నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

శ్రీ సూక్తులు

'కుంభమేళా కెళ్ళొచ్చా' అన్నాడొకడు

'కుంభం లాంటి ఆ పొట్ట తగ్గించు ముందు' అన్నాను.


'కుండలినీ యోగం నేర్చుకుంటున్నా' అన్నాడొకడు

'బండలాంటి నీ గుండెను ముందు మెత్తగా మార్చు' అన్నాను.


'సుషుమ్నా క్రియను అభ్యాసం చేస్తున్నా' అన్నాడింకొకడు

'కర్మ ఎలా చేయాలో ముందు నేర్చుకో. క్రియలు అవే జరుగుతాయి' అన్నాను.


'నా కుండలిని నిద్ర లేచింది ' అన్నాడొకడు

' నాదస్వరం సరిగా ఊదు. లేకపోతే కాటేస్తుంది ' అన్నాను


'బాబాజీ క్రియాయోగంలో దీక్ష తీసుకున్నా' అన్నాడు మరోవాడు. 

'ఆయనెప్పుడో పోయాడు. ఇంకెన్నాళ్లు బ్రతికిస్తారు?' అడిగాను


'మాది అద్వైతమార్గం' అంది ఒకామె.

'ఆ చెప్పడంలోనే తెలుస్తోంది మీ అద్వైతం' అన్నాను.


'నేను శ్రీవిద్యోపాసకురాలిని' అని ఇంకొకామె.

'పాసనాలు తగ్గడానికి ముందు మందేసుకో' అన్నాను


'మాది పెద్దలమార్గం' అన్నాడింకొకడు.

'వాళ్ళు తాగినవి నేతులా? డాల్డానా?' అడిగాను


' ఏ సాధనా అక్కర్లేదు' అంది ఇంకొకామె

'ఏమీ సాధించలేని జీవితం అంతే అంటుంది' అన్నాను


'సూక్ష్మలోకాలు చూశా' అన్నాడు ఇంకో మానవుడు

'ఈ లోకాన్ని సరిగ్గా చూడు ముందు' అన్నాను


'ఆత్మలతో మాట్లాడతా' అంది ఇంకో జీవి. 

'ముందు నీ పెళ్ళాంతో రోజూ కాసేపు మాట్లాడు' అన్నాను


'మాతాజీ నైపోయా' అంది ఎర్రచీర కట్టుకున్న ఒక పతివ్రత

'బాగా ముదిరింది, తగ్గడం కష్టం' అన్నాను

read more " శ్రీ సూక్తులు "

కాగితపు పడవలు

అంతర్జాలపు విషంతో

మెదళ్ళు నిండిపోతున్నాయి 

మనుషుల సమాజంలో

జంతువులు ఎక్కువౌతున్నాయి


అహంకారాల బురదలతో

హృదయాలు కుళ్ళిపోతున్నాయి

అతితెలివి బ్రతుకులతో

వయసులు మళ్లిపోతున్నాయి


డబ్బు వెంట పరుగులలో

జీవితాలు చెల్లిపోతున్నాయి

బాంధవ్యాలు ఆవిరైపోతూ

జ్ఞాపకాలను చల్లిపోతున్నాయి


ఆధ్యాత్మికపు ముసుగులలో

ఆవేశాలు చల్లారుతున్నాయి

అజ్ఞానపు ఆకర్షణలతో

అవరోధాలు ఊరేగుతున్నాయి


మురికిగుంటల దారులలో

నీటిచెలమలెందుకుంటాయి?

బండరాళ్ళ కనుమలలో

నదుల జాడలెందుకుంటాయి?


వరద ముంచుకొస్తుంటే

కాగితపు పడవలెలా ఆదుకుంటాయి?

ఊర్లు తగలబడుతుంటే

ఉత్తమాటలెలా అక్కరకొస్తాయి?

read more " కాగితపు పడవలు "

17, ఫిబ్రవరి 2025, సోమవారం

చేపల పాపం

నీళ్లలో మునిగితే పాపాలు పోతాయని

చేపలంటున్నాయి

ఎడారిలో ఎగిరితే పాపాలు పోతాయని

కొంగలంటున్నాయి


చేపలను కొంగలు తింటున్నాయి

కొంగలు వలల్లో పడుతున్నాయి

వలలు ఎండకు చివికిపోతున్నాయి


చేపలూ కొంగలూ వలలూ పోయాక

పాపం !

పాపం అడుగుతోంది

'నేనెలా పోతాను?' అని

read more " చేపల పాపం "

2, జనవరి 2025, గురువారం

విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది




నేటి నుండి 12 వ తేదీ వరకూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో జరిగే బుక్ ఫెస్టివల్ లో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబరు  219  కేటాయించబడింది.

నేడు విజయవాడ పంచవటి బృందంతో మా స్టాల్ ప్రారంభించబడింది. ఆ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.

1992-1995 మధ్యలో నేను విజయవాడలో ఉన్నసమయం లోనూ, ఆ తరువాత కూడా గుంటూరులో ఉన్నంతవరకూ వీలైనప్పుడల్లా ప్రతి ఏడాదీ తప్పకుండా ఈ పుస్తకమహోత్సవాన్ని సందర్శించేవాడిని. అప్పట్లో PWD గ్రౌండ్స్ లో ఎంతో శోభాయమానంగా ఈ బుక్ ఫెస్టివల్ జరిగేది. విజయవాడ మొత్తానికీ ఆ పదిరోజులు పండుగలుగా ఉండేది. పుస్తకాభిమానులందరూ అక్కడ చేరేవారు. కానీ, గతప్రభుత్వం ఆ గ్రౌండ్ ను మార్చేసిన తర్వాత, ఆ వైభవం తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఎక్కడ పెట్టాలో తెలీక, గ్రౌండ్ కోసం వెతుక్కునే పరిస్థితి పట్టింది.

అయినా సరే, పుస్తక మహోత్సవాన్ని ఎక్కడో ఒక గ్రౌండ్ లో పెడుతున్నారు. పుస్తకాభిమానులు వెతుక్కుంటూ వెళ్లి సందర్శిస్తున్నారు. నెట్ ప్రభావంతో పుస్తకాలను చదవడం తగ్గినప్పటికీ, మొబైల్ దెబ్బకు తట్టుకుని పుస్తకం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు.

ఈ పదిరోజులలో ఏదో ఒకరోజున నేను కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ను సందర్శిద్దామని అనుకుంటున్నాను.

ఈ స్టాల్లో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. నా రచనలను అభిమానించే విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడ మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తిగారిని, ఇతర సభ్యులను కలుసుకోవచ్చు. మా సాధనామార్గం మీద గాని, జనరల్ గా ఆధ్యాత్మికమార్గం పైనగాని మీకున్న సందేహాలను తీర్చుకోవచ్చు.

బుక్ ఫెస్టివల్ మధ్యాహ్నం నుండి రాత్రి 8. 30 వరకూ ఉంటుంది. గమనించండి.

read more " విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది "

30, డిసెంబర్ 2024, సోమవారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ - 2024 ముగిసింది - పాఠకులకు సూచన

గత 11 రోజులుగా హైద్రాబాద్ లో జరిగిన పుస్తకమహోత్సవం (బుక్ ఫెయిర్) నిన్నటితో ముగిసింది.

మేము అనుకున్న  దానికంటే ఎక్కువగా పుస్తకాభిమానులు మా స్టాల్ ను సందర్శించారు. మా గ్రంధాలను కొనుగోలు చేశారు. మా భావజాలం ఎంతోమందికి చేరుతోందనడానికి, నిజమైన ఆధ్యాత్మికమార్గంలో ఎంతోమందికి  ఆసక్తి ఉందనడానికి ఇది నిదర్శనం.

ఆధ్యాత్మిక జిజ్ఞాస అనేది భారతీయుల రక్తంలోనే ఉంటుంది. అయితే, దానికి సరియైన మార్గం దొరకదు. దానికి  కారణాలు అనేకం. అటువంటి అసలైన ఆధ్యాత్మికమార్గాన్ని లోకానికి బోధించడానికే 'పంచవటి' ఆవిర్భవించింది.

అయితే, నిజమైన జిజ్ఞాసాపరులతో బాటు, ఎంతోమంది యూట్యూబ్ యూనివర్సిటీ పట్టభద్రులు కూడా మా స్టాల్ ను సందర్శించి, అక్కడ కూచున్న మా శిష్యులతో వాదన పెట్టుకుని 'ఆంజనేయుని ముందు కుప్పిగంతులన్నట్లు' తమ తమ విజ్ఞానప్రదర్శన చేయబోయారు.  వారిని చూచి మావాళ్లు నవ్వుకుని ఊరుకున్నారు.  ఇంతకు ముందులాగా ఆ ఎపిసోడ్ల నన్నింటినీ వ్రాయదలుచుకోవడం లేదు.

ఇకపోతే, మా గ్రంధాలను కొనిన జిజ్ఞాసాపరులకు ఒక సూచన !

మా భావజాలాన్ని  గురించి, మా సాధనామార్గాన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని, మా దారిలో నడవాలని అనుకుంటూ, సరియైన దారి తెలియక తపిస్తున్నవారు, లేదా, మా పుస్తకాలను చదివిన తర్వాత ఇంకేవైనా క్రొత్త సందేహాలు తలెత్తినవారు, ఆ సంశయాల నివారణార్ధం, మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని 98493 89249 అనే నెంబరులో సంప్రదించండి. మీ అన్వేషణ సమాప్తమౌతుంది. మీకు వెలుగుదారిలో ప్రవేశం లభిస్తుంది.

జనవరి 2 నుండి విజయవాడలో మొదలౌతున్న పుస్తకమహోత్సవంలో మళ్ళీ కలుసుకుందాం.
read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ - 2024 ముగిసింది - పాఠకులకు సూచన "

19, డిసెంబర్ 2024, గురువారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్

ఈరోజు నుండి హైద్రాబాద్ బుక్ ఫెయిర్ మొదలౌతున్నది. దానిలో "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు 145 వ నంబరు స్టాల్ కేటాయించబడింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడండి.

మా తెలుగు పుస్తకాల లిస్టును ఇక్కడ చూడండి.

మా పుస్తకాల టైమ్ లైన్ వీడియోను ఇక్కడ చూడండి.

బుక్ ఫెయిర్ లోకేషన్ ను గూగుల్ మ్యాప్స్ లో  ఇక్కడ చూడండి.



read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ "

18, డిసెంబర్ 2024, బుధవారం

మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల


నా కలం నుండి వెలువడుతున్న 68 వ పుస్తకంగా 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే అద్భుతమైన పరిశోధనాగ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాము.

దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి,  కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి. 

వీరందరి జీవితాలలోని వివిధఘట్టాలను 220 జాతకచక్రాల ఉదాహరణలతో క్షుణ్ణంగా వివరించడం జరిగింది.

వీరిలో ఎవరికీ సరియైన జననసమయాలు రికార్డ్ చేయబడి లేవు. కనుక అందరికీ జననకాల సంస్కరణ అవసరమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది ఎలా చేశానో కూడా ఆయా అధ్యాయాలలో వివరించాను.  జ్యోతిష శాస్త్రాభిమానులను ఈ విశ్లేషణలు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.

సంస్కృత మహాభారతం నుండి శ్రీమద్భాగవతం నుండి తీసుకున్న ఖగోళసూచనలతో శ్రీకృష్ణుని జాతకాన్ని రాబట్టటం జరిగింది. మిగతా వారికి కూడా వారి వారి జీవిత సంఘటనలతో పోల్చి జననకాల సంస్ఖరణ చేయడం జరిగింది. అంతేగాక, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరుల అసలైన జనన సంవత్సరాలను జ్యోతిషశాస్త్రపు సూత్రాల ఆధారంగా రాబట్టి నిరూపించడం జరిగింది. 

ప్రస్తుతం చరిత్రపుస్తకాలలో మనం చదువుతున్న వీరి జనన సంవత్సరాలన్నీ తప్పుల తడికలే. ఇవి యూరోపియన్ మరియు లెఫ్టిస్ట్ కుహనా చరిత్రకారులు లోకాన్ని తప్పుద్రోవ పట్టించడం కోసం  వాస్తవాలను వక్రీకరించి వ్రాసినవి. ఈ విషయాన్ని ఈ గ్రంధంలో స్పష్టంగా నిరూపించి చూపించి, వీరి అసలైన జనన సంవత్సరాలను మాత్రమేగాక, జననతిధులను, జనన సమయాలను కూడా రాబట్టి చూపించాను.

అవసరమైన చోట్ల ఆయా మహనీయుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లల జాతకాలను కూడా ఇస్తూ, వారికి వీరికి ఉన్న జాతకసంబంధాలను (జన్యు జ్యోతిషాన్ని) కూడా వివరించాను.

ఈ క్రమంలో, ఎప్పటినుంచో అంతుబట్టకుండా ఉన్న కొన్ని చారిత్రక చిక్కుముడులను సవరించాను. ఉదాహరణకు, చైతన్య మహాప్రభువు ఎలా చనిపోయారు? ఆయన యొక్క మరణం సహజమా? అసహజమా? దానికి కారణం అనారోగ్యమా? ప్రమాదమా? హత్యా? అనేది ఇప్పటికీ తేలని చిక్కుప్రశ్నగా చరిత్రకారులను వెక్కిరిస్తున్నది. దీనిని స్పష్టంగా తేల్చి, పరిష్కరించి చూపించాను.

జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.

వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.

ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.

ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.

దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 

జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.

పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా  ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.

ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.

అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.

ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు,  నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.

read more " మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల "

16, డిసెంబర్ 2024, సోమవారం

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్

హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2024 వచ్చేసింది.

డిసెంబర్ 19 నుండి 29 వరకూ 11 రోజులపాటు జరుగబోతున్న ఈ పుస్తక ప్రదర్శన, హైద్రాబాద్ లోని NTR స్టేడియంలో జరుగుతుంది. దీనిలో పంచవటి బుక్ స్టాల్ కు స్టాల్ నంబర్ - 145 కేటాయించబడింది. అక్కడ పంచవటి ప్రచురణల పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి.

మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకూ పుస్తకప్రదర్శన ఉంటుంది.

నా రచనలను అభిమానించేవారు మీకు కావలసిన పుస్తకాలను మా స్టాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.  అంతేగాక, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ గురించి, మా యోగాశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి మీకున్న సందేహాలను మా సభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.

గతంలో ఉన్న ప్రింట్ పుస్తకాలకు తోడుగా, ఎంతోమంది అడుగుతున్న ఈ క్రొత్త పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేయబడ్డాయి. స్టాల్ లో మీకు లభిస్తాయి.

1. ఆరు యోగోపనిషత్తులు

2. వెలుగు దారులు (మూడు భాగాలు)

3. మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు (రెండు భాగాలు)

4. గోరక్ష సంహిత

5. శ్రీరామ గీత

6. ముక్తికోపనిషత్తు

7. గాయత్రీ రహస్యోపనిషత్తు

8. పతంజలి యోగసూత్రములు

9. మధుశాల

10. భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము

పుస్తకాభిమానులు, నా రచనల అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్ "

26, నవంబర్ 2024, మంగళవారం

ఆశ్రమం మొదటి వార్షికోత్సవం - 5 వ సాధనా సమ్మేళనం

పంచవటి ఆశ్రమం మొదలై అప్పుడే ఏడాది గడచిపోయింది. చూస్తూ ఉండగానే ఆశ్రమవాసం ఒక ఏడాది పూర్తయింది. అందుకని మొన్న 22, 23, 24 తేదీలలో (శుక్ర శని ఆదివారాలలో) ఆశ్రమం మొదటి వార్షికోత్సవం మరియు 5 వ సాధనా సమ్మేళనాలను జరుపుకున్నాము. 

ఆశ్రమసభ్యులలో కొంతమంది ఇతరదేశాలలో ఉన్నారు. వారిలో కొంతమంది దీనికోసమే ఇండియాకు వచ్చి, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ కలసి మూడురోజులపాటు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మా గ్రూపు చిన్నదే. కానీ గట్టిది. ఓటివారు జారిపోగా, గట్టివారు మాత్రం మిగిలారు.  నాకు నచ్చకపోతే నేనే తీసేస్తుంటాను. వాళ్లకు నచ్చకపోతే వాళ్ళే వెళ్లిపోతుంటారు. 

ఏమంటే, మాకు రాశి కంటే వాసిమీదే నమ్మకం ఎక్కువ. మాకు ప్రచారాలు, ప్రసాదాల కంటే ప్రసారమే ముఖ్యం. వేషాలకంటే కావేషాల తగ్గుదలే మాకు ప్రాధాన్యం. ఆర్భాటం కంటే ఆచరణే మాకు ముఖ్యం. రోదన కంటే సాధనే మాకు ఇష్టం.

మాదైన విధానంలో యోగాభ్యాసం, ధ్యానం. ఉపదేశాలు, ఉపన్యాసాలు, కర్మయోగం, సమిష్టిజీవనం, సందేహాలు సమాధానాలు, అభిప్రాయాల కలబోతలతో మూడురోజుల రిట్రీట్ చిటికెలో గడిచిపోయింది.

దూరప్రాంతాలనుండి మాటమాటకూ ఆశ్రమానికి రాలేకపోతున్న సభ్యులకోసం జ్యోతిషశాస్త్రం, హోమియోపతి ఆన్లైన్ క్లాసులను త్వరలో మొదలుపెట్టాలన్న నిర్ణయంతో,  డిసెంబర్ జనవరి నెలలలో హైద్రాబాద్, విజయవాడలలో జరుగబోయే బుక్ ఎగ్జిబిషన్లలో పంచవటి స్టాల్లో కలుసుకుందామన్న నిశ్చయంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది. 

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను మాత్రం ఇక్కడ చూడవచ్చు.






read more " ఆశ్రమం మొదటి వార్షికోత్సవం - 5 వ సాధనా సమ్మేళనం "

2, అక్టోబర్ 2024, బుధవారం

దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం !

సనాతన హిందూధర్మానికి మరో విజయం !

వారణాశిలోని దాదాపు పది ఆలయాలనుంచి షిరిడీసాయిబాబా విగ్రహాలను నిన్న తొలగించారు. ఇది చాలా మంచి న్యూస్ !

గత పదేళ్లనుంచి అనేకమంది అసలైన హిందువులు చేస్తున్న పోరాటం కొద్దిగా ఫలితాన్ని చూపించడం మొదలైంది. నిద్రపోతున్న అమాయక హిందువులను మేలుకొలుపుతోంది. సత్యాన్ని వారికి అర్ధమయ్యేలా చేస్తోంది. కనీసం కొంతమంది హిందువులు ఇప్పటికైనా మేల్కొంటున్నారు. నార్త్ లో చైతన్యం వస్తోంది. సౌత్ లో మాత్రం ఇంకా రావడంలేదు. మన సౌత్ అంతా దండకారణ్యం కదా. ఇది రావణుని రాజ్యం. అడవిమనుషులకు జ్ఞానోదయం కలగడానికి టైం పడుతుంది మరి !

మెజారిటీ హిందువులు చాలా అమాయకులు. ఎవరేది చెబితే అది నమ్మేస్తారు. అందులోనూ, 'అనుకున్న పనులన్నీ జరుగుతాయి'  అన్న ఆశను చూపిస్తే చాలు, ఎవరినైనా నమ్మేస్తారు. మతాలు మారిపోతారు. చివరకు కన్నతల్లిని కూడా మర్చిపోతారు. వేరే ఎవరినో తన తల్లి అనడం మొదలుపెడతారు. అంత అమాయకులు ! అమాయకత్వం అన్నమాట సరికాదేమో, స్వార్థపరత్వం అంటే సరిపోతుంది. 

పచ్చి స్వార్ధపరులు మాత్రమే మాతృభూమికి, మాతృధర్మానికి ద్రోహం చేస్తారు. 

సాయిబాబాను దేవునిగా మార్చి, హిందువులను తమ మతానికి దూరంచేసి, హిందూసమాజాన్ని చీల్చే కుట్ర గత నలభైఏళ్లుగా చాలా తెలివిగా అమలు చేయబడుతోంది. దీనిని చేసినది మళ్ళీ కొందరు సోకాల్డ్ సాంప్రదాయ హిందువులే. దేవుడు కాని సాయిబాబాను దేవునిగా చిత్రిస్తూ ప్రచారాలు చేసినది, గుళ్ళు కట్టించినదీ హిందువులే. వీరిలో మహారాష్ట్ర మరియు తెలుగు బ్రాహ్మణులే ఎక్కువమంది ఉన్నారు. తమ స్వార్థంకోసం, గురువులుగా సమాజంలో చెలామణీ కావడం కోసం హిందూమతాన్ని నాశనం చేయడంలో వీళ్ళు తమ పాత్రను పోషించారు.

వేదవేదాంతాలలో ఉన్న సారాన్ని వివరించి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత బ్రాహ్మణులది. వారిది ఆచార్యస్థానం. అలాంటి స్థానాల్లో ఉన్నవారు దారితప్పి, సాయిబాబా వంటి తురకలను సాక్షాత్తు దేవునిగా మార్చి, అమాయకులైన తమ హిందూ అనుచరులను ఏమారుస్తూ వచ్చారు. గురువులది స్వార్ధం. ప్రజలది అమాయకత్వం. అందుకే వీరిద్దరిని  చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. కొండొకచో అసహ్యం కూడా వేస్తుంది.

నిజమైన హిందూమతం, సనాతనధర్మం వేదాలలో ఉపనిషత్తులలో ఉన్నది. వాటి సారం భగవద్గీత. వీటిని చదివి అర్ధం చేసుకున్నవారు, సాయిబాబా లాంటి ముస్లిం పకీర్లను ఎన్నటికీ పూజించరు.

మరొక్క వింత విషయం చెప్పనా ?

అసలైన ముస్లిములు కూడా ఫకీర్లను, దర్గాలను పూజించరు, అది ఘోరమైన పాపమని ఖురాన్ అంటుంది. ఏ ముస్లిమూ సాయిబాబాను పూజించడు. ఆయన ఒక ఫకీర్ మాత్రమే అని వారు నమ్ముతారు. అది నిజం కూడా. అంటే, ముస్లిములు కూడా చెయ్యని పాపాన్ని హిందువులు నిస్సిగ్గుగా చేస్తున్నారన్నమాట ! వినడానికి భలే ఉంది కదూ ! ఇదీ మెజారిటీ హిందువుల అమాయకత్వం !

ఎన్నో హిందూసంఘాలు ఏళ్ల తరబడిగా చేస్తున్న పోరాటం ఇప్పటికైనా కొంత ఫలితాలు చూపిస్తున్నది.  హిందువులలో కనీసం ఇప్పటికైనా కొంత చైతన్యం వస్తోంది. సంతోషం !

హిందువులారా ! కళ్ళు తెరవండి ! చీకట్లో నడవకండి ! వెలుగులోకి రండి ! మీ మతమేంటో, మీ గ్రంధాలేమి చెబుతున్నాయో, మీరేం చెయ్యాలో తెలుసుకోండి ! ఎవరేది చెబితే అదే నిజమని భ్రమించకండి ! మతాలు మారకండి ! ఎవరిని పడితే వారిని గుడ్డిగా పూజించకండి. మీ దేవతలను వదలకండి ! మీ ఆచారాలకు తిలోదకాలను ఇవ్వకండి. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు, ఈశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయస్వామి మొదలైన దేవతలు చాలరా? ఒక ముస్లిం ఫకీర్ ను దేవునిగా చేసి కూచోబెట్టి పూజించవలసిన ఖర్మ మీకేంటి?

వారణాశి హిందూసోదరులు తమలో కొంతైనా ఆత్మాభిమానం మిగిలి ఉందని నిరూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని దేవాలయాలలోనూ ఇదే పని జరగాల్సిన అవసరం గట్టిగా ఉంది !

మన తెలుగురాష్ట్రాల బండనిద్ర ఎప్పటికి వదులుతుందో మరి ?

read more " దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం ! "