అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

15, ఆగస్టు 2025, శుక్రవారం

ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్







ఒంగోలులో నేటినుండి జరుగుతున్న పుస్తకమహోత్సవంలో మాకు 28 వ నెంబరు స్టాల్ కేటాయించబడినది. పదిరోజులపాటు జరిగే దీనిలో మా గ్రంధాలన్నీ మీకు లభిస్తున్నాయి. అంతేగాక, అక్కడ పంచవటి సభ్యులను మీరు కలుసుకోవచ్చు. మాట్లాడవచ్చు.

హైదరాబాదు, విజయవాడ బుక్ ఫెయిర్ లతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదే. కానీ మాకు దగ్గర గనుక, మా స్టాల్ ను కూడా ఇక్కడ పెడుతున్నాము. ఒంగోలు ప్రాంతంలో పుస్తకప్రియులు, అందులోనూ, ఆచరణాత్మకమైన అసలైన హిందూధర్మాన్ని తెలుసుకుందామనిన జిజ్ఞాస ఉన్నవారు, ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. కానీ అమూల్యములైన మా గ్రంధాలను ఈ ప్రాంతపు ప్రజలకు కూడా పరిచయం చేద్దామన్న సత్సంకల్పంతో ఈ పనిని చేస్తున్నాము.

పంచవటి ఆశ్రమాన్ని గురించి, మా భావజాలాన్ని గురించి, అసలైన హిందూమతాన్ని గురించి తెలుసుకోవడానికి ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " ఒంగోలు పుస్తక మహోత్సవం - 2025 లో మా స్టాల్ "

11, ఆగస్టు 2025, సోమవారం

మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 73 వ పుస్తకంగా 'పది శాక్తోపనిషత్తులు' నేడు విడుదల అవుతున్నది.

ఇప్పటిదాకా నేను ప్రధానమైన వేదాంతోపనిషత్తులను, యోగోపనిషత్తులను వ్యాఖ్యానించి మా సంస్థనుండి పుస్తకములుగా ప్రకటించాను. కానీ శక్తిప్రధానములైన ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును వ్రాయలేదు. ఆ పనిని ఇప్పుడు చేశాను. ఆ వివరమంతా ఈ గ్రంధపు ముందుమాటలో చర్చించాను.

దీనిలో 1. కౌలోపనిషత్తు 2. త్రిపురా మహోపనిషత్తు 3. భావనోపనిషత్తు 4. అరుణోపనిషత్తు 5. బహ్వృచోపనిషత్తు 6. కాళికోపనిషత్తు 7. తారోపనిషత్తు 8. సరస్వతీ రహస్యోపనిషత్తు 9. త్రిపురాతాపినీ ఉపనిషత్తు 10. సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులకు నా వ్యాఖ్యానం మీకు లభిస్తుంది.

ఇవి, నాలుగువేదములనుండి తీసుకున్నవి అయినప్పటికీ, అధర్వణవేదం నుండి ఎక్కువగా ఉన్నాయి. తంత్రప్రధానములైన ఉపనిషత్తులు దానిలోనే మనకు కనిపిస్తాయి.

బ్లాగులో వ్రాతలను నేను బాగా తగ్గించినప్పటికీ, రచనావ్యాసంగానికి మాత్రం చుక్కపెట్టలేదు. ఉన్నతభావ సంప్రేరితములైన ప్రాచీనగ్రంథముల అధ్యయనము, వ్యాఖ్యానము, సాధన మరియు బోధనలు నిరాఘాటంగా మా ఆశ్రమంలో  కొనసాగుతూనే ఉన్నాయి. అవే లేకపోతే, ఈ చెత్తలోకంలో చెత్తమనుషుల మధ్యన మనం మనుగడ సాగించేదెలా మరి?

నేను సమాజానికి దూరంగా ఉంటున్నప్పటికీ, నిజమైన సాధకులకు మా ఆశ్రమం తలుపులు మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. యధావిధిగా ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఆగస్టు 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవం సమయానికి దీనితోబాటు మరికొన్ని మా అముద్రిత గ్రంధాలను ముద్రించి, మా స్టాల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది.

మా మిగతా గ్రంధాలలాగా దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
read more " మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల "

10, ఆగస్టు 2025, ఆదివారం

'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల

నేను మొట్టమొదట వ్రాసిన పుస్తకం 'శ్రీవిద్యారహస్యం'. దీని మొదటి ముద్రణ పదేళ్లక్రితం 2015 లో జరిగింది. ఆ తరువాత పాఠకుల డిమాండ్ ను బట్టి 2019 లో రెండవముద్రణ జరిగింది. ఇప్పుడు 2025 లో మూడవ ముద్రణ జరిగింది. అభిమానుల సూచనలను బట్టి ప్రతిసారీ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతున్నది.

మొదటి ముద్రణలో 1318 పద్యములున్నాయి. మూడవముద్రణలో 1731 పద్యములైనాయి. అంటే దాదాపు 400 పద్యములను అదనంగా వ్రాసి చేర్చడం జరిగింది. అంతేగాక, అదనపు అధ్యాయములను కూడా చేర్చడం జరిగింది.

ప్రస్తుతపు మూడవముద్రణలో చేర్చబడిన ముఖ్యాంశము మంత్రభాగపు వివరణ. మొదటి రెండు ముద్రణలలో మంత్రభాగాన్ని పెద్దగా స్పృశించలేదు. కారణం, మంత్రములను పుస్తకరూపంలో ఇవ్వడం ఎందుకని భావించడమే. కానీ,  శ్రీవిద్యకు మంత్రమే ప్రాణం గనుక అది కూడా ఉండాలని కొందరు అభిమానులు పదే పదే చెప్పడంతో, దానిని ఈ ముద్రణలో వివరంగా చర్చించడం జరిగింది. అయితే, గురూపదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పడం జరిగింది.

మంత్రములను పుస్తకముల నుండి గ్రహించవచ్చు. కానీ వాటియొక్క జపధ్యానవిధానములను (తంత్రమును) మాత్రం గురూపదేశపూర్వకంగానే నేర్చుకోవలసి ఉంటుంది. 

2015 తరువాత ఈ పదేళ్లలో 70 పైగా పుస్తకములను నేను వ్రాసినప్పటికీ, మొట్టమొదటిసారిగా వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' మాత్రం నేటికీ పాఠకుల అభిమానగ్రంధంగా నిలిచి ఉన్నది. నా భావజాలాన్ని, మా సాధనామార్గాన్ని చదువరులకు స్పష్టం చేస్తూనే ఉన్నది.

ఈ మూడవముద్రణ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ నెల 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవంలో 'పంచవటి స్టాల్' లో 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణతో సహా  మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఇది మా ఆశ్రమానికి దగ్గరే కాబట్టి, పుస్తకప్రాంగణంలో నేను కూడా మీకు అప్పుడపుడు కనిపిస్తాను. పుస్తకప్రాంగణంలో కలుసుకుందాం.

read more " 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల "

22, జూన్ 2025, ఆదివారం

International Yoga Day - 2025



International Yoga Day - 2025 సందర్భంగా పంచవటి శిష్యులు వారివారి ఇళ్లలో చేసిన యోగవ్యాయామాలను ఇక్కడ చూడవచ్చు.

ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఏడాదికి ఒక రోజు మాత్రమే లోకానికి 'యోగా డే'  కావచ్చు. మాకు ప్రతిరోజూ 'యోగా డే' నే. ప్రతిరోజూ యోగంతోనే మొదలౌతుంది,  యోగంతోనే నడుస్తుంది. యోగంతోనే ముగుస్తుంది. పంచవటి సాధనామార్గానికి యోగం ఒక పునాది. అందుకే మా ఆశ్రమానికి 'పంచవటి యోగాశ్రమం' అని పేరు పెట్టాను.

కనీసం కొంతమందైనా, మొక్కుబడిగా నైనా, నేడు యోగాభ్యాసం చేస్తున్నారు. అంతవరకూ మంచిదే. పట్టుబట్టి మంచిని నేర్పకపోతే చుట్టూ ఉన్న చెడు లోపలి ప్రవేశించే ప్రమాదం గట్టిగా ఉంది.

కనీసం ఆరోగ్యం కోసమైనా యోగాభ్యాసం చేయడం మొదలుపెడితే, మీ అదృష్టం బాగుంటే, అసలైన యోగశాస్త్రమేమిటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కడో ఒకచోట మొదలంటూ పెట్టాలి కదా !

Good luck world !

Better late than never !
read more " International Yoga Day - 2025 "

9, జూన్ 2025, సోమవారం

భట్టిప్రోలు భయంకరి

చాలా రోజుల తర్వాత శిష్యపరమాణువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే భోరుమన్నాడు.

నాకు కంగారు పుట్టింది.

'ఏమైంది నాయనా' అన్నాను కంగారు బయటకు కనపడకుండా జాగ్రత్తపడుతూ. 

'స్వామీజీకి యాక్సిడెంట్ అయింది' అన్నాడు వెక్కుతూ.

విరక్తిగా నవ్వాను.

'పిచ్చివాడా ! స్వామీజీగా మారడమే ఒక పెద్ద యాక్సిడెంట్రా. ఆ తర్వాత ఎన్ని అయితే మాత్రం లెక్కేముంది?' అన్నాను.

'అది కాదు అదికాదు ఈ ఈ ఈ ' అని వెక్కిళ్లు పెడుతూ నసుగుతున్నాడు.

'చెప్పన్నా ఏడువ్. ఏడిచన్నా చెప్పు' అన్నాను.

'మరి వాళ్లిద్దరూ ఏమయ్యారు?' అన్నాడు.

'ఎవరా ఇద్దరు?' అన్నాను.

'అదే చిన్నమస్త, ప్రత్యంగిర?' అన్నాడు.

'చిన్నమస్త చీరాల కెళ్ళింది, ప్రత్యంగిర పాలకొల్లులో ఉంది' అన్నాను.

'మిమ్మల్ని అడగడమంత బుద్ధి తక్కువ ఇంకేమీ ఉండదు' అన్నాడు కోపంగా.

'తెలుసుకున్నావ్ గా ! ఇక దయచెయ్' అని తలుపెయ్యబోయాను.

'సారీ గురూజీ. ఏదో నోరు జారి మనసులో మాట బయటకొచ్చింది. ఇకమీద రానివ్వను జాగ్రత్తగా ఉంటాను, నా డౌటు తీర్చండి మరి' అన్నాడు.

'ఒక కథ చెబుతా వింటావా?' అడిగాను.

'ఓ ! చెప్పండి' అన్నాడు చతికిలబడుతూ.

'అనగనగా ఒక పోపు గారున్నారు. కోట్లాదిమంది కాథలిక్కులు ఆయన్ను దైవంగా కొలిచేవారు. ఆయన పిలవకుండానే జీసస్ పలుకుతాడని, దేవుడితో డైరెక్ట్ హాట్ లైన్ ఆయనకుందని అనుకునేవారు. ఏ భక్తుడొచ్చి ఏ కష్టం చెప్పుకున్నా ఆయన ఆశీర్వాదంతో తగ్గిపోయేది. పెద్దపెద్ద దేశాధినేతలే ఆయన దర్శనం కోసం వచ్చేవారు. ఇదిలా ఉండగా,  వన్ ఫైన్ మార్నింగ్ పోపుగారు జబ్బుపడ్డారు. బెస్ట్ డాక్టర్లు మందులిచ్చినా తగ్గలేదు. చక్రాల కుర్చీకి అంకితమైపోయారు. అప్పుడొక విచిత్రం జరిగింది' అని ఆపాను, పరమాణువు ఫీలింగ్స్ గమనిస్తూ.

'ఏం జరిగింది గురూజీ? కొంపదీసి జీసస్ గాని ప్రత్యక్షమయ్యాడా?' పరమాణువు పగిలిపోయేలా ఉంది.

'అదేం జరగలేదు. "పోపుగారి ఆరోగ్యం కోసం భక్తులందరూ దేవుడిని ప్రార్ధించండి" అని వాటికన్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అంటే, పాతపేషంట్లే ఇప్పుడు డాక్టరుకు వైద్యం చెయ్యాలన్నమాట' అన్నాను.

పరమాణువు నోరెళ్లబెట్టాడు.

'మరి పోపుకీ, దేవుడికీ ఉన్న హాట్ లైన్ ఏమైంది? తెగిపోయిందా? పోపుని దేవుడు చూసుకోడా? భక్తులు ప్రార్ధించడం ఎందుకు? దేవుడికీ పోపుకీ చెడిందా?' అని నీలాంటి ఒక భక్తుడే అడిగాడు. నేనేం చెప్పాలి?' ప్రశ్నించాను.

నోరు అలాగే ఉంది.

'మూసుకో. ఇంకో కథ విను. అనగనగా ఒక శ్రీవిద్య గురువుగారున్నారు. అంటే సిన్మాయాక్టర్ శ్రీవిద్యకు గురువు కాదు. నేర్పించే గురువన్నమాట. "క్షేమంకరీ మంత్రం జపించండి' మీకు ఏ ఆపదా రాదు" అని నీలాంటి పరమాణువులకు ఊదరగొట్టేవాడు. ఒకరోజున అదే మంత్రాన్ని ఒక రెండొందలమంది శిష్యసమూహానికి ఉపదేశించి, తన ఊరికి తిరిగి వస్తుండగా, ఈయన కారుకే యాక్సిడెంట్ అయింది. కట్ చేస్తే, గురువుగారు ఆస్పత్రిలో బెడ్ పైన. ఒళ్ళంతా కట్లు. కాలేమో సీలింగుకు వేలాడుతోంది. అప్పుడు కూడా మరో విచిత్రం జరిగింది' మళ్ళీ సస్పెన్స్ లో ఆపాను.

పరమాణువు లేచి నిలబడ్డాడు.

'నేను తట్టుకోలేను గురూజీ. త్వరగా చెప్పి నన్ను రక్షించండి. క్షేమంకరి బెడ్ పక్కన ప్రత్యక్షమైందా?' అన్నాడు ఏడుస్తూ.

'ఆపేయ్ వెధవేడుపు. అంత ఊహించుకోకు. అలాంటివాళ్ళెవరూ రాలేదు. 'గురువు గారు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఆయన క్షేమంకోసం భక్తులందరూ క్షేమంకరిని ప్రార్ధించండి' అంటూ ఆశ్రమం నుండి ప్రెస్ రిలీజ్ మాత్రం వచ్చింది'

'అప్పుడేమయింది?' నిరాశగా అన్నాడు పరమాణువు.

'ఏమౌతుంది? మామూలే. 'స్వామీజీని క్షేమంకరి ఎందుకు రక్షించలేదు. వాళ్ళిద్దరికీ చెడిందా?' అని వారి భక్తుడే ఒకాయన నన్నడిగాడు' అన్నాను.

'అసలూ, అందరి భక్తులూ మిమ్మల్నే ఎందుకడుగుతారు?' డౌటు వెలిబుచ్చాడు పరమాణువు.

కోపంగా చూశాను.

'అనుమానిస్తున్నావా ! మూర్ఖుడా ! భట్టిప్రోలు భయంకరిని ప్రయోగిస్తా నీ మీద. జాగ్రత్త !' అన్నాను గర్జిస్తూ.

భయపడ్డాడు.

నేను కొనసాగించాను.

'అనగనగా ఇంకో స్వామీజీ గారున్నారు.  రమ్మంటే రాజశ్యామలే కదిలి వస్తుందంటారు. హోమాలు చేసి ప్రభుత్వాలనే మార్చేస్తామంటారు. అవతలివాళ్ళు వారాహిని ప్రయోగించారు. రాజశ్యామల రాజమండ్రికి పారిపోయింది. ఇప్పుడు స్వామీజీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు' అన్నాను.

'అంటే, అందరికంటే వారాహి పవర్ ఫుల్ అంటారా గురూజీ?' అడిగాడు.

'వాళ్ళెవరూ నాకు పరిచయాలు లేరు నాయనా. అసలు వాళ్లంతా ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు. తెలిస్తే ఇలా ఎందుకుంటాను?' అంటూ ఇంకో కథను మొదలుపెట్టాను.

'అనగనగా ఇంకో స్వామీజీ ఉన్నారు. చిన్నమస్తతో చిత్రాలు చేస్తానంటారు. ప్రత్యంగిరతో పల్టీలు కొట్టిస్తానంటారు. వేలాది భక్తులకు వేవిళ్లు తెప్పించానంటారు. ఆయనకీ యాక్సిడెంట్ అయింది. ఆస్పత్రి, కట్లు, కాలు, సీలింగ్ . అన్నీ మామూలే' అని ఆపాను.

'అర్ధమైంది గురూజీ. తర్వాత కథ నేను చెప్తాను' అన్నాడు ఉత్సాహంగా.

ముచ్చటేసింది. 

'చెప్పుకో' అంటూ కుర్చీలో వెనక్కు వాలాను.

'చిన్నమస్త, ప్రత్యంగిరలు ప్రత్యక్షం కాలేదుగాని, యధావిధిగా ఆశ్రమం నుండి ప్రెస్ రిలీజ్ వచ్చింది. ''భక్తులెవరూ ఆస్పత్రికి వచ్చి డిస్ట్రబ్ చేయద్దు. మీమీ ఇళ్లలోనే ఉండి, చిన్నమస్తను చిన్నగాను, ప్రత్యంగిరను పెద్దగాను జపాలు చెయ్యండి. స్వామీజీ కోలుకోవడం కోసం ప్రార్ధించండి' అనేది దాని సారాంశం'' అన్నాడు పరమాణువు.

'పర్లేదోయ్. ఎదుగుతున్నావ్. వెరీ గుడ్. ముందుకెళ్లు' అన్నాను.

అప్పుడు నాలాంటి ఒక పరమాణువు వచ్చి, 'ఎందుకిలా జరిగింది గురూజీ? వాళ్లిద్దరూ ఏమయ్యారు? హాట్ లైన్ ఏమై పోయింది? ఇన్నాళ్లూ తమ కష్టాలు తీర్చిన స్వామీజీ కోలుకోవాలని ఆ భక్తులే ప్రార్ధించవలసిన పరిస్థితి రావడం ఏంటి? ఇదంతా గందరగోళంగా ఉంది? నాకేమీ అర్ధం కావడం లేదు. స్వామీజీకి వాళ్ళిద్దరికీ చెడిందా? అసలేమైంది? నా డౌట్ తీర్చండి' అని మిమ్మల్ని అడిగాడు' అన్నాడు పరమాణువు.

'కరెక్ట్ గా చెప్పావ్' అన్నాను భుజం తడుతూ.

పరమాణువు దుఃఖం మాయమైంది. 'మరి నా డౌటు?' అన్నాడు సూతనోత్సాహంతో.

'నీ డౌటూ నా డౌటూ ఒకటే. జీససు, క్షేమంకరి, చిన్నమస్త, ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి ఈ దేవతలున్నారు చూశావూ, అంతా బాగున్నపుడు పలికిన వీళ్ళందరూ, నిజంగా అవసర సమయంలో మాత్రం ఎందుకు ముఖాలు చాటేస్తున్నారు? అన్నదే ఆ డౌటు. ఇది నీదీ నాదీ మాత్రమే కాదు. బుర్ర ఉండి, లాజికల్ గా ఆలోచించగలిగిన ప్రతివాడిదీ ఇదే డౌటు. నువ్వు ఆన్సర్ చెప్పు' అన్నాను.

'నాకు బుర్ర ఉంటే మీ దగ్గరకెందుకొస్తాను?' అన్నాడు.

'వెరీ గుడ్ ఆన్సర్. కుజుడు రాశి మారాక నీ బుర్ర పాదరసమై పోయింది. విను చెప్తా' అంటూ ఇలా ముగించాను.

'చిన్నమస్త చీరాల కెందుకెళ్ళిందో తెలుసా? అదామె పుట్టినిల్లు. రాజశ్యామల రాజమండ్రి కెందుకెళ్ళిందో తెలుసా? అదామె మెట్టినిల్లు. ప్రత్యంగిర పాలకొల్లు కెందుకెళ్ళిందో తెలుసా? అదామె పడకటిల్లు. వారాహి వరంగల్లు కెందుకెళ్ళిందో తెలుసా? అదామె వంటిల్లు. జీసస్ జెరూసలేం కెందుకెళ్లాడో తెలుసా. అదాయనను పూడ్చినిల్లు'. అన్నాను.

' ఛీ అదేంటి గురూజీ. పుట్టినిల్లు బాగుంది గాని, పూడ్చినిల్లేంటి అసహ్యంగా' అన్నాడు.

'నోర్ముయ్, ఫ్లో కి అడ్డురాకు. పుట్టినిల్లు ఉన్నపుడు పూడ్చినిల్లు కూడా ఉంటుంది. ఏం? వాళ్ళకి మాత్రం కాస్త వెకేషన్ వద్దా? సరదాలు ఉండవా? ఉండకూడదా? పద్దాక పిలుస్తుంటే వాళ్ళుమాత్రం ఎందుకు పలుకుతారు? వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే పలకలేదు. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్ మోగుతుంటే నువ్వు మాత్రం ఎత్తుతావా? ఇదీ అంతే. ఎంత దేవతలైనా వాళ్లకూ కొంచెం రెస్టు కావాలి కదా. తీసుకుంటున్నారు. వీళ్ళని పట్టించుకోలేదు. అందుకే ఇవన్నీ జరిగాయి. వెరీ సింపుల్' అన్నాను.

'అదికాదు గురూజీ. మిగతావాళ్ల సంగతి నాకు తెలీదుగాని, మా స్వామీజీకి మాత్రం వాళ్లిద్దరూ ఎప్పుడూ పక్కనే ఉంటారు. వాళ్ళు కార్లో ఉండగా ఇలా ఎలా జరిగిందో?'  పాదరసం మళ్ళీ పనిచేసింది.

'ఉండబట్టే జరిగింది' అన్నాను.

మళ్ళీ నోరు.

'మూసేయ్ వెధవనోరు. దేవతలు గుళ్లలో ఉండాలిగాని, మన రోడ్లమీద కార్లల్లో తిరక్కూడదు. తిరిగితే ఇలాగే అవుతుంది. అయినా, వాళ్ళు దేవతలు కదా, యాక్సిడెంట్ టైంలో  విండోలోంచి బయటకు దూకేసి ఉంటారు. తప్పించుకున్నారు. ఈయన  దూకలేకపోయాడు. సింపుల్ ' అన్నాను.

'అర్ధమైంది గురూజీ. నా జన్మ ధన్యమైంది, ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?' అన్నాడు పరమాణువు.

'మీ ఇంట్లో బావుందా?' అడిగాను.

'ఉంది. ఎందుకు?' అడిగాడు అనుమానంగా.

నీకిప్పుడు 'భట్టిప్రోలు భయంకరి' మంత్రం ఉపదేశిస్తాను. ఇంటికెళ్లి, ఎవరితో పలక్కుండా సూటిగా దొడ్లోకెళ్లి బావిలో దూకు, అందులోనే మూడురాత్రుళ్ళూ మూడు పగళ్ళూ ఉండి ఈ మంత్రం జపించు' అన్నాను.

'అప్పుడేమౌతుంది గురూజీ' అన్నాడు భక్తితో తేలిపోతూ.

'ఏమీ కాదు. స్పృహ తప్పుతుంది. తాళ్ళేసి పైకి లాగుతారు. ఆస్పత్రిలో స్వామీజీ పక్కన బెడ్ దొరుకుతుంది. అప్పుడాయన్నే నీ సందేహం అడుగు. నీకు సరియైన జవాబొస్తుంది. ప్రాబ్లం సాల్వ్' అన్నాను.

'భలే ఐడియా. సరే గురూజీ. ఉపదేశించండి' తొందరపడ్డాడు.

'మరి పదిలక్షలు తెచ్చావా?' అడిగాను.

'అదేంటి?' అడిగాడు అయోమయంగా.

'మంత్రాలు ఊరకే వస్తాయనుకున్నావురా మలపసన్నాసి? పోయి డబ్బులు తెచ్చుకో. అప్పుడే నీ ముఖం నాకు చూపించు. ఈ లోపల మళ్ళీ ఒచ్చావంటే చంపుతా. ఫో' అంటూ బయటకు తోసి తలుపేశా.

'హమ్మయ్య' అనుకుంటూ వెనక్కు తిరిగేసరికి, సోఫాలలో ఎవరెవరో కూచుని ఉన్నారు.

'ఎవరు మీరంతా?' అడిగాను భయం భయంగా.

'నేను ప్రత్యంగిర. అది చిన్నమస్త. ఈమె రాజశ్యామల. ఈయన జీసస్. ఇది వారాహి' అంది ఒకామె.

'మరి ఆమె?' అన్నాను మౌనంగా ఉన్న ఒకామెవైపు చూస్తూ. 

'నేనేరా. భట్టిప్రోలు భయంకరిని. నన్నేగా పదిలక్షలకు అమ్మబోయావ్ ఇప్పుడే. నీ పని చెప్పడానికే వచ్చాంరా అందరం' అని సోఫాలోనుంచి లేచింది ఆమె. ఆమెతోబాటు అందరూ లేచి నిలబడ్డారు.

నాకు స్పృహ తప్పింది.

read more " భట్టిప్రోలు భయంకరి "

16, మే 2025, శుక్రవారం

గురుగోచారం - మే 2025

నిన్న, గురుగ్రహం వృషభం నుండి మిధునం లోకి మారింది. తెలిసినవారికి వారి జీవితాలలో అనేక మార్పులు కనిపిస్తాయి. తెలీనివారికి ఏ బాధా లేదు.

గతంలో లాగా, రాశిఫలాలు వ్రాయదలుచుకోలేదు. కానీ ఈ గోచారాన్ని నిర్లక్ష్యం చేయలేము కూడా. అందుకే ఈ పోస్టు. దేశఫలాలు చూద్దాం.

మిధునంలో జీవకారకుని సంచారం కదా ! అమెరికాకు నూతనోత్సాహం వచ్చింది. అందుకేనేమో, 'యుద్ధాన్ని ఆపింది నేనే' అంటోంది. అంతేకాదు. ఇప్పటివరకూ టెర్రరిస్టులుగా తనే ముద్రవేసిన వాళ్ల దగ్గరకే వచ్చి మరీ గ్రూప్ ఫోటోలు దిగుతోంది. ఇప్పటిదాకా గ్లోబల్ టెర్రరిస్టులైనవాళ్లు ఉన్నట్టుండి రాత్రికి రాత్రే చాలా మంచివాళ్లై పోయారు. ఇదేం వింతో మరి?

అంతేకాదు. 'ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారు చేయొద్దు' అని యాపిల్ సంస్థకు అమెరికా చెప్పింది. ఆఫ్కోర్స్ ! టిం కుక్ ఈ మాటను పట్టించుకోలేదనుకోండి. అది వేరే సంగతి ! ట్రంప్ మనల్నీ, రోగ్ దేశం పాకిస్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నాడు.

ట్రంప్ పక్కా వ్యాపారవేత్త. మనదేశం నుండి వేలాదికోట్ల డిఫెన్స్ డీల్స్ ఏవైనా అమెరికాకు దొరికితే హఠాత్తుగా ఇండియా ఎంతో మంచిదైపోతుంది. ప్రస్తుతం అది లేదుకదా ! అందుకని ఇప్పుడు మనం కనిపించం మరి. సహజమే !

మేషం నుండి మూడోభావంలో గురుసంచారం కదా ! పాకిస్తాన్ కు ధైర్యం తగ్గిపోతుంది. అయితే, త్వరలో రాహువు కుంభంలో లాభస్థానంలోకి వస్తాడు. అప్పటినుంచీ మళ్ళీ కుట్రలు ఊపందుకుంటాయి.  IMF (Islamic Mujahideen Fund) డబ్బులొస్తున్నాయి కదా ! వాటిని టెర్రరిస్టులకు పంచి, మళ్ళీ మన దేశంపైకి  వాళ్ళను ఉసిగొల్పుతుంది. పాకిస్తాన్ తో గట్టిగా వ్యవహరించడం ఒక్కటే దీనికి మార్గం. పొరపాటున కూడా పాకిస్తాన్ ను, బాంగ్లాదేశ్ ను నమ్మకూడదు. నమ్మితేమాత్రం వెన్నుపోటే. విశ్వాసం అనేది ఆ రక్తంలో ఉండదు. 

మకరం నుండి శత్రుభావంలో గురుసంచారం గనుక, మనకు శత్రుబాధ ఉన్నప్పటికీ అది బాగా అదుపులో ఉంటుంది. మోదీగారి సమర్ధవంతమైన నాయకత్వమే దీనికి కారణం. మోడీవంటి కళంకం లేని దేశభక్తుడు మనకు PM గా ఉండటం మన అదృష్టం అన్నది ఎంతమంది గ్రహిస్తారో మరి !

బయట చూద్దామంటే టర్కీ, చైనా, పిల్లదేశం అజర్ బైజాన్ లు మాత్రమే మనకు శత్రువులు. కానీ దేశజనాభాలో దాదాపు 40 శాతం మన శత్రువులే. బయటివారికంటే లోపలివాళ్లే చాలా ప్రమాదం. మన దేశంలో ఉంటూ 'జై పాకిస్తాన్' అన్నాడంటే వాడిని వెంటనే మోసుకెళ్లి పాకిస్తాన్ బార్డర్లో పారెయ్యాలంతే. పోలీసులు, కోర్టులు ఏవీ ఈ విషయంలో కల్పించుకోకూడదు.  లేదంటే ప్రస్తుత ఇజ్రాయెల్ పరిస్థితి ముందుముందు మనకు కూడా వస్తుంది.

గుంటనక్క టర్కీని ఆర్ధికరంగంలో బహిష్కరించడం చాలా మంచిపని. వీలైతే చైనాను కూడా అదే చెయాలి. ఆర్ధికరంగంలో దెబ్బ కొడితేనే ఎవడైనా మాట వినేది. మంచిమాటలు ఇలాంటివాళ్ల దగ్గర పనిచేయవు.

లేకపోతే, అతిమంచితనం చేతగానితనం అవుతుంది. విశ్వాసం లేని కుక్కలకు మంచితనం ఎందుకు చూపించాలి? దేశంకంటే ఏదీ ఎక్కువ కాదు కదా !

read more " గురుగోచారం - మే 2025 "

12, మే 2025, సోమవారం

మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల

నేడు బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి పండుగరోజు. అందుకని, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీస్వామివారు రచించిన  'ఆత్మవిద్యా విలాసము' అనే గ్రంధమునకు నా వ్యాఖ్యానమును మా 72 వ పుస్తకంగా ఈ పవిత్రదినాన విడుదల చేస్తున్నాము.

యోగీంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు వ్రాసిన 'సదాశివేంద్ర స్తవము' ను కూడా ఇందులో పొందుపరచాము.

స్వామివారి గురించి  ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.

'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి. 

రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.

శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.

ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.

అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.

అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే  దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !

యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.

read more " మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల "

7, మే 2025, బుధవారం

Operation Sindoor

నిర్దిష్టమైన ప్లానింగ్ తరువాత ఆపరేషన్ సిందూర్ జరిగింది.

ఆలస్యమైందని కొంతమంది ఆక్రోశించారు. కానీ, ఇటువంటి చర్యలకు ముందు చాలా ప్లానింగ్ అవసరమౌతుంది. దౌత్యపరంగా ముందు పాకిస్తాన్ ను దిగ్బంధం చేయాలి. అందుకే ఈ ఆలస్యం. నిజానికి ఇది ఆలస్యం కాదు, అవసరం.

ఉత్తరభారతంలో, సిందూరమంటే పాపటి కుంకుమ. పెళ్ళైన ఆడవాళ్లు ధరిస్తారు. మొన్న జరిగిన పహల్ గావ్ దాడిలో ఎంతోమంది సిందూరాలు చెరిగిపోయాయి. అందుకే ఈ పేరును పెట్టారులాగుంది. సరైన పేరు !

విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా చాలా బాగుంది. ఇద్దరు మహిళలు రక్షణదళాల ఆఫీసర్స్. విక్రమ్ మిశ్రీ యేమో కాశ్మీర్ పండితుల వంశానికి చెందినవాడు. ఆడవాళ్లకు కాశ్మీర్ గడ్డపైన జరిగిన అన్యాయానికి ప్రతీకారచర్యగా ఈ ముగ్గురితో ప్రెస్ మీట్ పెట్టించడం పాకిస్తాన్ ను చెప్పుతో కొట్టినట్లుగా ఉంది.

అంతేకాదు. షరియా అమలులో ఉన్న పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. బురఖా తీసి కాలేజీకి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. ఆడపిల్లలకు ప్రాధమిక స్కూల్ కూడా అందుబాటులో ఉండదు. అలాంటిది మనదేశంలో ముస్లిం మహిళలు ఎంతగా ఎదగగలరు అనడానికి కల్నల్ సోఫియా ఖురేషి ఒక ఋజువు. 'ఇండియాలో ముస్లిములకు భద్రత లేదు' అని వాదించే దొంగలు ఈమెను చూచి బుద్ధితెచ్చుకోవాలి.

మొన్న వాఘా బార్డర్ దగ్గర పాకిస్తాన్ కు పంపించబడుతున్న పాక్ పౌరులైన ఆడవాళ్ళు గోడుగోడున ఏడుస్తున్నారు. ఎందుకు? ఇండియాలో ముస్లిములకు రక్షణ లేదుకదా? మరి మీ దేశమైన పాకిస్తాన్ కు వెళ్ళడానికి అంత ఏడుపెందుకు? ఇవన్నీ దొంగనాటకాలు కావా?

అదలా ఉంటే, పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ తీవ్రవాదుల శిబిరాలున్నాయో మన ఇంటెలిజెన్స్  వర్గాలు చాలా సరిగ్గా కనిపెట్టి వాటిని బ్లాస్ట్ చేశాయి. మంచిదే. కానీ మన దేశంలోనే ఉన్న అంతర్గత శత్రువులను కూడా అదేపని చేస్తే బాగుంటుంది. మొన్న కాశ్మీరులో జరిగింది ఏమిటి? యాపిల్ అమ్ముకునేవాడినుంచి, గుర్రాలు నడుపుకుంటూ బ్రతికేవాడివరకూ అందరూ పాకిస్తాన్ కు (OGW) ఓవర్ గ్రౌండ్ వర్కర్సే. అసలైన ప్రమాదం వీళ్ళతో ఉన్నది.

మనదేశంలో పాకిస్తానీయులు బంగ్లాదేశీయులు కోట్లల్లో ఉన్నారని ఒక అంచనా. ముందు వీళ్ళను ఏరిపారేసే పనిని ప్రభుత్వం చేపట్టాలి. వీరెవరికీ దేశభక్తి ఉండదు. ఏ దేశం తిండి తింటున్నారో ఆ దేశానికే వెన్నుపోటు పొడిచే ఇలాంటి విశ్వాసం లేనివాళ్లను ముందుగా గుర్తించి వారి పని పట్టాలి. అప్పుడే ముందుముందు దేశానికి, దేశప్రజలకు రక్షణ ఉంటుంది.

ఓట్లకోసం కోట్లాదిమంది పాకిస్తాన్ బంగ్లాదేశీయులను మన దేశంలోకి రానిస్తూ, వారిని ఇండియాలో సెటిల్ కానిస్తున్న రాష్ట్రాల సంగతి ముందు చూడాలి. 'అమెరికా ఫస్ట్' అని ట్రంప్ అన్నట్లు, మనకు 'ఇండియా ఫస్ట్' అన్నదే నినాదం కావాలి. అలాంటి నేషనల్ ఫీలింగ్స్ ఉన్న నేతలనే మనం ఎన్నుకోవాలి. దేశద్రోహులను ఎన్నుకోకూడదు.

ఆపరేషన్ సిందూర్ తో వ్యవహారం అయిపోదు. ఇప్పుడే మొదలైంది. యుద్ధాన్ని మొదలుపెట్టడం తేలికే. ఆపడమే కష్టం. టర్కీ, చైనాల సహాయంతో పాకిస్తాన్ తప్పకుండా తిరుగుదాడి చేస్తుంది. ఈ యుద్ధంలో మన దేశం గెలవాలని ప్రార్ధిద్దాం. న్యూక్లియర్ వార్ గా మారకూడదని కోరుకుందాం.

టర్కీలో ప్రకృతి విలయాలు జరిగినపుడు మనదేశం ఎంతో సహాయం చేసింది. ఆహారపదార్ధాలు, మందులు, సహాయకబృందాలు అన్నింటినీ పంపి మానవత్వాన్ని చూపించాం మనం. కానీ అదే టర్కీ ఈనాడు మనకు వెన్నుపోటు పొడుస్తోంది. ముస్లిం దేశాలనుండి స్నేహాన్ని, మంచితనాన్ని ఆశించడం పొరపాటని దీనిని బట్టి అర్ధమౌతుంది. మతం ముందుకొచ్చేసరికి వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది.

మోదీగారి ప్రభుత్వాన్ని నూటికి సూరు శాతం బలపరుద్దాం. అప్పుడే మన దేశానికి భద్రతా భవిష్యత్తూ రెండూ ఉంటాయి.

read more " Operation Sindoor "

2, మే 2025, శుక్రవారం

మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల

నేడు వైశాఖ శుక్లపంచమి.  ఆదిశంకరులవారి పవిత్ర జన్మదినం.43 ఏళ్ల క్రితం, మా గురువర్యులైన స్వామి నందానందగారి సమక్షంలో సరిగ్గా  ఈనాడే నాకు ఉపనయనం జరిగింది. ఆ విధంగా, పంచవటి శిష్యులకు ఈ రోజు రెండువిధాలుగా ముఖ్యమైన రోజు అవుతున్నది.

'శంకరశ్శంకరస్సాక్షాత్' (శంకరులు సాక్షాత్తు ఈశ్వరుడే) అనిపించుకున్న మహనీయుడు పుట్టిన పవిత్రమైన రోజు ఇది. వేదములలో దాగి ఉన్న అద్వైతమునకు ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి, లోకానికి బోధించిన ఘనుడాయన. అమానుషములైన ఎన్నో పనులను కేవలం 32 ఏళ్ల చిన్న జీవితంలో సాధించిన మహనీయుడాయన.

తన పొట్ట, తన సుఖం మాత్రమే చూచుకునే అల్పులు, కోట్లాదిమంది పురుగులలాగా ఈ లోకంలో పుట్టి పోతుంటారు. కానీ ఇటువంటి దివ్యాత్ములు ఎప్పుడో ఒకసారి మాత్రమే పుడతారు. భారతజాతికి, సనాతనధర్మానికి ఒక దిశను కల్పించిన మహనీయుడాయన. వేలాది ఏళ్లకు ఒకసారి మాత్రమే అటువంటి మహనీయుల జననం జరుగుతుంది. వారి చరిత్రను నేను వ్రాసిన 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే గ్రంధంలో వివరంగా చర్చించాను.

ఇటువంటి పవిత్రమైన ఈ రోజున, మా 'పంచవటి' నుండి వెలువడుతున్న 71 వ పుస్తకంగా 'గీతా కంద మరందము' అనే గ్రంధాన్ని విడుదల చేస్తున్నాము.

ఇప్పటివరకూ మా సంస్థనుండి వచ్చిన పుస్తకాలకూ దీనికీ భేదం ఉన్నది. ఇప్పటివరకూ వచ్చిన 70 పుస్తకాలు నేను వ్రాసినవి. వాటిలో కొన్నింటిని నా శిష్యులు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదాలు చేశారు. ఈ పుస్తకం మాత్రం నా శిష్యురాలైన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసినది. మార్చి నెలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మికసమ్మేళనం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేడు E-Book గా విడుదల అవుతున్నది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఉత్తమగ్రంధాలను నేను వ్రాయడం కాదు, నా శిష్యులు కూడా వ్రాస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పనికి శ్రీకారం చుట్టింది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. అయితే, నా శిష్యురాలైన తర్వాత ఈమె కవయిత్రి కాలేదు. ముందునుంచీ ఈమెలో రచనాశక్తి, కవిత్వశక్తి ఉన్నాయి. వీరి తాతముత్తాతలు, మేనమామలు అందరూ మంచి కవులే. వెంకటేశ్వరస్వామివారిపైన పద్యములను, శతకములను ఈమె రచించింది. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి (న.ర.సం) ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం ఈ గ్రంధమును రచనచేసి, నాకు అంకితమిచ్చింది. ఇది ఈమె యొక్క నిష్కల్మషమైన మనస్సుకు, గురుభక్తికి నిదర్శనం.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారు మధురంగా ఆలపించిన 108 గీతా శ్లోకములకు మరికొన్ని శ్లోకములను చేర్చి మొత్తము 150 కంద పద్యములలో రచయిత్రి ఈ పుస్తకమును వ్రాశారు. అందుకే 'కంద మరందము' అని పేరు పెట్టారు. మకరందము అనినా, మరందము అనినా, అర్ధం ఒకటే.

అచ్చ తెలుగు కందపద్యముల నడకలో ఉన్న అందము, గీతాశ్లోకములలో ఉన్న భావగాంభీర్యతలు కలసి పాలలో తేనె కలిపినట్లుగా వీరి రచన వచ్చింది. తెలుగుపద్యముల అభిమానులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఈ గ్రంధము అమృతతుల్యముగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు.

వీరి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామివారి కటాక్షం ఈమెపైన స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

భగవద్గీతకు సమగ్రమైన వ్యాఖ్యానమును వ్రాయడం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి. దీనికి రెండు కారణాలున్నాయి.

ఒకటి - మహనీయులైనవారందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. అప్పుడుగాని వారి రచనావ్యాసంగానికి పరిపూర్ణత రాలేదు. గీతకు సమగ్రమైన వ్యాఖ్యానాన్ని మొట్టమొదటగా వ్రాసినది ఆదిశంకరులు. ఈ పనిని చేయడం ద్వారా, మహాభారతంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన అమృతభాండాన్ని బయటకు తీసి, ఆ అమృతాన్ని లోకానికి పంచిపెట్టాడాయన. ఈ పనిని ఆయన 2500 ఏళ్ల క్రితం చేశారు. 

అయితే,  ఈనాటికీ మన హిందువులలో గీతను పూర్తిగా చదవనివారు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచం నేడు గీతకు ఎంతో ఉన్నతమైన స్థానాన్నిస్తున్నది. విదేశీ విశ్వవిద్యాలయాలలో భగవద్గీతను బోధిస్తున్నారు. అన్ని మతగ్రంధాల కంటే దీనిలో అత్యంత ఉత్తమమైన భావాలున్నాయని ప్రపంచ మేధావులే ఒప్పుకుంటున్నారు. అయితే మనకు మాత్రం గీతలో ఏముందో తెలియదు. కనీసం ఒకటి రెండు శ్లోకాలు కూడా మనకు రావు. వచ్చినా అర్ధాలు తెలియవు. తెలిసినా ఆచరణలోకి రావు. ఇది మన హిందువులకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి. దీనిని పోగొట్టాలంటే, గీతకు సమగ్రమైన నిస్పాక్షికమైన వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలి.

రెండు - వేదముల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. కనుక, గీతకు సరియైన వ్యాఖ్యానాన్ని చేయగల్గితే అది వేదోపనిషత్తులను వ్యాఖ్యానించినట్లే అవుతుంది. ఇంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంటుంది?

ఈ రెండు కారణాల వల్ల ఈ ఉత్తమలక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను.

ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యానకర్తలందరూ, వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కోణాలలో మాత్రమే గీతను వ్యాఖ్యానించారు గాని, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్లుగా గీతార్ధములను వ్రాయలేదు. కొద్దో గొప్పో చలం గారు ఆ పనిని చేశారు. కానీ ఆయనకు శాస్త్రపాండిత్యం లేదు. వేదాంత-యోగపరమైన సాధనలలో లోతుపాతులూ ఆయనకు తెలియవు.

బహుశా నా సంకల్పం 2026 లో సాకారం కావచ్చు. ఈలోపల నా శిష్యురాలు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఒక చిన్నపాటి గీతను పూర్తి చేసింది. త్వరలో రాబోతున్న నా గీతావ్యాఖ్యానానికి పల్లవి (prologue) లాంటిదిగా  ఈ పుస్తకమును అనుకోవచ్చు.

కలకండను బస్తాడు తిననక్కరలేదు. ఒక చిన్నముక్కను తినినా తీపిగానే ఉంటుంది. అదేవిధంగా, అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, మన జన్మలు ధన్యం కావడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా చాలు. సంక్షిప్తగీత కూడా విక్షేపాలను అంతం చేసే నిక్షేపంలాంటి దైవమార్గంలోనే నడిపిస్తుంది, సరిగా అర్ధం చేసుకోగలిగితే.

యధావిధిగా, ఈ పుస్తకం కవర్ పేజీని అద్భుతంగా తయారుచేసిన ప్రవీణ్ కు, టైప్ సెట్టింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ పనులను చూచుకున్న అఖిలకు, పబ్లిషింగ్ ని చూచుకున్న శ్రీనివాస్ చావలికి ఆశీస్సులు. వీరంతా మా పంచవటి పబ్లికేషన్ టీమ్ రధసారధులు.

కవితారసికులు, గీతాశాస్త్రాధ్యయన తత్పరులు అయిన తెలుగుపాఠకులు ఈ గ్రంధమును ఇతోధికంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల "

1, మే 2025, గురువారం

నీడల వెంట పరుగులు

చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకున్నవారిని గతంలో ఎంతోమందిని మనం చూశాము. కానీ, సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ తగ్గిపోతున్నారని ఆత్మహత్య చేసుకున్నవారికి ఇప్పుడు చూస్తున్నాం. మిషా అగర్వాల్ కేసు వాటిలో ఒకటి. 

వారం క్రితం ఏప్రియల్ 24 న ఈమె చనిపోయింది. అప్పటికి ఆమెకు 24 ఏళ్ళు. రెండురోజులలో 25 ఏళ్ళు వస్తాయి. కాస్మెటిక్స్ రంగంలో ఎదగడం ఈమె కల. లా గ్రాడ్యుయేట్ అయిన ఈమె జ్యుడిషియల్ పరీక్షలకు తయారౌతున్నది.

పదిలక్షలమంది ఫాలోయర్స్ తన ఇంస్టాగ్రామ్ లో ఉండాలని ఈమె తీవ్రంగా కలలు కనేది. అంతమంది రాకపోగా, ఉన్నవారు కూడా క్రమేణా తగ్గిపోతూ ఉండటంతో, డిప్రెషన్ లో పడిపోయి, ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

'మనుషులను సోషల్  మీడియా పిచ్చి ఎంత దూరం తీసుకుపోతుంది?' అనడానికి ఈ అమ్మాయి ఒక నిదర్శనంగా మిగిలిపోయింది.

కామెంట్లు, లైకులు చూసుకోవడం. వ్యూయర్లు, ఫాలోయర్లు వ్రాసే 'ఆహా ఓహోలు' నిజాలనుకుని ఉబ్బిపోవడం. గ్రూపులు, గొడవలు, ఇవన్నీ బ్లాగులు వ్రాసే కొత్తలోనే, అంటే 2010 ప్రాంతాలలోనే నేను గమనించాను. ఇదొక వ్యసనమని, ఒక రొచ్చు ప్రపంచమని నాకప్పుడే అర్ధమైంది. అందుకే, వ్యూయర్స్ టాబ్ ను, ఫాలోయర్స్ టాబ్ ను, కామెంట్స్ సెక్షన్ ను నా బ్లాగ్ నుండి అప్పుడే తీసేశాను. ప్రతివారితోనూ మాట్లాడటం, వాళ్ళ కామెంట్లకు జవాబులివ్వడం, ముచ్చట్లు పెంచుకోవడం అన్నీ అప్పుడే మానేశాను.

సోషల్ మీడియా ఫాలోయర్స్ నిజంగా మనల్ని ఫాలో అవుతారని అనుకోవడం పెద్ద భ్రమ. ఆ భ్రమమైకంలో బ్రతకడం ఒక మానసికరోగం. అటూ ఇటూ అయితే ఈ రోగం తీవ్రమైన డిప్రెషన్ కు దారితీస్తుంది. ఈ అమ్మాయి కేసులో అదే జరిగింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు వాళ్లకు తోచక చేస్తుంటారు. చదివేవాళ్ళు కూడా ఏమీ తోచకనే చదువుతుంటారు. ఇది ఉత్త కాలక్షేపం మాత్రమే. దీని విలువ అంతవరకే. కొంతమంది తమ మానవసంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దీనిని ఉపయోగిస్తే, మరికొంతమంది మోసాలు చెయ్యడానికి వాడుకుంటారు. వాస్తవప్రపంచంలో లాగే దీనిలో కూడా అన్ని రకాల మనుషులూ ఉంటారు. వాస్తవప్రపంచంలో కృంగుబాటుకు ఎంత ఆస్కారం ఉందో, ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్ గా లేకపోతే రెండిట్లోనూ దెబ్బ తినక తప్పదు.

బిజినెస్ ప్రొమోషన్ కు సోషల్ మీడియాను వాడుకోవచ్చు. తప్పులేదు. కానీ చేసేపనిలో నిజాయితీ ఉండాలి. దురాశ పనికిరాదు. సోషల్ మీడియా మీద లక్షలు కోట్లు సంపాదిద్దామని భావించి, దురాశకు పోతే, చివరకు డిప్రెషన్ మిగులుతుంది. లేదా అంతు తెలియని ఈ పరుగుపందెంలో పడి హార్ట్ ఎటాక్ లు తెచ్చుకుంటారు. లేదా క్రైమ్ లో ఇరుక్కుంటారు.

కలల్లో బ్రతకడం, ఐడెంటిటీ క్రైసిస్, ఇతరుల కంటే తానేదో గొప్ప అన్న భ్రమలో ఉండటం, ఫాలోయర్స్ కౌంటు చూసుకుంటూ మురిసిపోతూ కలల్లో తేలిపోవడం - ఇవన్నీ మానసిక రోగలక్షణాలు. మిషా అగర్వాల్ వంటి అభాగ్యులు వీటికి బలౌతూ ఉంటారు.

ఈ అమ్మాయి 26-4-2000 న పుట్టింది. ఆనాటి జాతకంలో డిప్రెషన్ లక్షణాలు, జీవితంలో ఫెయిల్ అయ్యే పోకడలు, ఆత్మహత్య చేసుకునే యోగాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంతకు ముందైతే వాటన్నిటినీ వివరించి పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. చాలామంది సూయిసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ జాతకాలు అలా వ్రాశాను కూడా. ఇప్పుడు రూటు మార్చాను. దగ్గరివారికి కొందరికి మాత్రమే ఆ జ్యోతిష్యకోణాలను వివరిస్తున్నాను.

సోషల్ మీడియా యొక్క కృత్రిమప్రపంచంలో నీడల వెంట పరిగెత్తడం చివరకు ఎక్కడకు తీసుకుపోతుందో ఈ అమ్మాయి కేసులో రుజువైంది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు AI విప్లవం వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో? ప్రపంచజనాభాలో సగంమంది పిచ్చోళ్ళు అయ్యే అవకాశం మాత్రం గట్టిగా కనిపిస్తున్నది.

సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక చిన్నభాగంగా ఉండాలి. అంతేగాని అదే ప్రపంచమై పోయి, చివరకు వాస్తవప్రపంచాన్ని మర్చిపోయే స్థితికి మనల్ని తీసుకుపోకూడదు.

అదే జరిగితే, చివరకు ఇలాగే అవుతుంది.

read more " నీడల వెంట పరుగులు "