25, మార్చి 2025, మంగళవారం
6 వ సాధనా సమ్మేళనం విశేషాలు
21, మార్చి 2025, శుక్రవారం
మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు
నేడు మార్చి 21. ఈక్వినాక్టియల్ డే
మన భాషలో చెప్పుకుంటే, వసంత విషువత్ దినం. ఈరోజున సూర్యుడు సరిగ్గా భూమధ్యరేఖపైన ఉంటాడు. కనుక, భూమిపైన పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి. చూడగలిగేవాళ్లకు ప్రకృతిలో అంతటా నేడు సమత్వం కనిపిస్తుంది. అందుకే నేటినుండి మూడు రోజులపాటు పంచవటి ఆశ్రమంలో సాధనాసమ్మేళనం మొదలైంది.
మా విధానం ప్రత్యేకత ఏమిటి?
కులాల కుళ్ళుకూ, మతాల మత్తుకూ, పూజల పుచ్చులకూ, ఆచారాల మెచ్చులకూ, ఫకీర్ల గుళ్ళకూ, రాక్షసదీక్షల బళ్లకూ, మైకుల గోలకూ, టీవీల జోలకూ, పాండిత్య ప్రదర్శనలకూ, వ్యాపార విమర్శనలకూ, మెట్ట వేదాంతాలకూ, పొట్ట వైరాగ్యాలకూ, ఈజీచెయిర్ తీర్పులకూ, లేజీలైఫ్ కూర్పులకూ, వీటన్నింటికీ భిన్నమైన, అసలైన, సర్వసమగ్ర సనాతన సాధనామార్గాన్ని, కులంతో, ధనంతో, ఆస్థిఅంతస్థులతో సంబంధం లేకుండా, అందరికీ సమానంగా బోధించే మహత్కార్యంలో భాగంగా ఈ సాధనాసమ్మేళనం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూలగ్రామంలో ఈ ఆధ్యాత్మికవిప్లవం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. అనుసరించేవారు, ఆచరించేవారు, పాలుపంచుకుంటున్నవారు అదృష్టవంతులు.
విపక్షుల గురించి చెప్పడానికేముంది? అవి పక్షులే.
21, ఫిబ్రవరి 2025, శుక్రవారం
శ్రీ సూక్తులు
'కుంభమేళా కెళ్ళొచ్చా' అన్నాడొకడు
'కుంభం లాంటి ఆ పొట్ట తగ్గించు ముందు' అన్నాను.
'కుండలినీ యోగం నేర్చుకుంటున్నా' అన్నాడొకడు
'బండలాంటి నీ గుండెను ముందు మెత్తగా మార్చు' అన్నాను.
'సుషుమ్నా క్రియను అభ్యాసం చేస్తున్నా' అన్నాడింకొకడు
'కర్మ ఎలా చేయాలో ముందు నేర్చుకో. క్రియలు అవే జరుగుతాయి' అన్నాను.
'నా కుండలిని నిద్ర లేచింది ' అన్నాడొకడు
' నాదస్వరం సరిగా ఊదు. లేకపోతే కాటేస్తుంది ' అన్నాను
'బాబాజీ క్రియాయోగంలో దీక్ష తీసుకున్నా' అన్నాడు మరోవాడు.
'ఆయనెప్పుడో పోయాడు. ఇంకెన్నాళ్లు బ్రతికిస్తారు?' అడిగాను
'మాది అద్వైతమార్గం' అంది ఒకామె.
'ఆ చెప్పడంలోనే తెలుస్తోంది మీ అద్వైతం' అన్నాను.
'నేను శ్రీవిద్యోపాసకురాలిని' అని ఇంకొకామె.
'పాసనాలు తగ్గడానికి ముందు మందేసుకో' అన్నాను
'మాది పెద్దలమార్గం' అన్నాడింకొకడు.
'వాళ్ళు తాగినవి నేతులా? డాల్డానా?' అడిగాను
' ఏ సాధనా అక్కర్లేదు' అంది ఇంకొకామె
'ఏమీ సాధించలేని జీవితం అంతే అంటుంది' అన్నాను
'సూక్ష్మలోకాలు చూశా' అన్నాడు ఇంకో మానవుడు
'ఈ లోకాన్ని సరిగ్గా చూడు ముందు' అన్నాను
'ఆత్మలతో మాట్లాడతా' అంది ఇంకో జీవి.
'ముందు నీ పెళ్ళాంతో రోజూ కాసేపు మాట్లాడు' అన్నాను
'మాతాజీ నైపోయా' అంది ఎర్రచీర కట్టుకున్న ఒక పతివ్రత
'బాగా ముదిరింది, తగ్గడం కష్టం' అన్నాను
కాగితపు పడవలు
అంతర్జాలపు విషంతో
మెదళ్ళు నిండిపోతున్నాయి
మనుషుల సమాజంలో
జంతువులు పెరిగిపోతున్నాయి
అహంకారాల బురదలతో
హృదయాలు కుళ్ళిపోతున్నాయి
అతితెలివి బ్రతుకులతో
వయసులు మళ్లిపోతున్నాయి
డబ్బు వెంట పరుగులలో
జీవితాలు చెల్లిపోతున్నాయి
బాంధవ్యాలు ఆవిరైపోతూ
జ్ఞాపకాలను చల్లిపోతున్నాయి
ఆధ్యాత్మికపు ముసుగులలో
ఆవేశాలు చల్లారుతున్నాయి
అజ్ఞానపు ఆకర్షణలతో
అవరోధాలు ఊరేగుతున్నాయి
మురికిగుంటల దారులలో
నీటిచెలమలెందుకుంటాయి?
బండరాళ్ళ కనుమలలో
నదుల జాడలెందుకుంటాయి?
వరద ముంచుకొస్తుంటే
కాగితపు పడవలెలా ఆదుకుంటాయి?
ఊర్లు తగలబడుతుంటే
ఉత్తమాటలెలా అక్కరకొస్తాయి?
17, ఫిబ్రవరి 2025, సోమవారం
చేపల పాపం
నీళ్లలో మునిగితే పాపాలు పోతాయని
చేపలంటున్నాయి
ఎడారిలో ఎగిరితే పాపాలు పోతాయని
కొంగలంటున్నాయి
చేపలను కొంగలు తింటున్నాయి
కొంగలు వలల్లో పడుతున్నాయి
వలలు ఎండకు చివికిపోతున్నాయి
చేపలూ కొంగలూ వలలూ పోయాక
పాపం !
పాపం అడుగుతోంది
'నేనెలా పోతాను?' అని
2, జనవరి 2025, గురువారం
విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది
నేడు విజయవాడ పంచవటి బృందంతో మా స్టాల్ ప్రారంభించబడింది. ఆ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.
1992-1995 మధ్యలో నేను విజయవాడలో ఉన్నసమయం లోనూ, ఆ తరువాత కూడా గుంటూరులో ఉన్నంతవరకూ వీలైనప్పుడల్లా ప్రతి ఏడాదీ తప్పకుండా ఈ పుస్తకమహోత్సవాన్ని సందర్శించేవాడిని. అప్పట్లో PWD గ్రౌండ్స్ లో ఎంతో శోభాయమానంగా ఈ బుక్ ఫెస్టివల్ జరిగేది. విజయవాడ మొత్తానికీ ఆ పదిరోజులు పండుగలుగా ఉండేది. పుస్తకాభిమానులందరూ అక్కడ చేరేవారు. కానీ, గతప్రభుత్వం ఆ గ్రౌండ్ ను మార్చేసిన తర్వాత, ఆ వైభవం తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఎక్కడ పెట్టాలో తెలీక, గ్రౌండ్ కోసం వెతుక్కునే పరిస్థితి పట్టింది.
అయినా సరే, పుస్తక మహోత్సవాన్ని ఎక్కడో ఒక గ్రౌండ్ లో పెడుతున్నారు. పుస్తకాభిమానులు వెతుక్కుంటూ వెళ్లి సందర్శిస్తున్నారు. నెట్ ప్రభావంతో పుస్తకాలను చదవడం తగ్గినప్పటికీ, మొబైల్ దెబ్బకు తట్టుకుని పుస్తకం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు.
ఈ పదిరోజులలో ఏదో ఒకరోజున నేను కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ను సందర్శిద్దామని అనుకుంటున్నాను.
ఈ స్టాల్లో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. నా రచనలను అభిమానించే విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడ మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తిగారిని, ఇతర సభ్యులను కలుసుకోవచ్చు. మా సాధనామార్గం మీద గాని, జనరల్ గా ఆధ్యాత్మికమార్గం పైనగాని మీకున్న సందేహాలను తీర్చుకోవచ్చు.
బుక్ ఫెస్టివల్ మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8. 30 వరకూ ఉంటుంది. గమనించండి.
30, డిసెంబర్ 2024, సోమవారం
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ - 2024 ముగిసింది - పాఠకులకు సూచన
19, డిసెంబర్ 2024, గురువారం
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్
18, డిసెంబర్ 2024, బుధవారం
మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల
దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి, కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి.
జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.
వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.
ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.
ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.
దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.
పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.
ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.
అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.
ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు, నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
16, డిసెంబర్ 2024, సోమవారం
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2024 వచ్చేసింది.
డిసెంబర్ 19 నుండి 29 వరకూ 11 రోజులపాటు జరుగబోతున్న ఈ పుస్తక ప్రదర్శన, హైద్రాబాద్ లోని NTR స్టేడియంలో జరుగుతుంది. దీనిలో పంచవటి బుక్ స్టాల్ కు స్టాల్ నంబర్ - 145 కేటాయించబడింది. అక్కడ పంచవటి ప్రచురణల పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి.
మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకూ పుస్తకప్రదర్శన ఉంటుంది.
నా రచనలను అభిమానించేవారు మీకు కావలసిన పుస్తకాలను మా స్టాల్ నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేగాక, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ గురించి, మా యోగాశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి మీకున్న సందేహాలను మా సభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.
గతంలో ఉన్న ప్రింట్ పుస్తకాలకు తోడుగా, ఎంతోమంది అడుగుతున్న ఈ క్రొత్త పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేయబడ్డాయి. స్టాల్ లో మీకు లభిస్తాయి.
1. ఆరు యోగోపనిషత్తులు
2. వెలుగు దారులు (మూడు భాగాలు)
3. మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు (రెండు భాగాలు)
4. గోరక్ష సంహిత
5. శ్రీరామ గీత
6. ముక్తికోపనిషత్తు
7. గాయత్రీ రహస్యోపనిషత్తు
8. పతంజలి యోగసూత్రములు
9. మధుశాల
10. భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము
పుస్తకాభిమానులు, నా రచనల అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.