Once you stop learning, you start dying

1, డిసెంబర్ 2013, ఆదివారం

'పంచవటి' సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి

పంచవటి సంస్థ నుంచి మేము తలపెట్టిన సేవా కార్యక్రమాలలో భాగంగా నిన్న గుంటూరులోని 'షిర్డీసాయి దీనజన సేవాసమితి' వారికీ 'మాతృశ్రీ వృద్దాశ్రమానికీ' కొంత ధనసహాయం చెయ్యడం జరిగింది.నేనూ,పంచవటి సభ్యుడూ మిత్రుడూ మదన్ కలసి నిన్న ఈ పని చేశాము.

'షిర్డీసాయి దీనజన సేవాసమితి' గుడ్డివారికోసం మొదలుపెట్టబడిన సంస్థ. ఇది 2/13 గుంటూరు బ్రాడీపేటలో ఉన్నది.ఇక్కడ 71 మంది గుడ్డివారు ఉండి చదువుకుంటున్నారు.వీరిలో నలుగురైదుగురు గ్రాడ్యుయేట్లూ,పోస్ట్ గ్రాడ్యుయేట్లూ కూడా ఉన్నారు.ఒకరిద్దరు మానసిక వికలాంగులు కూడా ఉన్నారు.తీరా అక్కడకి వెళ్లేసరికి మిత్రుడు పీ.ఎస్.మూర్తి గారే దాని సెక్రెటరీ అని తెలిసింది.ఆయనేదో రాజకీయ మీటింగ్ లో ఉండటం వల్ల సమయానికి అక్కడకు రాలేకపోయారు.

'మాతృశ్రీ వృద్దాశ్రమం' గుంటూరు శ్రీనగర్లో ఉన్నది.ఇందులో నలుగురు మగవారూ,22 మంది ఆడవారూ ఉన్నారు.అనాధలలో ఎక్కువగా స్త్రీలే ఉంటారు.కారణం-వారికి చదువు లేకపోవడమూ ఆస్తులు లేకపోవడమూ, స్వతంత్రంగా బ్రతికేశక్తి లేకపోవడమూ ఇలా రకరకాలైన కారణాలు ఉంటాయి.వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాధ.అందరూ వృద్ధులే.వీరిలో కొందరు బాగా ముసలివారుగా ఉన్నారు.వారి పనులు వారు చేసుకుంటూ ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ నిరాడంబరంగా ఒక కుటుంబంలా కలసి ఉంటున్నారు.

కాని అందరి ముఖాల్లోనూ ఏదో నిరాశా నిర్లిప్తతా కనిపిస్తున్నాయి.పెద్ద వయస్సులో 'నావాళ్ళు' అనుకున్నవారి నిరాదరణకు గురవ్వడం చాలా బాధాకరం.ఎంతగా సమయానికి అన్నీ జరుగుతున్నా మనస్సులో ఆ వెలితి వారిని బాధిస్తున్నట్లు కనిపించింది.

నవంబర్ నెలలో ఈ రెండు సంస్థలకూ మాకు చేతనైన ధనసహాయం చెయ్యడం జరిగింది.