరు పెట్టబడింది.  

ఇది వామాచార శ్రీవిద్యోపాసనకు చెందినది. వామకేశ్వర తంత్రములోని ఒక భాగమని కొందరు పండితుల నమ్మిక కాగా, ఇది ప్రత్యేకమైన గ్రంథమని, వామకేశ్వర తంత్రమునకు దీనికి సంబంధం లేదని మరి కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇది వామాచార శ్రీవిద్యోపాసనా గ్రంధమే. దీనిలో మన్మధోపాసితమైన కాదివిద్య చెప్పబడింది.

ఈ గ్రంధములో మూడు అధ్యాయములున్నాయి. అవి, చక్రసంకేతము, మంత్రసంకేతము, పూజాసంకేతములనిన పేర్లతో ఉన్నాయి. శ్రీచక్రముయొక్క వివిధ ఆవరణలు, వాటి అర్ధములు మొదటి అధ్యాయములో ఉన్నాయి. మంత్రభాగము, చక్రేశ్వరీ దేవతల వివరణ, ఆయా మంత్రార్ధములు రెండవ అధ్యాయంలో ఉన్నాయి.  శ్రీచక్రమును వామాచారపద్ధతిలో ఏ విధముగా పూజించాలనిన వివరము మూడవ అధ్యాయంలో ఇవ్వబడింది.

ఎన్నో తంత్రరహస్యముల సమాహారమైన ఈ గ్రంధాన్ని విజయదశమి నాడు విడుదల చేయడం కాకతాళీయం కాదని నేను భావిస్తున్నాను. ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించే పనిలో సహాయపడిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. 

'ఈ - బుక్' ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

శ్రీవిద్యోపాసకులకు, శాక్తతంత్రాభిమానులకు, నా వ్యాఖ్యానం ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను.
read more " మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల "

1, అక్టోబర్ 2025, బుధవారం

పూర్ణాహుతి

చాలారోజులనుంచీ తెలిసిన ఒక పెద్దాయన ఇవాళ ఫోన్ చేశాడు. ఆయనకు 75 పైనే ఉంటాయి.

కుశలప్రశ్నలయ్యాక, విషయంలోకొచ్చాడు.

'రేపు మా ఇంట్లో చండీహోమం పూర్ణాహుతి చేస్తున్నాము. మీరు రావాలి' అన్నాడు.

'అవడానికా?' అడిగాను.

'అదేంటి?' అన్నాడు.

అర్ధం కాలేదని అర్ధమైంది.

'పోయినేడాది కూడా చేసినట్టున్నారు హోమం?' అన్నాను.

'అవునండి. చేశాము' అన్నాడు.

'అప్పుడివ్వలేదా?' అడిగాను.

'ఇచ్చాము' అన్నాడు.

'మరి ఇంకెందుకు?' అన్నాను.

 'అంటే?' అన్నాడు.

'ఒకసారి పూర్ణంగా ఆహుతయ్యాక మళ్ళీ వ్వడానికి ఇవ్వడానికి ఇంకేం మిగిలుంటుంది?' అన్నాను.

ఏదో గొణుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు పెద్దాయన.

నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.

read more " పూర్ణాహుతి "

30, సెప్టెంబర్ 2025, మంగళవారం

పదకొండో అవతారం

పొద్దున్నే ఫ్రెండ్ ఫోన్ చేశాడు.

'ఈ వార్త విన్నావా?' అన్నాడు సంభ్రమంగా.

'ఏంటది?' అన్నాను.

'ఈ ఏడాది అమ్మవారికి పదకొండో అవతారం వచ్చింది' అన్నాడు.

'ఏం? పది సరిపోలేదా?' అన్నాను నిరాసక్తంగా.

'అవును. ఈ ఏడాది పదకొండు తిథులొచ్చాయి. అందుకే పదకొండు అవతారాలు' అన్నాడు.

'బాగుంది నీ అవతారం' అన్నాను.

'నువ్విలాంటివేవీ చెయ్యవు కదా. నీకు తెలీదులే' అన్నాడు.

'అసలు అమ్మవారంటే ఏంటో తెలిస్తే ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'పోనీ నీ అవతారమేంటో తెలుసుకున్నా, ఇన్ని అవతారాలతో పనుండదు' అన్నాను.

'ఇదీ అర్ధం కాలేదు' అన్నాడు.

'ఫోన్ పెట్టేసి నీ వ్యాపారం నువ్వు చేసుకో' అన్నాను.

'నాకేం వ్యాపారం లేదు' అన్నాడు.

'పోనీ ఇంకొకరి వ్యాపారంలో సమిధవై పో' అన్నాను.

ఫ్రెండ్ ఫోన్ పెట్టేశాడు.

నవరాత్రులు మళ్ళీ నవ్వుతున్నాయి.

read more " పదకొండో అవతారం "

29, సెప్టెంబర్ 2025, సోమవారం

మైకుకు మోక్షం

నిన్న రాత్రి ఏదో పనుండి ప్రక్క పల్లెకెళ్ళాను

ఆ టైములో కూడా,  ఒక గుడిపైన మైకు జోరుగా మ్రోగుతోంది.

ఏవో జానపద భక్తిగీతాలు పెద్ద సౌండుతో వినవస్తున్నాయి

గుడిలో ఒక్క పురుగు లేదు.

అమ్మవారు అయోమయంగా చూస్తోంది.

'నవరాత్రుల మైకు' అన్నది ప్రక్కనున్న శిష్యురాలు

'నాల్రోజుల్లో దానికి మోక్షం గ్యారంటీ' అన్నాను ఏడుస్తున్న ప్రశాంతతను చూస్తూ.

read more " మైకుకు మోక్షం "

22, సెప్టెంబర్ 2025, సోమవారం

నవ్వుతున్న నవరాత్రులు

ప్రక్కఊరినుండి అప్పుడపుడు కొంతమంది ఏదో పనిమీద ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారిలో ఒకతను ఈ మధ్యన ఇలా అడిగాడు.

'ప్రతి ఏడాది మా గుడిలో నవరాత్రులు చేస్తాము. మీరూ ఆశ్రమంలో చేస్తారా?'

'రాత్రులను మనం చేసేదేముంది? అవే వచ్చిపోతుంటాయి' అన్నాను.

షాకయ్యాడు.

'అంటే, అమ్మవారికి ప్రత్యేకపూజలు ఏవీ చెయ్యరా?' అడిగాడు అనుమానంగా.

'ప్రత్యేకంగా చేసేది పూజ ఎలా అవుతుంది?' అన్నాను.

అయోమయంగా చూచాడు.

'మరి నైవేద్యాలు?' భయంగా అడిగాడు.

'కాలానికి మనం అవుతున్నాంగా ప్రతిరోజూ - నైవేద్యం' అన్నాను.

కాసేపు మాటరాలేదు.

'మరి మైకులు భజనలు ఉండవా?' అన్నాడు.

'అమ్మవారికి చెవుడు లేదు. ఆమెకు భజనపరులు నచ్చరు' అన్నాను.

అతను లేచి వెళ్ళిపోయాడు.

నవరాత్రులు నవ్వుతున్నాయి.

read more " నవ్వుతున్న నవరాత్రులు "

18, సెప్టెంబర్ 2025, గురువారం

కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు

146 కోట్ల ప్రజలు. అంతకంటే ఎక్కువ సమస్యలు. 

దేశంనిండా దేశద్రోహులు. నల్లడబ్బు, అవినీతికంపు. సొంతదేశాన్ని బలహీనపరచి విదేశాలకు అమ్మేయాలని ప్రయత్నించే రాజకీయశక్తులు. వాటికి విదేశీసహాయాలు, వీరిని గుడ్డిగా నమ్మే పిచ్చిజనాలు, సరిహద్దు గొడవలు, దేశద్రోహపార్టీలు, వర్గవిభేదాలు, కులవిభేదాలు,  అవకాశవాదాలు, మతమార్పిడులు, జిహాద్ లు, కమ్యూనిష్టు విషప్రచారాలు, టెర్రరిస్టుల దాడులు, కుట్రలు, కుతంత్రాలతో రకరకాలుగా చీల్చబడుతూ సర్వనాశనం దిశగా శరవేగంగా పోతున్న దేశం.

ఇలాంటిస్థితిలో దేశపగ్గాలు చేపట్టారు మోదీగారు.

ఆయనకు కుటుంబం లేదు. 

ఒకప్పుడు ఉండేది, దేశంకోసం కుటుంబాన్ని వదులుకున్నారు. 

ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.

కోట్లకు కోట్లు నల్లధనం లేదు.

ఆయన తినేది చాలా తక్కువ. అదికూడా పూర్తి శాకాహారం.

నిద్రపోయేది రోజుకు 3 గంటలు. 

దేశంకోసం కష్టపడేది 21 గంటలు.

ఏడాదిలో ఎక్కువరోజులు ఉపవాసదీక్షలు. నేలమీద నిద్రిస్తారు.

విలాసాలు లేవు. సరదాలు లేవు. ఇతర వ్యాపకాలు లేవు.

క్రమశిక్షణతో కూడిన జీవితం.

ఉన్నతమైన ఆదర్శాలతో కూడిన ఆలోచనావిధానం.

75 ఏళ్ల వయసులో కూడా అలసిపోని దేహం.

చెరిగిపోని చిరునవ్వు.

తను ఏ దేశంకోసం పాటుపడుతున్నాడో, అదేదేశంలో దాదాపు సగంమంది తనను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతకు మతపిచ్చి తప్ప ఏ ఇతరకారణమూ లేకపోయినా, చెదరని సంకల్పశక్తి. 

వారికి కూడా అభివృద్ధి ఫలాలను, ఫలితాలను సమానంగా అందించే ఉదారత్వం.

అదీ నరేంద్రమోదీగారు !

పదేళ్లు తిరిగాయి.

ఒకప్పుడు అన్నిదేశాల దగ్గరా అప్పులు చేసిన దేశం, ఈనాడు అన్ని అప్పులూ తీర్చేసింది. చిన్నదేశాలను ఆదుకునే స్థితికి ఎదిగింది. 

నేడు మనదేశం అన్ని రంగాలలో ముందుకు పోతూ,  అగ్రరాజ్యాల బెదిరింపులకు లొంగకుండా, వాటికే షరతులు విధిస్తూ, వాటితో సమానంగా అంతర్జాతీయ వేదికలపైన నిలబడిందంటే - నరేంద్రమోదీ గారు మాత్రమే కారణం !

'సన్యాసి రాజ్యపాలన చేస్తాడు' అని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసింది ఈయన గురించే.

మోదీగారు కాషాయవస్త్రాలు కట్టుకోనక్కరలేదు. కానీ, ఆయన ఏ పీఠాధిపతికీ, ఏ స్వామీజీకి తక్కువ కాదు. నిజానికి వాళ్లలో చాలామంది ఈయన కాలిగోటికి కూడా ఏమాత్రమూ సరిపోరు.

కారణం?

వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు. 

ఈయ దేశంకోసం పాటుపడుతున్నాడు.

ఎవరు ఎక్కువ?

దేశం బాగుంటే కదా మతం, ధర్మం బాగుండేది?

చట్టం సరిగ్గా ఉంటేకదా మఠాధిపతులైనా, మతాధిపతులైనా, నిర్భయంగా తిరగగలిగేది?

మోదీగారు ఒక రాజర్షి.

జనకమహారాజు గురించి మనం చదివాము. శివాజీ మహారాజు గురించి చదివాము. గురు గోవింద్ సింగ్ గురించి చదివాము. ఇప్ప్పుడు మోదీగారిలో వారందరినీ చూస్తున్నాము.

ఇటువంటి రాజర్షి, ఇటువంటి కర్మయోగి మన ప్రధానమంత్రిగా ఉండటం కోట్లాది భారతీయుల పుణ్యఫలం.

ఎంతమంది దేశభక్తుల ఎన్నివేల ఏళ్ల ప్రార్ధనల ఫలితమో ఈనాడు ఈ రాజర్షి మన దేశసారధి అయ్యాడు.

ఈయనకు నిన్న 75 ఏళ్ళు నిండాయి.

ఇంకా 25 ఏళ్ళు, నిండునూరేళ్ళు, ఈయన ఇదేవిధంగా జీవించాలని, దేశాన్ని మున్ముందుకు నడిపించాలని,  మన దేశపు పూర్వవైభవాన్ని మళ్ళీ ఆవిష్కరించాలని, పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.

మనదేశంలో వేలాదిసంవత్సరాలుగా పుట్టిన అందరు మహనీయుల ఆశీస్సులూ ఈయనపైన ఉండుగాక !

పరమేశ్వరుని కటాక్షం ఈయనపైన పరిపూర్ణంగా ఉండుగాక ! 

జై మోదీజీ ! జై భరతమాత ! జై హింద్ !

read more " కోట్లాదిదేశభక్తుల వేలాది సంవత్సరాల కలల ప్రతిరూపం - నరేంద్రమోదీ గారు "

15, సెప్టెంబర్ 2025, సోమవారం

దీపపు కుదురు

అయితే,

ఎర్రజెండా మొండి మనుషులు

లేకపోతే, 

తురకబాబా మూఢభక్తులు


కాకపోతే,

కొలుపులు, బలుపులు, బలులు

ఇంకా చాలకపోతే,

కోరికల భజనలు, దీక్షలు, పూజలు


అదీకాదంటే,

పిరమిడ్లు, సమాధుల దొడ్లు, సూక్ష్మలోక ప్రయాణాలు


ఇదీ ఒంగోలు చుట్టుప్రక్కల గోల . . . 


మనుషుల అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే

చిమ్మచీకటి కూడా దీనిని చూచి సిగ్గుపడుతోంది


చెవిటివాడికి శంఖం ఊదటం ఎలాగో 

వీరికి అసలైన ఆధ్యాత్మికత నేర్పడం అలాగ


అందుకే,

ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్లో మా బుక్ స్టాల్

ఇదే మొదటిసారి,

ఇదే చివరిసారి కూడా


ఎడారిలో చిరుదీపం వెలుగుతోంది

దాని వెలుగు చాలా దూరానికి ప్రసరిస్తోంది

కానీ కుదురుదగ్గర మాత్రం

చీకటిగానే ఉంది.


ఏ దీపమైనా ఇంతేనేమో?

read more " దీపపు కుదురు "

8, సెప్టెంబర్ 2025, సోమవారం

ఏడవ రిట్రీట్ విశేషాలు

 



ఏడవ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం ఈనెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పంచవటి ఆశ్రమప్రాంగణంలో జరిగింది.

ఊకదంపుడు ఉపన్యాసాలకు, సోదికబుర్లకు పూర్తివ్యతిరేకదిశలో సాగుతున్న మా నడక, ఉత్త థియరీని వదలిపెట్టి, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో ముందుకు పోతోంది.

సాధనామార్గంలో పురోగమిస్తున్న శిష్యులకు ఆశీస్సులనందిస్తూ, ఉన్నతస్థాయికి చెందిన ఒక ధ్యానవిధానంలో వీరికి దీక్షనిచ్చాను. అందుకున్నవారు అదృష్టవంతులు.  వీరిలో ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల కూడా ఉన్నది. ఇంత చిన్నవయసులో ఇటువంటి దీక్షను పొందటం ఈమె అదృష్టం. ఏమంటే, అసలైన హిందూమతం ఇదే. అసలైన సనాతన ధర్మమార్గం ఇదే. కోట్లాదిమందికి 83 వచ్చినా ఇది దొరకదు. అలాంటిది 13 ఏళ్ల వయసులో ఇది లభించడం అదృష్టం కాకపోతే మరేమిటి?

నిజానికి, సాధన మొదలుపెట్టవలసింది ఈ వయసులోనే. దైవకటాక్షంతో లభించిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోమని వారికి గుర్తుచేస్తున్నాను.

మూడురోజులపాటు బయటప్రపంచాన్ని మర్చిపోయి ఆశ్రమంలోని  ప్రశాంతవాతావరణంలో సాధనలో సమయాన్ని గడిపిన శిష్యులందరూ తిరిగి వారివారి ఇళ్లకు ఈ రోజు ఉదయానికి చేరుకున్నారు.

తిరిగి డిసెంబర్ లో జరుగబోయే సాధనాసమ్మేళనంలో కలుసుకుందామనిన సంకల్పంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

మనుషులనేవారు కనిపించడం అరుదైపోయిన ఈ రొచ్చుప్రపంచంలో, కనీసం కొంతమందినైనా నిజమైన మనుషులను తయారు చేయగలుగుతున్నానన్న సంతృప్తిని నాకు మిగిల్చింది.

read more " ఏడవ రిట్రీట్ విశేషాలు "