తమిళనాడులో ప్రభుత్వం మారింది. సినిమానటుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళప్రజలు తెలుగుప్రజలకు ఏమీ తీసిపోరని మళ్ళీ ఋజువైంది.
చూడబోతే దక్షిణాదిరాష్ట్రాలకు వేటికీ దూరదృష్టి, వాస్తవికదృష్టి లేవని అర్థమౌతోంది. కాకపోతే ఒకటి ! ప్రజలకు ఛాయిస్ లేదు. నెగటివ్ ఓటు పనిచేస్తోంది. ఉన్నవాళ్లలో కాస్త మెరుగనిపించిన వాడిని ఎన్నుకుంటున్నారు. అయిదేళ్ల తర్వాత మళ్ళీ మోసపోయామని గ్రహిస్తున్నారు. మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది.
అయితే, తమిళప్రజలకు అన్నామలై నచ్చలేదు. విజయ్ నచ్చాడు.
అన్నామలై విద్యావంతుడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. IIM గ్రాడ్యుయేట్. IPS సాధించాడు. ముక్కుసూటి ఆఫీసర్. వాటిని వదిలేసి దేశంకోసం ప్రజలకోసం రాజకీయాలలోకి వచ్చాడు. అతను ప్రజలకు నచ్చలేదు.
విజయ్ సినిమాకుటుంబం నుంచి వచ్చాడు. ఇంటర్ మాత్రమే పాసయ్యాడు. తల్లిదండ్రుల అండదండలతో హీరో అయ్యాడు. ఉద్రేకాలను రెచ్చగొట్టే పంచ్ డైలాగులతో, వాస్తవదూరమైన కథలతో జనాలకు దగ్గరయ్యాడు. వాట్సాప్ గ్రూపులతో, ఇంస్టాగ్రామ్ రీళ్ళతో పార్టీ పెట్టాడు. ఆచరణలో చెయ్యలేని, పనికిరాని వాగ్దానాలు గుప్పించాడు. జనాలు మెచ్చారు. గెలిచాడు. ముఖ్యమంత్రి అయ్యాడు.
రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఏంటో చూద్దామా?
2011 లో AIADMK ఓడిపోయి DMK అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.
15 ఏళ్ల తర్వాత ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుతో DMK ప్రభుత్వం విజయ్ కి పగ్గాలు అప్పగించింది. అంటే ఈ 15 ఏళ్ల హయాంలో, 5 లక్షల కోట్ల అప్పు కాస్తా, 10 లక్షల కోట్ల అప్పుగా మారింది.
తమిళనాడు వార్షికబడ్జెట్ 3.44 లక్షల కోట్లు. అంటే, బడ్జెట్ కు మూడురెట్లు అప్పులున్నాయి. ఒక కుటుంబం దృష్టిలో మాట్లాడుకోవాలంటే, నెలకు పదివేలు సంపాదన అయితే, ముప్పై వేలు అప్పుంది. ఇదంతా ఎలా తీరాలి? ఎవరు తీర్చాలి?
ఈ తెచ్చిన అప్పులన్నీ ఎలా ఖర్చుపెట్టబడ్డాయి?
రకరకాల స్కీముల కింద ప్రజలకు కొంత పందేరం చెయ్యడం, కొంత నొక్కెయ్యడం ఇదే ఎక్కడైనా జరిగేది, జరుగుతున్నది కూడా. ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోతున్నాయి? ఏ స్విస్ బ్యాంక్ కో, ఏ సింగపూర్ కో తరలిపోతున్నాయి. అంతేగాని, రాష్ట్రంలో ఒక ఇండ్రస్ట్రీ పెట్టడంగాని, ఒక రెవెన్యూ సృష్టించే ప్లాన్ గాని లేవు. ఉద్యోగాల సృష్టి లేదు. సంపద సృష్టి లేదు. అప్పులు తేవడం, వాడుకోవడం, దేశసంపదంతా విదేశీ బ్యాంకులకు తరలిపోవడం. ఇదీ గత 70 ఏళ్లుగా జరిగింది. ఈ వరస ఒక్క తమిళనాడులోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ప్రజలు ఎక్కడైనా గొర్రెలేగా !
జనాలకు ఇదంతా పట్టదు. మన కులపోడైతే చాలు, నెలకింత అని డబ్బులిస్తుంటే చాలు, మనోళ్లు చేసే దౌర్జన్యాలు, నేరాలు అన్నీ మాఫీ చేస్తుంటే చాలు, వాడు దేవుడు.
ఈ డబ్బులన్నీ ఎక్కడనుంచి వస్తాయి? అన్న ఆలోచన ఎవడికీ లేదు. రాష్ట్రం ఎటుపోయినా మనకనవసరం ! వాస్తవాలు ఎవరికీ అక్కర్లేదు. నాలుగు డైలాగులు చెప్పి ఉద్రేకాలను రెచ్చగొట్టి, పది వాగ్దానాలు చేస్తే చాలు, ఓట్లు పడిపోతాయి. తర్వాత, మనం కట్టే టాక్స్ ని సగం నొక్కేసి, సగం మనకే పంచేసి చేతులు దులుపుకుంటారు. అదేమంటే కేంద్రం సాయం చెయ్యడం లేదంటారు. ఈలోపల రాష్ట్రం ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇలాంటి ప్రజలకు ఇలాంటి ప్రభుత్వాలు రాక ఇంకేమొస్తాయి?
ఇంకొక విచిత్రం చెప్పనా !
సమాజంలో ఏ ఉద్యోగానికైనా ఒక అర్హత కావాలి. పాతిక ముప్పై ఏళ్ళు చదువుకొని, ఎన్నో పరీక్షలు వ్రాసి, కష్టపడితే గాని ఒక స్థాయి ఉద్యోగం రాదు. కానీ రాజకీయాలకు మాత్రం ఏ విధమైన అర్హతా అవసరం లేదు.
ఆటోడ్రైవర్ మంత్రి కావచ్చు. మేకప్ మ్యాన్ ప్రభుత్వ చీఫ్ విప్ కావచ్చు. స్టూడియో బాయ్ స్పీకర్ కావచ్చు. "అనుభవం లేకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తావు నాయనా?" అంటే, "ఐఏఎస్ లున్నారు కదా, వాళ్ళని పెట్టి నడిపిస్తాం" అంటారు. వాళ్లలో నిజాయితీపరులెందరు?
UPSC లో ఏడాదికేడాది క్వాలిటీ తగ్గిపోతున్నది. మజ్జిగ పలచబడిపోతున్నది. రెండు ముక్కలు ఇంగ్లీషు గట్టిగా మాట్లాడలేని వాళ్ళు IAS, IPS అవుతున్నారు. టెన్త్ తప్పినవాళ్లు, ఇంటర్ నాలుగుసార్లు రాసినవాళ్లు UPSC లో సెలక్ట్ అవుతున్నారు. చాలామందిలో కులపిచ్చి, డబ్బుపిచ్చి చాలా ఎక్కువగా ఉంటోంది. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినవే. ఊహలు కావు.
నేను IRTS కేడర్ లో చూశాను. నిజాయితీపరులను, నిక్కచ్చిగా ఉండేవాళ్ళను, అవినీతి చెయ్యనివాళ్లను కనీసం వేళ్ళపైన కూడా లెక్కపెట్టలేము. చాలావేళ్ళు మిగిలిపోతాయి. అలా ఉంటుంది పరిస్థితి.
అది సెంట్రల్ సర్వీసయినా, స్టేట్ సర్వీసయినా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎటూ మొగ్గకుండా, అవినీతికి పాల్పడకుండా, రూలు ప్రకారం పనిచేసే అధికారులు ఎక్కడా లేరు. అందరూ ఏదో ఒకచోట పడిపోయేవారే, ఏదో ఒక పార్టీకి, ఒక భావజాలానికి కొమ్ముకాసేవారే. ఉంటే గింటే నిజాయితీపరులు ఒకరిద్దరున్నారేమో అక్కడక్కడా ! వాళ్ళనెలాగూ పక్కన పెట్టేస్తారు కాబట్టి బాధ లేదు.
అనుభవం లేని నాయకులతో, నైతికస్థాయిలేని అధికారులతో రాష్ట్రాలుగాని, దేశాలుగాని ఎలా ఎదుగుతాయో, ఎక్కడకు ఎదుగుతాయో దేవుడికే ఎరుక !
ఇకపోతే మరొక కొసమెరుపు !
తన వ్యక్తిగతజ్యోతిష్కుడిని ప్రభుత్వసలహాదారుగా నియమించిన విజయ్, అందరినుంచీ ప్రతిఘటన రావడంతో ఆ ఆర్డర్ ను మర్నాడే హడావుడిగా కేన్సిల్ చేశాడు.
ఆమాత్రం ఒత్తిడిని తట్టుకోలేనివాడు, ముందుముందు రాబోయే రాజకీయసంక్షోభాలను, బలపరీక్షలను, రాష్ట్రసమస్యలను ఎలా తట్టుకుంటాడనేది అసలైన ప్రశ్న !
మళ్ళీ, ఈ విమర్శించిన ప్రతిపక్షాలన్నింటికీ ఎవడో ఒక జ్యోతిష్కుడు, ఒక స్వామీజీ తప్పకుండా ఉంటారు. ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారి, ఎన్టీ రామారావుకు మోహన్ రెడ్డి, ఇపుడు విజయ్ కి రాధన్ పండిట్ ఇలా ప్రతి ఒక్కరికీ ఉంటారు. నార్త్ లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. రాజకీయులకు, జ్యోతిష్కులకు, స్వామీజీలకు ఉండే అక్రమసంబంధాలు లోకానికి కొత్తేమీ కాదు.
కాకపోతే, ఈ మొత్తం ప్రహసనంలో ఒక్క విషయం మాత్రం అర్ధంకావడం లేదు. పదేళ్ల తర్వాత విజయ్ సిఎం అవుతాడన్న విషయాన్ని ముందే చెప్పిన రాధన్ పండిట్ వట్రివేల్ కు, తనకు ఇవ్వబడిన పదవి ఒక్కరోజులో ఊడిపోతుందన్న సంగతి తెలుసా లేదా అనేదే ప్రశ్న ! తన జాతకం తను చూసుకోలేదా?
లోకానికి జోస్యాలు చెప్పే జ్యోతిష్కులకు, తమ జాతకం తమకే తెలీకపోవడం ఏంటో ఈ వింత !
ఎవరికీ దూరదృష్టి లేదు, సరియైన ప్లానింగ్ లేదు. నిజాయితీ లేదు, నిస్వార్ధధోరణి లేదు. ఇలాంటి తెలివిలేని దురాశాపరులైన ప్రజలతో, ఇలాంటి అవకాశవాద అవినీతి రాజకీయాలతో, అవినీతి అధికారులతో, ఈ దేశం, ఈ రాష్ట్రాలు బాగుపడటం చాలా కష్టం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప !
ఏంటా అద్భుతం?
ప్రతిరాష్ట్రానికీ ఒక యోగి, ఒక హిమంత శర్మ లాంటివాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటమే ఆ అద్భుతం. అలాంటి అద్భుతమేదీ కనుచూపుమేరలో కనిపించడం లేదు.
It happens only in India అనుకోవడం తప్ప ఈలోపల మనం చేసేదేముంది?


