10, జూన్ 2026, బుధవారం

అవతార ప్రయోజనం

'గురువుగారు ! మీ అవతార ప్రయోజనం ఏమిటి?' అని ఒక శిష్యపరమాణువు ఇప్పుడే ఫోన్లో అడిగాడు.

తడుముకోకుండా, 'చిక్కుముడులు విప్పడం, చిక్కుల్లో పడెయ్యడం' అని చెప్పాను.

'అవతలనించి మౌనం !

'ఏం !  అర్ధం కాలేదా ?' అడిగాను.

'లేదు. ఈ మాటే పెద్ద చిక్కుముడిలాగా ఉంది' అన్నాడు.

'మనసులో మాట బయటికి రానీయ్' అన్నాను.

'ఎప్పుడో 30 ఏళ్ళక్రితం తప్పిపోయిన రాజ్ కిరణ్ జాతకం ఇప్పుడెందుకు గురూగారు?' అన్నాడు చనువుగా.

'రహస్యం చెప్పనా?' గొంతు తగ్గించి గుసగుసగా అడిగాను.

రహస్యమనేసరికి మనవాడికి ఉత్సాహం ఎక్కువైపోయింది.

'చెప్పండి చెప్పండి' అన్నాడు.

'నిన్న రాజ్ కిరణ్ కనిపించి, తన జాతకం రాయమన్నాడు. సోమీ అలీ లాంటి కొందరు తనకోసం ఇంకా  వెదుకుతున్నారని, బాలీవుడ్ కూడా తనకోసం వెదుకుతోందని చెప్పాడు. ఈ సందిగ్దతకు ఆఖరుచుక్క పెట్టమన్నాడు. అందుకే రాశా' అన్నాను.

'పోయినోళ్ళ జాతకాలెందుకు గురూగారు? బ్రతికున్న మావి చెప్పచ్చు కదా !' అడిగాడు.

'నాకు బ్రతికున్నవాళ్ళు ఇష్టం ఉండరు' అన్నాను.

'మాకు చెబితే కాస్త ఉపయోగంగా ఉంటుంది కదా?' అడిగాడు.

'మీకు  ఉపయోగపడాల్సిన పని నాకు లేదు. ఎవరికి నిజంగా అవసరమో నాకు తెలుసు. వారికే పడతాను. ఇదే నా అవతార ప్రయోజనం' అన్నాను సీరియస్ గా.

'మీ ఆవతారప్రయోజనాన్ని మాకోసం కొంచెం మార్చుకోలేరా?' దీనంగా అడిగాడు.

'లేను. పెట్టెయ్ ఫోను' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

read more " అవతార ప్రయోజనం "

రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ !


ఇతను 5-2-1949 న ముంబై లో జన్మించాడు. ఆరోజు శనివారం. అశ్వని 3-4 పాదాలు, భరణీ నక్షత్రం-1 పాదం ఆరోజు నడిచాయి. సమయం తెలియదు గనుక లగ్నం తెలియదు. జననకాల సంస్కరణ చేద్దాం.

ఇతను సినిమానటుడు గనుక, వృత్తివల్లనే ఇతనికి పేరుప్రఖ్యాతులు వచ్చాయి గనుక, ఈ విశ్లేషణలో దశాంశకు ప్రాధాన్యత ఉంటుంది.

దశాంశలో ఆ రోజున మిధునంనుండి కన్యవరకు నాలుగు నవాంశలు నడుస్తాయి. ఇతని ఆకారాన్ని బట్టి, నిండైన ముఖాన్ని బట్టి, కర్కాటకరాశి సరిపోతుంది. అప్పుడు 10  లో ఉచ్ఛసూర్యుడు, 4 లో ఉచ్చ శని, 11 లో శుక్రక్షేత్రంలో ఉచ్చరాహువులతో సినిమా కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది.  కనుక,ఇతని దశాంశచంద్రుడు కర్కాటకంలో ఉండాలి. అలాంటపుడు, జననసమయం, 7. 22 am - 12. 18 pm మధ్యలో ఉంటుంది.

ఇతని కెరీర్ 1970 - 1980 మధ్యలో బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఇతనికి చంద్ర మహర్దశ జరిగింది. దశమంలో ఉన్న ఉచ్చసూర్యుడు, చతుర్దంలో ఉన్న ఉచ్ఛశని, లాభస్థానంలో ఉన్న ఉచ్చరాహువుల వల్ల ఇతను పట్టుకున్నది ఆ టైములో బంగారం అయింది.  ఇతని సినిమాలు ఈ క్రింది తేదీలలో విడుదల అయ్యాయి. ఈ తేదీలను, ఇతని జీవితపు  ఇతర ముఖ్యఘట్టాలను ఆధారాలుగా తీసుకొని సంస్కరణ చేయగా, ఇతని జననసమయం మధ్యాన్నం 12. 18 గా తేలుతున్నది.

1-1-1975 న ఇతని మొదటి సినిమా 'కాగజ్ కె నావ్' విడుదల అయింది. ఆ రోజున ఇతనికి చంద్ర-చంద్ర-చంద్ర దశ నడిచింది. అంటే, అప్పుడే చంద్రదశ మొదలైంది. దశాంశను పరిశీలిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది. చంద్రుని నుండి 10-4 ఇరుసులో ఉచ్చ శని సూర్యులు, లాభంలో ఉచ్ఛరాహువు కారకులు. 

11 -6- 1980 న, బాక్సాఫీసును బ్రద్దలు కొట్టిన 'కర్జ్' సినిమా విడుదలైంది. ఆ రోజున చంద్ర-శని-రాహు దశ నడిచింది. శనిరాహువులు దశాంశ చక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించాలి.

3-12-1982 న, మరపురాని కథతో, సంగీతంతో, సందేశంతో తీయబడిన 'అర్ద్' సినిమా విడుదల అయింది. మహేష్ భట్ తీసిన చిత్రాలన్నింటిలోకీ ఇది మరపురాని చిత్రంగా  ఈనాటికి కూడా నిలిచిపోయింది. ఆ రోజున ఇతని జాతకంలో చంద్ర-శుక్ర-రవి దశ నడిచింది. చతుర్థంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడిని దశమంనుండి  ఉచ్చ రవి వీక్షిస్తూ ఉండటం గమనించండి.

కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే. రాశిచక్రంలో చూస్తే, లగ్నాధిపతిగా కుజుడు లాభంలో ఉన్నప్పటికీ, అది శత్రుక్షేత్రం కావడం, సింహంనుండి బాధకుడైన వక్ర శనియొక్క దృష్టికి లోనవ్వడం వల్ల ఆ దశ కలిసిరాలేదు.   ఆ సమయంలో క్రమేణా ఇతనికి సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కుటుంబసమస్యలు కూడా ఎక్కువయ్యాయి.

1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. కెరీర్ దెబ్బతినడం, కుటుంబసమస్యలు ఇతన్ని డిప్రెషన్ లో పడేశాయి. మందులు వాడుతూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇతని ఖర్మకాలి సత్యసాయికి భక్తుడయ్యాడు. ఇతని వింశాంశ చక్రాన్ని గమనిస్తే, సరియైన ఆధ్యాత్మిక మార్గం దొరకాలంటే కూడా జాతకంలో పుణ్యబలం ఉండాలని నేను ఎప్పుడూ చెబుతున్న విషయం ఎంత కరెక్టో తెలుస్తుంది.

ఇతని వింశాంశచక్రంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. అక్కడనుండి పంచమమైన కర్కాటకంలో ఐదుగ్రహాలు ఉన్నాయి. కనుక మతిభ్రమించడం, భ్రమలతో కూడిన ధ్యానాలు మొదలైనవి కనిపిస్తున్నాయి. కుజుని ఉచ్ఛత్వం కూడా మొండితనాన్ని, పిచ్చిని సూచిస్తున్నది. ఉఛ్చ కుజునికి, నీచ చంద్రునికి మధ్యలో చిక్కుకుపోయిన గురువు, తన సంస్థకు తానే బందీ అయిపోయిన సత్యసాయిబాబాను స్పష్టంగా సూచిస్తున్నాడు. ఈ కర్మసంబంధం వల్లనే ఇతను సత్యసాయికి భక్తుడయ్యాడు. కానీ ఆయన వల్ల ఇతనికేమీ మేలు జరుగకపోగా, దాడికి గురై, జైల్లో పెట్టబడ్డాడు. పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది.

అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో గురుఛండాలదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?

ఈ సమయంలోనే ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది.

అది 5, జూన్ 1996. ఇతని జాతకంలో రాహు-గురు-రాహుదశ నడుస్తున్నది. ఇది గురుఛండాలదశ. ఆ రోజున ఇతను పుట్టపర్తిలో ఉన్నాడు. అంతకుముందు కొన్ని రోజులనుంచీ అక్కడ ఉంటూ, ధ్యానంలో కాలం గడిపేవాడు. గంటలు గంటలు ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. ఆ రోజున ధ్యానంలో అతనికేం అనిపించిందో తెలియదు. 

"సాయిబాబా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, నేనాయనను ఎలాగైనా కలవాలి, ఆయనను కాపాడాలి" అంటూ లోపలికి పోబోయాడు. సెక్యూరిటీవాళ్ళు అడ్డుకున్నారు.

అసలు, ప్రతివాడూ ధ్యానం చెయ్యకూడదు. అందులోనూ, డిప్రెషన్, పిచ్చిధోరణి మొదలైనవి ఉన్నవాళ్ళు దానిజోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే, ధ్యానం వికటిస్తే, మామూలు మనిషికే పిచ్చెక్కుతుంది. ఇక పిచ్చోడికి ఏమౌతుంది? అందుకే, నేటి ఆశ్రమాలలో మామూలు మనుషులకంటే పిచ్చోళ్ళే మనకు ఎక్కువగా   కనిపిస్తారు.

మనమేమో వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటాం. వాళ్ళేమో, చూసేవాళ్ళకే పిచ్చని అనుకుంటారు. ఈ పిచ్సిగోలలో, ఎవరికి పిచ్చో, ఎవరికి కాదో ఎవరు తేల్చాలి?

సరే, సాయంత్రం వరకూ ఏదోవిధంగా ఆగిన అతను, చీకటి పడుతున్న సమయంలో ఎవరిదో ట్రాక్టర్ మాట్లాడుకుని, ప్రహారీగోడ పక్కగా దానిని ఉంచి, దానిపైన ఒక నిచ్చెన వేసుకుని గోడ ఎక్కి ప్రశాంతినిలయంలోకి దూకబోయాడు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. సత్యసాయిని చంపడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అందరూ నమ్మేశారు. అతన్ని కొట్టారో లేదో మనకు తెలియదు.  అక్కడున్నదంతా పూనకపు మూర్ఖభక్తులే గనుక ఇతనిపైన దాడి  చేసే ఉంటారని మనం అనుకోవాలి.

ఇతన్ని అరెస్టు చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తరువాత బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతని తండ్రి బాంబే నుండి వచ్చి, కొడుకును విడిపించుకుని, ఆస్పత్రిలో చేర్చడము, తర్వాత బాంబేకు తీసుకువెళ్లి అక్కడ బైకుల్లా లోని మసీనా ఆస్పత్రిలో చేర్చడము జరిగిపోయాయి.

అదే సమయంలో, అంటే 10 జూన్ 1996 న ఇతనికి రాహు - శనిదశ మొదలైంది. ఇది శపితదశ. ఇక అక్కడినుంచి అసలైన కష్టాలు మొదలయ్యాయి. 

ఇతను మసీనా ఆస్పత్రిలో ఉన్నపుడే, విషయం తెలిసిన మహేష్ భట్ వెళ్లి పలకరించి  వచ్చాడు. అప్పటికే బాగా పిచ్చిలో ఉన్న రాజ్ కిరణ్ తనతో పెద్దగా మాట్లాడలేదని ఆయనన్నాడు.

గురుఛండాలదశ, శపితదశ, ఏలినాటిశనులు కలసి ఈ విధంగా ఇతని జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి.

మరింత మంచివైద్యం చేయించడం కోసం, అక్కడనుండి, ఇతని అన్నయ్య ఇతనిని అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ న్యూయార్క్ సిటీలో ఉంటూ, పిచ్చికి వైద్యం తీసుకుంటూ ఉండేవాడు. కొన్నినెలల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంటినుండి ఎక్కడికో మాయమైపోయాడు. ఆ సమయంలో రాహు-శని-కేతుదశ నడిచింది. ఆ తరువాత ఇప్పటివరకూ ఇతనెక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు.

సరిగ్గా ఇప్పుడు జ్యోతిశ్శాస్త్రం రంగప్రవేశం చేస్తున్నది !

ఇతని ఆయుష్షును లెక్కించి చూద్దాం.

ఆయుర్దాయవిధానాలు స్థూలంగా మూడున్నాయి. ఒకటి నైసర్గిక ఆయుర్దాయం, రెండు పిండాయుర్దాయం, మూడు అంశాయుర్దాయం. ఇవిగాక, జైమినిపద్ధతిలో మరొక విలక్షణమైన విధానం ఉన్నది. వీటిలో అంశాయువు, జైమినివిధానాలే చాలావరకు సరియైన ఫలితాలనిస్తాయని పండితులంటారు. అనుభవం కూడా ఇదే చెబుతోంది.

జైమినిపద్ధతి ప్రకారం చూడగా,

లగ్నాధిపతి+అష్టమాధిపతి, లగ్నము+చంద్రలగ్నము, లగ్నము+హోరాలగ్నము ఈ మూడు జతలూ చర, స్థిర, ద్విస్వభావరాశులలో ఉండేదాన్ని బట్టి ఆ జాతకుడు పూర్ణాయుష్కుడా (99-66 మధ్య), మధ్యాయుష్కుడా (66-33 మధ్య), అల్పాయుష్కుడా (33-8 మధ్య) అనేది  తెలుస్తుంది.  

లగ్నాధిపతి, అష్టమాధిపతి ఇద్దరూ కుజుడే అయ్యాడు. ఇతడు స్థిరరాశిలో ఉన్నాడు గనుక పూర్ణాయువైంది. లగ్న, చంద్రులిద్దరూ మేషంలోనే ఉన్నారు, అది చరరాశి గనుక మళ్ళీ పూర్ణాయువైంది. లగ్నమైన మేషం చరరాశి, హోరలగ్నమైన మిధునం ద్విస్వభావరాశి గనుక అల్పాయువైంది. రెండు పూర్ణాయువులు, ఒకటి అల్పాయువు వచ్చింది గనుక సరాసరిగా మధ్యాయువౌతుంది. అంటే 33 - 66 ఏళ్ల మధ్యలో ఇతను మరణిస్తాడు.  

అంశాయుర్దాయ విధానాన్ని బట్టి లెక్కించగా ఇతనికి  47 ఏళ్ల ఆయుష్షు వస్తున్నది.  ఇతను పుట్టింది 1949 లో గనుక 47 కలిపితే 1996 అవుతుంది. సరిగ్గా ఇదే సంవత్సరంలో పుట్టపర్తి సంఘటన, బెంగుళూరు జైలు, బాంబే పిచ్చాసుపత్రి, అమెరికా వెళ్లడం ఇవన్నీ జరిగాయని ఇతని జీవితం చెబుతోంది. కనుక, అమెరికా వెళ్లిన కొద్దినెలలకు ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏదో ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పవలసి వస్తున్నది. 

పోనీ 66 వరకూ ఇతని ఆయుష్షు ఉందేమో అని పరిశీలించగా, మార్చి 1999 తో రాహు-శనిదశ అయిపోయింది. రాహు-బుధదశ 1999-2001 మధ్యలో నడిచింది. బుధుని వక్రత్వం వల్ల, ఆర్గలదోషాలవల్ల ఆ సమయంలో పిచ్చి బాగా ముదిరి ఉండాలి. వెంటనే వచ్చిన రాహు-కేతుదశ 2002-2002 మధ్యలో నడిచింది. అప్పుడుగాని, ఆ తరువాత వచ్చిన రాహు-శుక్ర దశ (2002-2005) లో గాని, ఎక్కువలో ఎక్కువగా ఇతను చనిపోయి ఉండాలి. ఏమంటే, శుక్రుడు ఈ లగ్నానికి మారకుడు.

ఇప్పుడు ప్రశ్నవిధానాన్ని ఉపయోగించి చూద్దాం.

ఈ ప్రశ్నజాతకం నిన్న ఉదయం 9 గంటలకు వేసినది. లగ్నాధిపతి చంద్రుడు 9 వ భావంలో, రాహుకుజులతో ఆర్గళానికి లోనై, మారకుడైన శనితో కలసి ఉంటూ, ఈ జాతకుడు దూరదేశంలో ఒక దుర్ఘటనలో మరణించాడని చెబుతున్నాడు. 

ప్రశ్నదశ గురు రాహు బుధదశ వచ్చింది. ఇది గురుదోషంవల్ల మతిభ్రమించడాన్ని సూచిస్తుంది. ఉచ్చగురువు 9 వ అధిపతిగా దూరదేశాన్ని, 6 వ అధిపతిగా తీవ్రమైన గురుదోషాన్ని సూచిస్తున్నాడు. బాధకుడైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఇది భార్యతో గొడవలను సూచిస్తున్నది. కుటుంబస్థానంలోని కేతువు కుటుంబసభ్యులతో వియోగాన్ని సూచిస్తున్నాడు. ప్రశ్నజాతకం కాలగ్రస్తయోగంలో చిక్కుకుని ఉంటూ, తీవ్రమైన గతకర్మను సూచిస్తున్నది.

కనుక, రాహు-బుధ దశలో (1999-2001) ఇతను చనిపోయి ఉండాలి.

కనుక, రిషికపూర్ చెప్పినది, దీప్తి నావల్ చెప్పినది రెండూ కరెక్ట్ కావు. సోమీ అలీ వంటి కొందరు, రాజ్ కిరణ్ కోసం ఈనాటికీ వెదుకుతూ ఉండటం వృధాప్రయాస అని, ఇతను చనిపోయి చాలాకాలమైనదని నేను చెబుతున్నాను.

అమెరికా అన్నికోణాలలోనూ అంతమంచి దేశమేమీ కాదు. మొన్నటికి మొన్న మాయమైన నాన్సీ గుత్రీనే ఇంతవరకూ ఏమైందో అమెరికా పోలీసులే  పట్టుకోలేకపోయారు. ఇక దేశంగాని దేశంలో, అదికూడా 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన మనిషిని ఇండియానుండి ఎవరు పట్టుకోగలుగుతారు? అది జరిగే పని కాదు.

అతను మంచివాడే కావచ్చు. వేసిన పాత్రలు కూడా మంచిపాత్రలే కావచ్చు. అతనిని ఎరిగిన మనుషులు అతన్నింకా మర్చిపోలేకపోతూ ఉండవచ్చు కూడా. కానీ కర్మను ఎవరూ తప్పించలేరు. ఇప్పటి మంచితనానికీ, గతకర్మకూ సంబంధం లేదు. అతనిని వెదకడం అనవసరం !

ఇది జ్యోతిషశాస్త్రపు తీర్పు !

డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.

అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.

పెద్దవయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.

వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.

పెద్ద స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?

2017 లో వ్రాసిన ఈ జాతకవిశ్లేషణ మొదటిభాగాన్ని ఇక్కడ చూడండి.
read more " రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ ! "

29, మే 2026, శుక్రవారం

నిజమైన అవధూత









వారం పాటు బెంగుళూర్లో మకాం.

సోమవారంనాడు శ్రీ కొర్లిమర్ల చంద్రశేఖర్ బాబు గారి ఇంటికెళ్లి వారిని కలసి వచ్చాను. వారిల్లు బనశంకరిలో ఉంది. కానీ నాకు అడ్రసు తెలియదు. ఆమాటకొస్తే బెంగుళూరులో ఎక్కడేముందో కూడా నాకు తెలియదు. అందుకని, ముందుగా మెట్రోరైల్లో 'మైసూర్ రోడ్' స్టేషన్లో దిగి 'వాలెంటైన్ పబ్లిక్ స్కూల్' కు వెళ్లి, అక్కడ వారిని కలుసుకున్నాను. 

నేను వెళ్లిన సమయానికి వారు స్కూల్లో లేరు. అక్కడ స్టాఫ్ ను అడిగి వారి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ఆయన ఫోనెత్తగానే, 'నేను మీ స్కూలు నుంచి మాట్లాడుతున్నాను' అన్నాను.

ఆయన ఆశ్చర్యపోయారు.

'మీ నంబర్ నావద్ద ఉండేది. ఎలాగో పోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశాను. దొరకలేదు. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు మిమ్మల్ని అనుకున్నాను. ఉన్నట్టుండి మీరే వచ్చేశారు' అన్నారాయన.

'ఇంతకుముందు నా నంబర్ నా బ్లాగులో ఉండేది. ఎవరుపడితే వాళ్ళు ఫోన్లు చేసి పిచ్చిగోలంతా మాట్లాడుతున్నారని తీసేశాను ' అన్నాను.

2020 లో హైద్రాబాద్ లో ఉన్న రోజులలో యూజీగారి గురించి బ్లాగులో వ్రాశాను. అది చదివి ఆయన నాకు ఫోన్ చేశారు. యూజీగారి మీద ఆయన వ్రాసిన Stopped in our tracks అనే ఆణిముత్యాలవంటి పుస్తకాలను నాకు పంపించారు.  నా శ్రీవిద్యారహస్యాన్ని ఆయనకు పంపించాను. ఆ విధంగా మాకు పరిచయం ఏర్పడింది. ఈనాటికి నేనే ఆయనను వెతుక్కుంటూ వెళ్లాను.

కాసేపట్లో స్కూలుకు వచ్చి. వారి కారులో ఇంటికి తీసుకెళ్లారు. వారిని చూడటంతోనే ఎప్పటినుంచో పరిచయం ఉన్న మనిషిలా అనిపించారు.

వారి ఇంటిముందు నిలబడటంతోనే నాకు ధ్యానస్థితి మొదలైపోయింది. యూజీగారు ఎన్నోసార్లు వచ్చిన ఇల్లది. అలాంటి చోట ట్రాన్స్ కలగడం వింతెలా అవుతుంది?

ఇంటిలోకెళ్ళి చూస్తే, ఇల్లంతా యూజీగారి ఫోటోల మయం. అక్కడనుండి మొదటి అంతస్తులో యూజీగారు ఉన్న గదికి నన్ను తీసికెళ్లారు. అది 9x7 అడుగుల చిన్నగది. అద్భుతమైన ఆరా ఆ అంతస్తులోను, ఆ గదిలోనూ అలుముకొని ఉంది. ఇండియాకు వచ్చిన ప్రతిసారి ఇదే గదిలో యూజీగారు ఉండేవారు.

గత ఏభై ఏళ్లనుంచి నాకు ఆధ్యాత్మికం తెలుసు. ఎన్నోచోట్ల తిరిగాను, ఎంతో చూచాను. కానీ,  ఇటువంటి ఆరాను మూడుచోట్ల మాత్రమే నేను చూడగలిగాను. ఒకటి, రామకృష్ణులు దేహం చాలించిన కాశీపూర్ మఠం మొదటి అంతస్తులోని గది, రెండు, జిల్లెళ్ళమూడిలో అమ్మగారు నివసించిన గది, ఆ తరువాత బెంగుళూరులో చంద్రశేఖర్ గారి ఇంటిలోని యూజీగారి గది. ఈ మూడుచోట్లా ఒకటే విధమైన తరంగాలున్నాయి. ఇంతటి బలమైన స్వచ్ఛమైన ఆధ్యాత్మికతరంగాలను ఏ పుణ్యక్షేత్రంలోగాని, ప్రసిద్ధఆలయాలలో గాని, మహనీయులని చెప్పబడేవారి స్థలాలలోగాని నేను ఫీల్ కాలేదు.

'మీ ఇల్లు ఒక ఇల్లు కాదండి. ఇదొక మహాపుణ్యక్షేత్రం' అని చంద్రశేఖర్ గారితో అన్నాను.  

చంద్రశేఖర్ గారు పూర్తిగా యూజీగారితో నిండిపోయి ఉన్నారు. యూజీగారితో 40 ఏళ్ల అనుబంధం వారిది. తన చివరిరోజులలో మతిస్థిమితం సరిగ్గా లేని వాలెంటైన్ ను చిన్నపిల్లలాగా అయిదేళ్లపాటు చూసుకున్న గొప్పమనసు వారిది. సొంత తల్లిదండ్రులనే ఓల్డేజి హోములకు తోసేస్తున్న ఈ లోకంలో, తమకు సంబంధంలేని ఒక విదేశీయురాలిని చిన్నపిల్లలాగా చూసుకున్న అమృతహృదయాలు వారివి. దానికి ఒకే ఒక్క కారణం, దిక్కులేకుండా యూరప్ లో తిరుగుతున్న యూజీగారికి ఆమె ఆశ్రయం ఇవ్వడమే. వారి సంరక్షణకు ఆమెను యూజీ అప్పగించడమే.

నిరాడంబరుడైన గృహస్థుగా జీవితం గడుపుతున్న ఒక మహనీయుడిని చంద్రశేఖర్ గారిలో చూచాను. ఆయనకు సరియైన సహచారిణి ఆయన శ్రీమతిగారు. వారింట్లో ఉన్నపుడు, ఏదో ఒక ప్రాచీనకాలపు ఋష్యాశ్రమంలో ఉన్న ఫీలింగ్ నాలో కలిగింది. ఈ కాలంలో కూడా ఇటువంటి పుణ్యదంపతులు ఎక్కడైనా ఉన్నారా? అనిన సందేహం ఈరోజుతో నాకు తీరిపోయింది.

తనకోసం అరుణాచలానికి వచ్చిన జిల్లెళ్ళమూడి అమ్మగారిని చూచి చలించిపోయిన చలంగారు ఇలా అన్నారు, ' ఏడిరా నీ ఈశ్వరుడు? అని ఎవరైనా అడిగితే ఇన్నాళ్లూ చెప్పలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు చెప్పగలను'.  

అదేవిధంగా, 'మంచిమనసున్న దేవతలవంటి మనుషులు ఎక్కడైనా ఉన్నారా?' అని నన్నెవరైనా అడిగితే 'ఉన్నారు. నేను చూచాను' అని ఈరోజున చెప్పగలను.

లోకం దృష్టిలో  పెద్దపెద్ద స్వామీజీలనబడే వాళ్ళు  నన్ను కలిసినప్పుడు, కనీసం లేచి నిలబడటానికి కూడా ఇష్టపడని నేను, ఈ పుణ్యదంపతుల పాదాలను తాకి ప్రణామం చేశాను.

సోమవారం అలా  గడిచింది. నిన్న గురువారం సెలవు కావడంతో శిష్యులందరూ ఖాళీగా ఉంటారు. అందుకని మళ్ళీ నిన్న, బెంగుళూరు శిష్యులందరితో  కలసి వారి ఇంటిని దర్శించి, యూజీగారి సమక్షాన్ని వారికి కూడా రుచి చూపించాను.

ఒక్క గంటలో వచ్చేద్దామని వెళ్లిన అందరం, మూడున్నర గంటలపాటు అక్కడే ఉండిపోయాము. యూజీ గురించి ఎన్నెన్నో గతస్మృతులు, ఉన్నతమైన తాత్వికవిషయాలు చంద్రశేఖర్ గారు చెబుతుంటే కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు.

మాటలమధ్యలో యూజీగారిది ఆత్రేయసగోత్రమని తెలిసింది. అంటే దత్తాత్రేయులవారి గోత్రమే. అత్రిమహాముని వంశంలో యూజీవంటి బ్రహ్మజ్ఞాని, అవధూత జన్మించడం విచిత్రమేముంది?

నవీనకాలంలో భారతదేశంలో జన్మించిన అవధూతలలో అగ్రగణ్యునిగా యూజీగారిని నేను భావిస్తాను.

'నన్ను పూజించారంటే మీ తోలు తీస్తా' అని గర్జించడం ఒక అవధూత కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు?

'నిజమైన గురువు తననుంచి కూడా నిన్ను విముక్తుడిని చేస్తాడు' అన్న బంగారుమాటను మహేష్ భట్ తో యూజీగారన్నారు. ఈ ఒక్క మాటచాలు ఆయనేంటో చెప్పడానికి. అదీ అవధూతతత్త్వమంటే !

యూజీగారు కృష్ణాజిల్లా తెలుగువాడు.  మచిలీపట్నంలో పుట్టాడు. గుడివాడలో చదువుకున్నాడు. అటువంటి మనిషి వందలఏళ్లలో ఒక్కరు కూడా ఈ భూమ్మీద పుట్టరు. కానీ ఆయనెవరో తెలుగువారికి చాలామందికి తెలియదు.
 
అసలూ, తెలుగుప్రజలంత తెలివితక్కువవాళ్ళు ఇంకెక్కడా ఉండరనేది నా నిశ్చితాభిప్రాయం. యూజీలాంటి అసలైన అవధూతలు వాళ్ళమధ్యనే పుట్టినా వారు గుర్తించరు. నకిలీలకు మాత్రం గుళ్ళు కట్టిస్తారు. తండోపతండాలుగా మొక్కుతారు. 

పిచ్చి జనం ! పిచ్చి లోకం !

కోహినూర్ వజ్రం ఎక్కడో ఒకచోట మాత్రమే ఉంటుంది. గులకరాళ్లు మాత్రం ఎక్కడపడితే అక్కడే ఉంటాయి. ఇది లోకసహజమే. వింతేముంది? ఈ మాటను నేను చాలాసార్లు అంటుంటాను.

ఆ విధంగా, చిరస్మరణీయంగా, ఈ రోజు గడిచింది.

యూజీగారి అనుచరులైన సత్యనారాయణ, రజనిగార్లను కూడా వారింట్లో కలుసుకున్నాము.  వాళ్ళుకూడా చాలా సహృదయులు. 

యూజీగారిగురించి సమగ్రమైన సమాచారాన్ని అందించే వీరి వెబ్ సైట్ ను ఇక్కడ చూడండి. 
read more " నిజమైన అవధూత "

18, మే 2026, సోమవారం

వినాయకుడి గుడి

ఈ మధ్యన కొందరు మా ఆశ్రమానికొచ్చారు.

'మా ఫామ్ హౌస్ లో వినాయకుడి గుడి కడుతున్నాం. భోజనాలకు రండి' అని పిలిచారు.

భోజనాలంటూనే పరిగెత్తుకుంటూ పోవడం ఇక్కడ పల్లెల్లో అలవాటు.

' మేమలా భోజనాలకు రాము. ఎవరు పడితే వారు వండినవి మేము తినము' అని వారితో అన్నాము.

వాళ్లకు కాస్త కోపం వచ్చింది.

'అంతా వెజిటేరియనే, మీకేం ఇబ్బంది ఉండదు' అన్నారు వాళ్ళు.

'వెజిటేరియన్ కూడా మాకు ఇబ్బందే. అందుకే మేము రానంటున్నది' అన్నాను

వాళ్ళకర్ధం కాలేదు.

'అదేంటి? బ్రాహ్మలచేతే వండిస్తున్నాము' అన్నారు వాళ్ళు. 

'అలా అయితే అసలు రాము' అన్నాము.

వాళ్లకు ఫ్యూజులెగిరిపోయాయి.

'అదేంటి? వినాయకుడి గుడికి రారా?' అన్నారు వాళ్ళు  కోపంగా

'వినాయకుడిని చూడటానికి అక్కడకి రావడమెందుకు?' అన్నాను.

'పూజలు భజనలు ఉన్నాయి. రండి' అని బ్లాక్ మెయిల్ చేయబోయారు.

'మీరు పూజలు చేయకపోతే వినాయకుడికేం తక్కువైంది?' అన్నాను.

వాళ్ళదొక రకంగా చూసి వెళ్లిపోయారు.

పిచ్చి జనం, పిచ్చి గోల. ఒక గుడి కట్టడం, పండుగలు పబ్బాలంటూ తంతులు, మైకులతో సౌండ్ పొల్యూషన్, హుండీతో కలెక్షన్. ఇదొక్కటే ఈ పిచ్చిజనానికి తెలిసిన హిందూమతం. ఇలా చెయ్యడమేదో గొప్పని, ఇలా చెయ్యడం ద్వారా హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామని వీళ్లంతా అనుకుంటున్నారు.

అసలైన హిందూమతాన్ని, అసలైన ఆధ్యాత్మికతను అర్ధం చేసుకోవాలంటే వీళ్లంతా ఎన్ని జన్మలెత్తాలో?

read more " వినాయకుడి గుడి "

15, మే 2026, శుక్రవారం

సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం

'సనాతనాన్ని నిర్మూలించాలి' అని ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అన్నాడు. దానికి వంతపాడుతూ TVK ఎమ్మెల్యే ముస్తఫా 'సనాతనాన్ని నిర్మూలించడానికే మేము పుట్టాము' అన్నట్లుగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఊరకే చూస్తూ కూచున్నాడు.

కేరళలో కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే ఉంది. తమిళనాడులో హిందూవ్యతిరేక ప్రభుత్వమే ఒక క్రొత్త ముసుగులో మళ్ళీ వచ్చింది.  తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. ఆంధ్రా ఒక్కటే అటూ ఇటూ ఊగులాడుతోంది.

ఇది చాలా మంచి పరిణామం.

పదిహేనేళ్ల తర్వాత, రాష్ట్రం సర్వనాశనం కాబోతున్న అంచులో మాత్రమే బెంగాల్ కు బుద్దొచ్చింది. ఇప్పుడు తవ్వుతుంటే సరిహద్దులలో వందలాది సొరంగాలు బయటపడుతున్నాయి. కోటిమంది పైన బాంగ్లాదేశ్ ముస్లిములు, రోహింగ్యాలు మన దేశంలో ఇప్పటికే ఉన్నారు. బెంగాల్లో బీజేపీ రాకపోయి ఉంటే ఒకటి రెండేళ్లలో దేశం మొత్తం  పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ల చేతులలోకి వెళ్ళిపోయి ఉండేది. కనీసం చివరి నిముషంలోనైనా బెంగాలీలు కళ్ళు తెరిచారు. సంతోషం.

కానీ దక్షిణాది అయిదురాష్ట్రాలకు మాత్రం ఇంకా తెలివి రావడంలేదు. బహుశా ఇంకా ఇంకా చేతులు కాలాలేమో? అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తారేమో? 

ఈ వైరస్ ను ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు పెంచి పోషిస్తున్నాయి. వీటికెప్పుడు బుద్ధొస్తుందో తెలీదు. చూడబోతే మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదని అనిపిస్తోంది. ఇదంతా ఊహించే, ఇలా జరగాలని చాలా ముందునుంచి కోరుకునే, ఇటువంటి పరిపాలనావ్యవస్థను, ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారేమో ఘనత వహించిన నాయకులనిపిస్తోంది.

పూర్తిగా కుళ్లిపోయేదాకా కళ్ళు మూసుకోవడం, చివర్లో లబో దిబో అనడం మనకు అలవాటేగా?

తమిళనాడు హిందువులారా !  లేవకండి. ఇదేవిధంగా నిద్రపోతూ ఉండండి. 'మిమ్మల్ని నాశనం చెయ్యడానికే మేం వచ్చాం' అనేవాళ్లకే ఓట్లేసి గెలిపించుకోండి. ఉదయనిధికి, ముస్తఫాకి,  జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళకి పూర్తిగా మద్దతివ్వండి.  కాళ్లకు మొక్కండి. సన్మానాలు చెయ్యండి. వెనక్కు తగ్గద్దు. ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. ఒకనాటికి మీకే తెలుస్తుంది. అప్పటికి మీకు ఉనికే ఉండదు.

వ్యక్తిగతస్వార్ధాలకోసం దేశాన్నే ముంచేసేవాళ్ళని మన దేశంలోనే చూడగలం మరి !

It happens only in India !

read more " సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం "

14, మే 2026, గురువారం

ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు?

తమిళనాడులో ప్రభుత్వం మారింది. సినిమానటుడు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళప్రజలు తెలుగుప్రజలకు ఏమీ తీసిపోరని మళ్ళీ ఋజువైంది.

చూడబోతే దక్షిణాదిరాష్ట్రాలకు వేటికీ దూరదృష్టి, వాస్తవికదృష్టి లేవని అర్థమౌతోంది. కాకపోతే ఒకటి ! ప్రజలకు ఛాయిస్ లేదు. నెగటివ్ ఓటు పనిచేస్తోంది. ఉన్నవాళ్లలో కాస్త మెరుగనిపించిన వాడిని ఎన్నుకుంటున్నారు. అయిదేళ్ల తర్వాత మళ్ళీ మోసపోయామని గ్రహిస్తున్నారు. మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. 

అయితే, తమిళప్రజలకు అన్నామలై నచ్చలేదు. విజయ్ నచ్చాడు.

అన్నామలై విద్యావంతుడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. IIM గ్రాడ్యుయేట్. IPS సాధించాడు. ముక్కుసూటి ఆఫీసర్. వాటిని వదిలేసి దేశంకోసం ప్రజలకోసం రాజకీయాలలోకి వచ్చాడు. అతను ప్రజలకు నచ్చలేదు.

జోసెఫ్ విజయ్ సినిమాకుటుంబం నుంచి వచ్చాడు. ఇంటర్ మాత్రమే పాసయ్యాడు. అదికూడా అవలేదని, మధ్యలో మానేశాడని కొంతమంది అంటున్నారు. తల్లిదండ్రుల అండదండలతో హీరో అయ్యాడు. ఉద్రేకాలను రెచ్చగొట్టే పంచ్ డైలాగులతో, వాస్తవదూరమైన కథలతో జనాలకు దగ్గరయ్యాడు. వాట్సాప్ గ్రూపులతో, ఇంస్టాగ్రామ్ రీళ్ళతో పార్టీ పెట్టాడు. ఆచరణలో చెయ్యలేని, పనికిరాని వాగ్దానాలు గుప్పించాడు. జనాలు మెచ్చారు. గెలిచాడు. ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి.  మరి రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఏంటో చూద్దామా?

2011 లో AIADMK ఓడిపోయి DMK అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో  ఉంది.

15 ఏళ్ల తర్వాత ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుతో DMK ప్రభుత్వం విజయ్ కి పగ్గాలు అప్పగించింది. అంటే ఈ 15 ఏళ్ల హయాంలో, 5 లక్షల కోట్ల అప్పు కాస్తా, 10 లక్షల కోట్ల అప్పుగా మారింది.

తమిళనాడు వార్షికబడ్జెట్ 3.44 లక్షల  కోట్లు. అంటే, బడ్జెట్ కు మూడురెట్లు అప్పులున్నాయి. ఒక కుటుంబం దృష్టిలో మాట్లాడుకోవాలంటే, నెలకు పదివేలు సంపాదన అయితే, ముప్పై వేలు అప్పుంది. ఇదంతా ఎలా తీరాలి? ఎవరు తీర్చాలి?

ఈ తెచ్చిన అప్పులన్నీ ఎలా ఖర్చుపెట్టబడ్డాయి?

రకరకాల స్కీముల కింద ప్రజలకు కొంత పందేరం చెయ్యడం, కొంత నొక్కెయ్యడం ఇదే ఎక్కడైనా జరిగేది, జరుగుతున్నది కూడా. ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోతున్నాయి? ఏ స్విస్ బ్యాంక్ కో, ఏ సింగపూర్ కో తరలిపోతున్నాయి. అంతేగాని, రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెట్టడంగాని, ఒక రెవెన్యూ సృష్టించే ప్లాన్ గాని లేవు. ఉద్యోగాల సృష్టి లేదు. సంపద సృష్టి లేదు. అప్పులు తేవడం, వాడుకోవడం, దేశసంపదంతా విదేశీ బ్యాంకులకు తరలిపోవడం. ఇదీ గత 70 ఏళ్లుగా జరిగింది. ఈ వరస ఒక్క తమిళనాడులోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ప్రజలు ఎక్కడైనా గొర్రెలేగా !

జనాలకు ఇదంతా పట్టదు. మన కులపోడైతే చాలు, నెలకింత అని డబ్బులిస్తుంటే చాలు, మనోళ్లు చేసే దౌర్జన్యాలు, నేరాలు అన్నీ మాఫీ చేస్తుంటే చాలు, వాడు దేవుడు. 

ఈ డబ్బులన్నీ ఎక్కడనుంచి వస్తాయి? అన్న ఆలోచన ఎవడికీ లేదు. రాష్ట్రం ఎటుపోయినా మనకనవసరం ! వాస్తవాలు ఎవరికీ  అక్కర్లేదు. నాలుగు డైలాగులు చెప్పి ఉద్రేకాలను రెచ్చగొట్టి, పది వాగ్దానాలు చేస్తే చాలు, ఓట్లు పడిపోతాయి. తర్వాత, మనం కట్టే టాక్స్ ని సగం నొక్కేసి, సగం మనకే పంచేసి చేతులు దులుపుకుంటారు. అదేమంటే కేంద్రం సాయం చెయ్యడం లేదంటారు. ఈలోపల రాష్ట్రం ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.

ఇలాంటి ప్రజలకు ఇలాంటి ప్రభుత్వాలు రాక ఇంకేమొస్తాయి?

ఇంకొక విచిత్రం చెప్పనా !

సమాజంలో ఏ ఉద్యోగానికైనా ఒక అర్హత కావాలి. పాతిక ముప్పై ఏళ్ళు చదువుకొని, ఎన్నో పరీక్షలు వ్రాసి, కష్టపడితే గాని ఒక స్థాయి ఉద్యోగం రాదు. కానీ రాజకీయాలకు మాత్రం ఏ విధమైన అర్హతా అవసరం లేదు. 

ఆటోడ్రైవర్ మంత్రి కావచ్చు. మేకప్ మ్యాన్ ప్రభుత్వ చీఫ్ విప్ కావచ్చు. స్టూడియో బాయ్ స్పీకర్ కావచ్చు. "అనుభవం లేకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తావు నాయనా?" అంటే, "ఐఏఎస్ లున్నారు కదా, వాళ్ళని పెట్టి నడిపిస్తాం" అంటారు. వాళ్లలో నిజాయితీపరులెందరు?

UPSC లో ఏడాదికేడాది క్వాలిటీ తగ్గిపోతున్నది. మజ్జిగ పలచబడిపోతున్నది. రెండు ముక్కలు ఇంగ్లీషు గట్టిగా మాట్లాడలేని వాళ్ళు IAS, IPS అవుతున్నారు. టెన్త్ తప్పినవాళ్లు, ఇంటర్ నాలుగుసార్లు రాసినవాళ్లు UPSC లో సెలక్ట్ అవుతున్నారు. చాలామందిలో కులపిచ్చి, డబ్బుపిచ్చి చాలా ఎక్కువగా ఉంటోంది. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినవే. ఊహలు కావు.

నేను IRTS కేడర్ లో చూశాను. నిజాయితీపరులను, నిక్కచ్చిగా ఉండేవాళ్ళను, అవినీతి చెయ్యనివాళ్లను కనీసం వేళ్ళపైన కూడా లెక్కపెట్టలేము. చాలావేళ్ళు మిగిలిపోతాయి. అలా ఉంటుంది పరిస్థితి.

అది సెంట్రల్ సర్వీసయినా, స్టేట్ సర్వీసయినా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎటూ మొగ్గకుండా, అవినీతికి పాల్పడకుండా, రూలు ప్రకారం పనిచేసే అధికారులు ఎక్కడా లేరు. అందరూ ఏదో ఒకచోట పడిపోయేవారే, ఏదో ఒక పార్టీకి, ఒక భావజాలానికి కొమ్ముకాసేవారే. ఉంటే గింటే నిజాయితీపరులు ఒకరిద్దరున్నారేమో అక్కడక్కడా ! వాళ్ళనెలాగూ పక్కన పెట్టేస్తారు కాబట్టి బాధ లేదు.

అనుభవం లేని నాయకులతో, నైతికస్థాయిలేని అధికారులతో రాష్ట్రాలుగాని, దేశాలుగాని ఎలా ఎదుగుతాయో, ఎక్కడకు ఎదుగుతాయో దేవుడికే ఎరుక !

ఇకపోతే మరొక కొసమెరుపు ! 

తన వ్యక్తిగతజ్యోతిష్కుడిని ప్రభుత్వసలహాదారుగా నియమించిన జోసెఫ్ విజయ్, అందరినుంచీ ప్రతిఘటన రావడంతో  ఆ ఆర్డర్ ను మర్నాడే హడావుడిగా కేన్సిల్ చేశాడు.

అసలు, క్రైస్తవం భారతీయజ్యోతిష్యాన్ని ఒప్పుకుంటుందా? జోసెఫ్ కి మన జ్యోతిష్యమెందుకు? లేక, అవసరం ఉంటే ఏదైనా పరవాలేదా?

ఆమాత్రం ఒత్తిడిని తట్టుకోలేనివాడు, ముందుముందు రాబోయే రాజకీయసంక్షోభాలను, బలపరీక్షలను, రాష్ట్రసమస్యలను ఎలా తట్టుకుంటాడనేది అసలైన ప్రశ్న !

మళ్ళీ, ఈ విమర్శించిన ప్రతిపక్షాలన్నింటికీ ఎవడో ఒక జ్యోతిష్కుడు, ఒక స్వామీజీ తప్పకుండా ఉంటారు. ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారి, ఎన్టీ రామారావుకు మోహన్ రెడ్డి, ఇపుడు జోసెఫ్ విజయ్ కి రాధన్ పండిట్ ఇలా ప్రతి ఒక్కరికీ ఉంటారు. నార్త్ లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. రాజకీయులకు, జ్యోతిష్కులకు, స్వామీజీలకు ఉండే అక్రమసంబంధాలు లోకానికి కొత్తేమీ కాదు.

కాకపోతే, ఈ మొత్తం ప్రహసనంలో ఒక్క విషయం మాత్రం అర్ధంకావడం లేదు. పదేళ్ల తర్వాత జోసెఫ్ విజయ్ సిఎం అవుతాడన్న విషయాన్ని ముందే చెప్పిన రాధన్ పండిట్ వట్రివేల్ కు, తనకు ఇవ్వబడిన పదవి ఒక్కరోజులో ఊడిపోతుందన్న సంగతి తెలుసా లేదా అనేదే ప్రశ్న ! తన జాతకం తను చూసుకోలేదా?

లోకానికి జోస్యాలు చెప్పే జ్యోతిష్కులకు, తమ జాతకం తమకే తెలీకపోవడం ఏంటో ఈ వింత ! 

ఎవరికీ దూరదృష్టి లేదు, సరియైన ప్లానింగ్ లేదు. నిజాయితీ లేదు, నిస్వార్ధధోరణి లేదు. ఇలాంటి తెలివిలేని దురాశాపరులైన ప్రజలతో, ఇలాంటి అవకాశవాద అవినీతి రాజకీయాలతో, అవినీతి అధికారులతో, ఈ దేశం, ఈ రాష్ట్రాలు బాగుపడటం చాలా కష్టం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప !

ఏంటా అద్భుతం?

ప్రతిరాష్ట్రానికీ ఒక యోగి, ఒక హిమంతశర్మ లాంటివాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటమే ఆ అద్భుతం. అలాంటి అద్భుతమేదీ కనుచూపుమేరలో కనిపించడం లేదు.

It happens only in India అనుకోవడం తప్ప ఈలోపల మనం చేసేదేముంది?

read more " ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు? "

1, మే 2026, శుక్రవారం

మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల

ఈరోజు వైశాఖ పౌర్ణమి పర్వదినం.

శ్రీహరికి పరమభక్తుడు మరియు మహా  సంకీర్తనాచార్యుడైన  అన్నమయ్య కూడా  ఈరోజే   జన్మించాడు. ఇవాళే బుద్ధునికి కూడా జ్ఞానోదయం కలిగింది. కనుక ఈరోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

నా కలం నుండి వెలువడుతున్న 78 వ పుస్తకంగా 'త్రిపురా రహస్యము' 'ఈ-బుక్' ను నేడు విడుదల చేస్తున్నాను. శాక్తాద్వైత సాంప్రదాయానికి చెందిన మహత్తరమైన గ్రంథాలలో ఇది పేరుగన్నది.

ఇది జ్ఞానఖండము. అంటే, పూర్తిగా జ్ఞానభాగము. చిక్కని శాక్తాద్వైతభావజాలంతో కూడిన దీని శ్లోకార్థములను సాధ్యమైనంత తేలికైన తెలుగుభాషలో వివరించే ప్రయత్నాన్ని ఇందులో చేశాను.

దీనికంటే ముందు మాహాత్మ్యఖండమని ఒక భాగమున్నది. అది లభిస్తున్నది. దీని తరువాత చర్యాఖండమని ఇంకొక భాగమున్నది. అది లభించడం లేదు. ఇవన్నీ కలిపి మొత్తము 12 వేల శ్లోకములని చెప్పబడినది. మొత్తము 'త్రిపురారహస్యము' ఈ మూడు ఖండముల ఉద్గ్రంధము.

మాహాత్మ్యఖండములో 6687 శ్లోకములున్నాయి. జ్ఞానఖండములో 2163 శ్లోకములున్నాయి. కనుక చర్యాఖండములో 3150 శ్లోకములుండాలి. దేవీ సాధనావిధానములన్నీ దానిలోనే ఉన్నవి. కానీ అది దొరకడం లేదు. ఏ తురకల రాక్షసకాండలోనో తగలబడిపోయి ఉంటుంది. వీటిలో ప్రస్తుతము లభిస్తున్న జ్ఞానఖండమును మాత్రము ఇక్కడ విడుదల చేస్తున్నాము.

దత్తాత్రేయులవారు మహాజ్ఞాని మరియు మహాసిద్ధుడు. ఈయన పరశురాముని గురువు. ఇద్దరూ ఋషిపుత్రులే. ఒకరు అత్రితనయుడైతే, మరియొకరు జమదగ్ని తనయుడు. ఒకరు త్రిమూర్తిస్వరూపుడైతే, మరియొకడు దశావతారములలో ఒకరు. కనుక, వీరి సంవాదరూపమైన 'త్రిపురారహస్యము' నకు మన అద్వైతవేదాంతవాఙ్మయములో అత్యంతప్రముఖమైన స్థానమున్నది.

దత్తాత్రేయులకు అవతారములు లేవు. ఉన్నవని నేటివారు కల్పించారు. ప్రతివారినీ దత్తాత్రేయుల అవతారమని చెప్పుకోవడం కలిమాయలలో ఒకటి. అది వ్యాపారం మాత్రమే గాని, సత్యం కాదు. అన్నింటికీ అతీతుడై, పరమజ్ఞానరూపియైన దత్తాత్రేయుడు, మానవరూపంలో తిరిగి అవతరించడం, అల్పములైన మహత్యాలను అద్భుతాలను చెయ్యడం జరిగేపనులు కావని దత్తతత్త్వం కొద్దిగా తెలిసిన చిన్నపిల్లలకైనా అర్థమౌతుంది.

ముఖ్యంగా ఈ పిచ్చిభ్రమ మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నది. దానిని చూసి మన తెలుగువాళ్లు వాతలు పెట్టుకుంటున్నారు. కొంతమంది సోకాల్డ్ స్వామీజీలు దీనిని ప్రోత్సహిస్తున్నారు.

స్వాములు సత్యాన్ని చెప్పాలి. ఆశలకు అతీతంగా ఉండాలి. కానీ అలా లేరు. స్వార్ధం కోసం అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. అధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మక్షీణతకు కారకులౌతున్నారు. రక్షించవలసినవారు చెడగొట్టడం, దిద్దవలసినవారు పెడదారి పట్టించడం కలిమాయలలో ఒకటి.

నేడు ప్రతివారినీ దత్తాత్రేయుని అవతారమని చెబుతున్నారు. అలా చెప్పుకుంటున్నవారు తెలుగురాష్ట్రాలలో కనీసం నలుగురున్నారు.  ధనదాహం, కీర్తికండూతి, అహంభావం - వీటికోసం ఏ విలువలనైనా వదులుకోవడానికి సిద్ధపడటం ఈ నాలుగూ తెలుగువారి దౌర్భాగ్యాలు. హిందువులలో తమ మతాన్ని గురించిన అసలైన జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే ఈ అజ్ఞానానికి మరియు దత్తాత్రేయుని పేరుతోను, ఇతర దేవతల పేర్లతోను జరుగుతున్న మతవ్యాపారానికి అంతం కలుగుతుంది.

త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది. రమణభక్తులైన శ్రీ మునగాల వెంకట్రామయ్యగారి ఇంగ్లీష్ అనువాదమే ఇప్పటివరకూ మనకు లభిస్తున్నది. ఇప్పుడు నా ఇంగ్లీషు అనువాదం కూడా మీ ముందుకు వస్తుంది.

నవీనకాలపు జ్ఞానులలో ముఖ్యులైన రమణమహర్షి ఈ గ్రంధమును ఎంతగానో అభిమానించేవారు. తన సంభాషణల మధ్యలో దీనినుంచి శ్లోకాలను కోట్ చేసేవారు. దీనిని బట్టి ఈ గ్రంధము యొక్క విలువ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.

సృష్టి ఎలా జరిగిందన్నది కాశ్మీరశైవమనబడే త్రికసంప్రదాయంలో చాలా చక్కగా వివరించబడింది. ఇటువంటి వివరణ ఏ మతంలోనూ, ఏ గ్రంథంలోనూ ఇవ్వబడి లేదు. అలా చెప్పగలగాలంటే ఆయా మతాలలో గొప్పవైన మేధాశక్తి, పరిశీలన, సత్యతృష్ణ, ఋజుజీవనములుండాలి. అవి లేవుగా మరి !

త్రికమనేది ఆధ్యాత్మికలోకంలో అత్యున్నతమైన సాంప్రదాయము, దీనికే శివాద్వైతమని పేరున్నది. ప్రస్తుతగ్రంధము శాక్తాద్వైత సాంప్రదాయమునకు చెందినది. శివశక్తులకు వేర్వేరుగా ఇవ్వబడిన ప్రాముఖ్యత తప్ప, మిగిలిన భావజాలమంతా ఈ రెండింటిలో దాదాపు ఒక్కటిగానే కనిపిస్తుంది. ఆ వివరణను, జ్ఞానులలోని భేదములెలా ఉంటాయన్న వివరమును, ఇతరములైన ఎన్నో అంతుబట్టని జ్ఞానరహస్యములను కూడా ఈ గ్రంధంలో మీరు చూడవచ్చు.

ఈనాడు సైన్సు ఊహిస్తున్న మల్టీ డైమెన్షనల్ యూనివర్స్, టైం ట్రావెల్, హోలోగ్రామిక్ మోడల్  ఆఫ్ యూనివర్స్ మొదలైన భావాలు ఈ ప్రాచీనగ్రంధంలో దాదాపు వెయ్యి సంవత్సరాలనాడే చెప్పబడి ఉండటం చూడవచ్చు.

ప్రస్తుతం ఈ బుక్ గా ఇక్కడ లభిస్తుంది.  త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా లభిస్తుంది. ఈ ఏడాది జరుగబోయే హైద్రాబాద్, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లలో మా స్టాల్లో దొరుకుతుంది. 

యధావిధిగా, ఈ గ్రంథరచనలో నాకు సహకరించిన శిష్యులకందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

మహత్తరమైన ఈ గ్రంధమునకు నాచేత చేయబడిన వ్యాఖ్యానము జిజ్ఞాసువులకు, జ్ఞానపిపాసులకు అమితానందమును కలిగిస్తుందని, తెలుగుభాషలో ఈ గ్రంధము  ఒక మణిపూసగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను.
read more " మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల "

20, ఏప్రిల్ 2026, సోమవారం

సీనియర్ సిటిజన్స్

మనదేశానికి అనేక సమస్యలున్నాయి. పదేళ్లక్రితం వ్రాశాను, త్వరలో మనం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య 'ఊబకాయం' అని. ఇప్పటికీ ఈ సమస్య తీరలేదు. ఇంకా ఎక్కువైంది.

ఇప్పుడు మరొకసమస్య వచ్చిపడింది. నిజానికి ఈ సమస్య పదేళ్లక్రితం నుంచే ఉన్నప్పటికీ, నేడు ఇంకా ఎక్కువైంది. అదే 'సీనియర్ సిటిజెన్స్' సమస్య. 

పదేళ్లక్రితం సీనియర్ సిటిజెన్స్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు 'సూపర్ సీనియర్ సిటిజెన్స్' అయ్యారు.

ప్రస్తుతం మన దేశజనాభా 147 కోట్లు. దీనిలో 7 వ భాగం సీనియర్ సిటిజెన్స్ ఉన్నారు.  అంటే, 21 కోట్లు. అందుబాటులోకి వచ్చిన మెడికల్ సదుపాయాలతో, మెరుగుపడిన ఆర్ధికవనరులతో, ఇప్పుడు మనం ఎక్కువకాలం బ్రతుకుతున్నాం. 90 దాకా బ్రతుకుతున్నవారు నేడు చాలామంది ఉన్నారు.

అయితే, వీరిలో క్వాలిటీ లైఫ్ ఉందా? అంటే, లేదనే చెప్పాలి. మందులేసుకుంటూ, సోఫాలకు, వీల్ చెయిర్లకు పరిమితమైపోయి, టీవీలు చూసుకుంటూ బ్రతుకుతున్నవారు కనీసం వీరిలో 5 కోట్లమంది ఉంటారు. ఇంకా పైమాటే కావచ్చు. వీరికి ఎదురౌతున్న అతిపెద్ద సమస్య - చూసుకునేవాళ్ళు లేకపోవడం.

వీళ్ళదగ్గర డబ్బులున్నాయి. ఇంకా కావలసివస్తే, పంపడానికి అమెరికావంటి దేశాలలో పిల్లలు మంచిపొజిషన్లలో ఉన్నారు. కానీ వాళ్ళిక్కడికి రాలేరు. వీళ్ళక్కడికి పోయి ఉండలేరు. ట్రంప్ రానివ్వడు. అయన ఒప్పుకున్నా యుద్ధం రానివ్వదు. అక్కడకెళ్లినా చివరకు ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరవలసిందే. 

ఇక్కడా  వీళ్ళను చూసుకునేవారు లేరు. అక్కడా ఉండరు. మరేం చెయ్యాలి?

మా ఆశ్రమం దగ్గర్లోనే ఒక ఊరుంది. అందులో, ఇంటికొకరు చొప్పున అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో, ఇంటిలోని ముసలాళ్ళు అరుగులమీద కూచుని శూన్యంలోకి చూస్తూ ఉంటారు. పెద్దపెద్ద ఇళ్ళు. చేసేవారు లేరు. చూసేవారు లేరు. ఏం చెయ్యాలో తెలియని స్థితి.

ఇదీ నేడు మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి.

అందుకనే వృద్ధాశ్రమాలు ఎక్కువౌతున్నాయి. అయితే వాటిలో కూడా తేడాలున్నాయి. కొన్నింటిలో మంచి సదుపాయాలుంటే, చాలావాటిల్లో అరకొర సదుపాయాలే ఉంటున్నాయి.

కొంతమంది సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా 40కే ఉద్యోగాలు మానేసి వృధ్ధాశ్రమాలు నడుపుకుంటూ జీవిస్తున్నారు. టెన్షన్ ఉండదు. వృద్ధులకు సేవ చేసినట్లు ఉంటుంది. అన్న ఆలోచనతో దీనిని చేస్తున్నారు.

వృద్ధాశ్రమం అంటే బాగుండదని, వీటిని 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్' అంటున్నారు. అమెరికాలో అయితే, సీనియర్ సిటిజెన్స్ కోసం పెద్దపెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే సెటిలైన కొంతమంది  మనవాళ్ళు కూడా వీటిని పెట్టారు. పెట్టబోతున్నారు.

మొన్న హైద్రాబాద్ వెళ్ళినపుడు ఒకాయన్ని కలిశాను. ఆయనకు 85 ఏళ్ళు. 

'నేను 125 వరకూ బ్రతుకుతాను' అన్నాడాయన. 'డైట్ లో జాగ్రత్తగా ఉంటూ, మంచిమందులు వాడుకుంటూ ఉంటే  125 దాకా బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు' అన్నాడు.

'అన్నాళ్ళు బ్రతికి ఏం చేద్దామని?' అన్నాను చనువుగా.

'ఏమీ లేదు. బ్రతకడమే. కొత్తగా చేసేదేమీ లేదు. చేసేదంతా వయసులో ఉన్నపుడు చేశాం. ఇప్పుడు చేసేదేమీ లేదు' అన్నాడాయన. 

'మిమ్మల్ని చూసుకునే పనివారి జీతభత్యాలకు నెలకు ఎంత ఖర్చవుతుంది?' అనడిగాను.

'దాదాపుగా  లక్షా ఏభై వేలౌతుంది' అన్నాడు.

'మీరు భరించగలరు కాబట్టి భరిస్తున్నారు. అందరూ పెట్టుకోలేరు. వాళ్ళ గతేంటి?' అడిగాను.

'వాళ్లకు తగిన కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్ వారికున్నాయి' అన్నాడాయన.

స్వయానా ఆయనే అటువంటి ఒక సెంటర్ను కొన్నేళ్లపాటు నడిపి ఇప్పుడు చేతకాక విరమించుకున్నాడు.

'మీ ఆశ్రమంలో ఇటువంటి ఫెసిలిటీ పెడితే బాగుంటుంది కదా' అని కొందరడిగారు.

'మాది సాధనాశ్రమం, వృద్ధాశ్రమం కాదు' అని వారికి చెప్పాను.

ఈ వృద్ధులకు హఠాత్తుగా ఏదైనా అయినా కూడా, విదేశాలనుండి వెంటనే వచ్చే పరిస్థితిలో వీళ్ళ పిల్లలు లేరు. 'ఏదో ఒకటి చేసెయ్యండి. వీడియోలో చూస్తాం. డబ్బులు పంపిస్తాం' అని కొందరంటున్నారని ఒక వృద్ధాశ్రమం నడిపేవారు నాతో అన్నారు.

కాళ్ళూచేతులూ సరిగ్గా ఉన్నంతవరకే ఎవరి ఆటలైనా సాగుతాయి. ఏదైనా తేడా వస్తే, మామూలు మనిషైనా, రిటైర్డ్ ఐఏఎస్ అయినా, డిప్యూటీ సిఎం అయినా, ఆస్పత్రిపాలు కావలసిందే. ఒకరిపైన ఆధారపడవలసిందే. డబ్బుంటే కొంతవరకూ నడుస్తుంది. ప్రేమగా చూడకపోయినా, ఏదోరకంగా చూసుకునేవారైనా కనీసం ఉంటారు. అదికూడా లేకపోతే, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.

నేడు అలాంటి దారుణపరిస్థితిలో ఉన్న పెద్దవారి సంఖ్య 21 కోట్లు. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.

వీళ్ళను జాగ్రత్తగా చూసుకునే 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్లు' మరిన్ని రావలసిన అవసరం ఉన్నది. టెన్షన్ లేని జీవితం మనదేశంలోనే గడపాలని అనుకునేవారికి ఇదొక మంచి బిజినెస్ అవకాశం. ఔత్సాహికులు ముందుకొస్తే బాగుంటుంది.

రేప్పొద్దున వీళ్ళ పరిస్థితైనా, ఇంకెవరి పరిస్థితైనా ఇంతేగా మరి!

read more " సీనియర్ సిటిజన్స్ "

18, ఏప్రిల్ 2026, శనివారం

రాజశ్యామల - బగళాముఖి

కొంతమంది బంధుమిత్రులను కలిసే పనిమీద రెండ్రోజులపాటు హైద్రాబాద్ లో ఉండి ఆశ్రమానికి తిరిగి వచ్చాము. మొదటిసారి హైద్రాబాద్ నరకంలాగా అనిపించింది.

1980 లో నేను హైదరాబాద్ లో మొదటిసారి అడుగుపెట్టాను. బెంగుళూరుకూడా అప్పుడే చూశాను. ఆ రోజులలో ఆ సిటీలు రెండూ స్వర్గాలు. నేడు నరకాలయ్యాయి.

1980 డిసెంబర్ లో చీకటిపడ్డాక దిల్సుఖ్ నగర్ రోడ్డుమీద నడుస్తుంటే, చలి అలవాటు లేనివాళ్లకు స్వెటర్ వేసుకోవలసిన అవసరం అయ్యేది. బడుగువర్గాలు కంబళ్ళు కప్పుకుని చిన్నచిన్న చలిమంటలేసుకుంటూ ఉండేవారు.

నేడు పొద్దున్న పదిగంటలకి రోడ్డుమీద నడుస్తుంటే గాడ్పు కొడుతోంది. వడదెబ్బ తగిలేటట్టుంది. ఒక గంట పనిమీద బయటకెళ్ళి వస్తే, షవర్ క్రింద స్నానం చేసి, ఏసీలో కూర్చోవలసి వస్తోంది. హైద్రాబాద్ వాతావరణం అంతగా పాడైపోయింది. ఇక బెంగుళూరు మాటైతే చెప్పాల్సిన పనే లేదు. జీవితం పైన విరక్తి పుట్టేట్టుగా ఉన్నది.

ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్. నేల, మట్టి,  ఎక్కడా లేవు. చెట్లు లేవు. వెహికిల్ పొగ, పెరిగిపోయిన జనాభా, ఏసీల నుండి వస్తున్న వేడి, కాంక్రీట్ బిల్డింగ్స్ నుండి రిఫ్లెక్ట్ అవుతున్న ఎండ, అన్నీ కలసి చల్లటి హైద్రాబాద్ ని నిప్పులకుంపటిగా మార్చేశాయి. నేను విజయవాడలో ఉన్నానా? లేక హైద్రాబాద్ లో ఉన్నానా? అర్ధం కాలేదు. రెండూ ఒకే విధంగా అనిపించాయి.

హైద్రాబాద్  తో పోలిస్తే మా ఆశ్రమం స్వర్గంలాగా ఉంది.

ఈలోపల ప్రక్కనున్న ఒక శిష్యురాలు, 'రాజశ్యామలంటే ఎవరు?' అని అడిగింది ఒక వాల్ పోస్టర్ను చూస్తూ.

అటు చూశాను. విషయం అర్ధమైంది.

'రాజుగారింట్లో ఉండే శ్యామల' అన్నాను.

'జోకులాపి విషయం చెప్పండి' అన్నది.

'రాజశ్యామలంటూ ఎవరూ లేరు. అదొక మాయ. దశమహావిద్యలలో ఆమెపేరు మాతంగి. ఆమె ఉపాసన  మంచి కవిత్వశక్తినిస్తుంది. మంచిమేధస్సునిస్తుంది. లలితకళలలో మంచి ప్రజ్ఞనిస్తుంది. తారాదేవికే మరొకపేరు శ్యామల. మామూలుభాషలో సరస్వతీదేవి, తాంత్రికప్రపంచంలో మాతంగి అయింది. మన 'తారాస్తోత్రం' చదివావు కదా. తార అన్నా, మాతంగి అన్నా, శ్యామల అన్నా ఆమెనే. తెలుగు సరిగ్గారాని నేను ఇప్పటికి పదివేలపైగా పద్యాలు వ్రాశానంటే అదెలా కుదిరిందంటావు? ఆలోచించు' అన్నాను.

'మరి రాజశ్యామల అని ఎందుకంటారు?' అడిగింది.

'శ్రీవిద్యోపాసనా విధానంలో, లలితాపరమేశ్వరిని ఒక రాణిగా అనుకుంటే, ఆమెకొక మంత్రి, ఒక సేనాపతి ఉంటారు. ఆ మంత్రిణీదేవత పేరే మాతంగి. రాజపరివారంలో ఉంటుంది గనుక, రాజ్యాధికారాన్ని నడిపిస్తుంది గనుక రాజశ్యామల అని పేరు మార్చారు. ఈమెకు హోమం చేస్తే రాజ్యాధికారం వస్తుందని మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ రాదు. దశమహావిద్యలు తెలుగువారి చేతులలో భ్రష్టు పడుతున్నాయి. అంతే. 

మహావిద్యలు అవినీతిని సపోర్ట్ చెయ్యవు. అవి మన గొంతెమ్మకోరికలను తీర్చుకునే మంత్రవిద్యలు కావు. పాతాళభైరవి, బాలనాగమ్మ సినిమాలు చూస్తే ఇలాంటి పైత్యాలు పుడతాయి. అవి ఆత్మసాధనా విద్యలు మరియు మోక్షవిద్యలేగాని, మోసవిద్యలు కావు.

నువ్వు చేసే మినప్పప్పు, కందిపప్పు, మిరపకాయల హోమాలతో జగన్మాత కరుణిస్తుందని, నీ గొంతెమ్మ అవినీతికోరికలను తీరుస్తుందని అనుకుంటే అంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి ఉండదు. దురదృష్టవశాత్తూ, గత పాతికేళ్లుగా ఇటువంటి ట్రెండ్ లను కొంతమంది సోకాల్డ్ స్వాములు పెంచి పోషిస్తున్నారు. వీళ్లకు రాజకీయులు వంతపాడుతున్నారు. నేడు దీనినొక వ్యాపారంగా మార్చారు. వెరసి మహావిద్యోపాసనను క్షుద్రవిద్యల స్థాయికి దిగజార్చారు.

దశమహావిద్యలనేవి ఇనుమును బంగారంగా మారుస్తాయి. కానీ మనం వాటినుపయోగించి బంగారాన్ని మట్టిగా మార్చుకుంటున్నాం. రామకృష్ణులు చెప్పలేదా, రాజు దగ్గరకెళ్ళి పుచ్చువంకాయలు కోరతారని? అంతే' అన్నాను.

'మరి తెలిసినవాళ్ళు చెప్పచ్చు కదా?' అన్నది.

'ఎవరు వింటారు? స్వార్ధపుకోరికలతో కుళ్లిపోతున్న ప్రపంచానికి నిజాలెందుకు? మాయలే కావాలి. ఉన్నతమైన భావజాలం ఎవరికుంది? కోరికలు తీరడం, అప్పనంగా కోట్లు వచ్చి పడటం, పవర్ చేతిలోకి రావడం, దానితో మళ్ళీ అవినీతి చేసి వేలకోట్లు వెనకెయ్యడం ఇదేకదా నేటి ట్రెండ్? సమాజంలోగాని, మనుషులలోగాని నీతి ఎక్కడుంది? అసలైన ఆధ్యాత్మికత ఎవడికి కావాలి ఈరోజుల్లో? అన్నీ నకిలీబ్రతుకులేగా?' అన్నాను.

'దశమహావిద్యలలో అన్నీ అంతేనా?'అడిగింది.

'అంతే. ఉదాహరణకు బగళాముఖిని చూడు. మొన్నొకామె 'నేనుకూడా బగళాముఖి చేస్తున్నా' అన్నది. 'రాత్రికి ఉప్మా చేస్తున్నా' అన్నట్టు. 

ఎందుకమ్మా అంటే, 'శత్రుస్తంభన' అన్నది.

'అదేంటంటే, 'శత్రువులు నాశనమైపోతారు' అన్నది.

'ఎవరిదగ్గర ఉపదేశం పొందావు?' అంటే, 'ఉపదేశం ఎందుకు? యూట్యూబ్ లో చూసి మంత్రం జపిస్తున్నా' అన్నది. 

'నువ్వేమైనా దావూద్ ఇబ్రహీంవా? లేక ఏవైనా చీకటివ్యాపారాలు చేస్తున్నావా? అంతమంది శత్రువులు నీకెందుకున్నారు?' అని నేనడిగాను.

'అదికాదు. మన మాట చెల్లుబాటు కావడానికి' అంది.

'నువ్వు ధర్మంగా జీవించడం ముఖ్యంగాని, నువ్వు వాగేది ఏదైనా సరే చెల్లుబాటు కావాలని అసలెందుకు కొరుకుంటున్నావు? శత్రువులైనా ఇంకొకరైనా నాశనం కావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది తప్పుకాదా? దీనికి బగళాముఖి సపోర్టా? పైగా యూట్యూబ్ లో చూసి జపిస్తున్నావా?' అని అడిగాను.

జవాబు లేకపోగా, 'నీకింతేనా తెలిసింది?' అన్నట్టు చూసింది' అన్నాను.

శిష్యురాలు ఆలోచనలో పడింది.

'అసలీ దేవతలందరూ ఉన్నారా? మనం చేసే అన్నిపనులలో మనకు సపోర్ట్ చేస్తారా?' అడిగింది.

'ఉన్నది ఒకటే శక్తి. దానిని నీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని ఆరాధిస్తున్నావు. అదికాదు ముఖ్యం. నీ జీవితంలో నువ్వెంత శుద్ధంగా బ్రతుకుతున్నావనేది ముఖ్యం. నీ  మంత్రాలకు, హోమాలకు, నైవేద్యాలకు పడిపోవడానికి దేవుడు ఒక వెర్రివెంగళప్ప కాదనే విషయం నువ్వు ముందుగా అర్ధం చేసుకోవాలి. మనుషులకు లంచాలిచ్చి పనులు చేసుకున్నట్టు, దేవుడికి పూజలు హోమాలు చేసి పనులు సాధించాలనుకోవడం ఎంత వెర్రో చూడు.

బగళాముఖి అంటే శత్రుస్తంభన నిజమే. కానీ, వాళ్ళు బయటి శత్రువులు కారు. నీలోపల ఉన్న శత్రువులు. నీలోని షడ్వర్గాలు స్తంభించడమే శత్రుస్తంభన. మూతపడాల్సింది ఎదుటివ్యక్తి నోరు కాదు, నీ నోరు. విచక్షణాశక్తి నీలో కళ్ళు తెరిస్తే అది జరుగుతుంది. అది అసలైన బగళాముఖి. 

అలాంటిదే రాజశ్యామల కూడా. రాజ్యాధికారం అంటే ఆత్మజ్ఞానం. అది కలగడమే రాజశ్యామల అనుగ్రహం. అంతేగాని, అవినీతిపనులు చేసి కుర్చీ ఎక్కడం కాదు. ఎక్కి, ఇంకా అవినీతి చెయ్యడమూ కాదు. నీ లౌకికవిజయాలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఆధ్యాత్మికమెలాగూ ధర్మం లేకుండా రాదు. ఇదీ అసలైన మహావిద్యోపాసన' అన్నాను.

'మనం అడిగేది ఏదైనా సరే దేవుడు ఇవ్వడా?' అడిగింది.

'నీ పిల్లలు ఒక గొంతెమ్మకోరిక కోరారనుకో. నువ్విస్తావా?' అడిగాను.

'ఇవ్వను'  అంది

'మరి దేవుడికి నీకంటే తెలివి ఎక్కువుందా? తక్కువుందా?' అడిగాను.  

'మరి ఈ విషయాన్ని ఎవరూ చెప్పడం లేదేంటి?' అడిగింది.

'వాళ్ళూ వాళ్ళూ భాగస్వాములేగా. నిజాలను ఎందుకు చెప్తారు? చెప్పినా వినేదెవరు? అందరూ అదే తానులో ముక్కలేగా?' అన్నాను.

'మరి ఈ గోలతో హిందూధర్మం నాశనం కావడం లేదా?'అడిగింది.

'నాశనమయ్యేది ధర్మమెలా అవుతుంది?  ధర్మం నాశనం కాదు. మనం అవుతాం. సమాజంలో వెర్రిపోకడలు పెరుగుతున్నాయి. అంతే. అందుకే రాజశ్యామల, వారాహి, ఛిన్నమస్త, ప్రత్యంగిర, ఉగ్రభైరవి మొదలైన దేవతల ఆరాధన పెరుగుతున్నది. మనుషులలో పెరుగుతున్న పిచ్చికోరికలకు, దౌర్జన్యపూరిత ధోరణులకు ఇది సంకేతం. 

గీతలో కృష్ణభగవానుడు చెప్పలేదా, ఎవరెవరి సంస్కారాలను బట్టి వారువారు ఆయా దేవతలను కొలుస్తారని? సాత్వికం, రాజసికం, తామసికం అంతే. సత్త్వం తగ్గిపోతున్నది. తక్కిన రెండూ పెరుగుతున్నాయి. దానికి తగినట్టే దేవతారాధన కూడా ఉంటోంది. మన కర్మకూడా దానికి తగినట్టే ఉంటుంది. కర్మకు తగినట్టే ఫలితం ఉంటుంది.

నీ కర్మను ఏ దేవతా తగ్గించదు. నువ్వే తగ్గించుకోవాలి. వీళ్ళు ఇంకాఇంకా పెంచుకుంటున్నారు. తెలుసుకునేనాటికి సమయం చేజారిపోతుంది. అంతే. అసలు తెలుసుకోగలుగుతారా లేదా అన్నది కూడా డౌటే' అన్నాను.

'అలాగా' అంది శిష్యురాలు సాలోచనగా.

మాటల్లోనే ఇల్లొచ్చేసింది. కారు దిగి ఇంట్లోకి దారితీశాను.

read more " రాజశ్యామల - బగళాముఖి "

ఆశా భోంస్లే జాతకం - కొన్ని ఆలోచనలు

కొంతమంది జాతకాలలో ఒక చిక్కుముడి ఉంటుంది. వృత్తిలో ఎంతగా విజయాలను సాధిస్తారో, జీవితంలో అంతగా అపజయాలను ఎదుర్కొంటారు. ఒక విజయం వస్తే, ప్రక్కనే ఒక అపజయం పొంచి ఉంటుంది. కర్మసూత్రాలు అర్ధమైతే ఈ జీవితాలు ఎందుకిలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆశాభోంస్లే జాతకంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

ఆశాభోంస్లే 12-4-2026 న చనిపోయింది. ఆమె 20 భాషలలో 12 వేల పాటలను పాడింది. ఎన్నో అవార్డులందుకుంది. కానీ అదేసమయంలో జీవితంలో చాలాకష్టాలను పడింది. కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ ఈమె పడిన కష్టాలూ తీవ్రమైనవే. ఆమె అందుకున్న విజయాలూ గొప్పవే. అందుకే ఈమె జాతకం ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే అని నేననుకుంటాను.

తన సోదరి లతామంగేష్కర్ లాగానే ఈమెకూడా 92 ఏళ్ళు బ్రతికింది. కనుక, వీరి జీన్స్ గట్టివే. అయితే వీరి తండ్రి దీనానాధ్ మంగేష్కర్ మాత్రం 41 ఏళ్లకే చనిపోయాడు.  కనుక తల్లిగారి జీన్స్ బలమైనవి కావచ్చు. తల్లిగారు శేవంతి 90 ఏళ్ళు బ్రతికారు కాబట్టి లెక్క సరిపోతున్నది.

ఈమె 8-9-1933 న సాంగ్లీ లో పుట్టింది. జననసమయం 9. 30 pm అని  ఉంది. దీనిని నేను  9. 28 కి సవరించాను. జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు.

2 మరియు 3 భావాలకు అధిపతులుగా ఈమె జీవితంలోని సంగీతవిజయాలకు బుధశుక్రులే కారకులు. వీరు లలితకళలకు కారకులు కూడా. అయితే, ఈమె పడిన కష్టాలకు కూడా వీరే కారకులయ్యారు. రవిబుధులు సింహంలో ఉండటం బుధాదిత్యయోగం. అయితే, బుధుడు అస్తంగతుడయ్యాడు. కనుక కష్టసుఖాలు కలగలసి ఈమె జీవితంలో వచ్చాయి.

4 వ అధిపతియైన చంద్రునికి, 5 వ అధిపతియైన రవికి ఏర్పడిన కోణదృష్టి రాజయోగాన్నిచ్చింది. 

విజయాలు

12-12-2001 న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. అప్పుడు గురు రాహు శుక్ర బుధ  దశ నడిచింది. గురువు పూర్వపుణ్యాధిపతి. రాహువు కర్మాధిపతి. అయితే, శనికి సూచకుడు. కనుక శపితయోగం  ఉంది. బుధశుక్రులు దోషులు, కానీ యోగకారకులయ్యారు. 

5-5-2008 న పద్మవిభూషణ్ అవార్డు ఈమెను వరించింది. ఆనాడు శని కేతు చంద్ర శని దశ నడిచింది. శని కర్మస్థానాధిపతిగా పూర్వపుణ్య స్థానంలోకి వస్తున్నాడు. కేతువు బుధాదిత్యయోగంలో ఉన్నాడు. చంద్రుడు సుఖస్థానాధిపతిగా బలంగా ఉన్నాడు.

అయిదుదేశాలలో, ముఖ్యంగా దుబాయ్, కువైట్ లలో Asha's అనే చైన్ రెస్టారెంట్లను పెట్టింది. అవి బాగా నడుస్తున్నాయి. 10 వ భావంలో ఉన్న వక్రశని, ఆయనపైన ఉన్న గురుశుక్ర దృష్టులు ఈ విజయాలకు కారణాలు. శుక్రుడు 2 వ భావాధిపతిగా ఎలైట్ డైనింగ్ ను సూచిస్తాడు.

జీవితంలో ఎగుడుదిగుళ్లు

1949 లో లతామంగేష్కర్ యొక్క సెక్రటరీ అయిన గణపత్ రావ్ భోంస్లేను ఈమె పెళ్ళిచేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ళు, గణపత్ కు 31 ఏళ్ళు. ఆ సమయంలో అర్ధాష్టమశని నడిచింది. దశగా రవి గురుదశ నడిచింది. పంచమరవి ప్రేమవ్యవహారాలకు, 7వ అధిపతితో కలసి ఉన్న గురువు పెళ్ళికి సూచకులు. నీచశుక్రుడు సాంప్రదాయవ్యతిరేక వివాహాన్ని సూచిస్తున్నాడు.

7 వ అధిపతియైన శుక్రుడు, 9 వ అధిపతి గురువుతో కలసి కర్మస్థానంలో నీచలో ఉండటంతో, తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన గణపత్ రావ్ భోంస్లేను పెళ్లి చేసుకోవలసివచ్చింది. తరువాత తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన R. D. బర్మన్ ను రెండవవివాహం చేసుకుంది. గురువు ధనుస్సు 6 వ డిగ్రీలో ఉండటం చూడవచ్చు. దీనికి తగినట్లుగా, R. D. బర్మన్ ఈమెకంటే 6 ఏళ్ళు చిన్నవాడు.

1960 లో గణపత్ తో విడిపోయింది. అప్పుడు చంద్ర-కేతుదశ నడిచింది. దానికి కారణం సంగీతదర్శకుడు O.P.Nayyar తో ఆమెకున్న ప్రేమసంబంధం కూడా. గణపత్ రావ్ పెడుతున్న హింసను తట్టుకోలేక నయ్యర్ కు దగ్గరైంది. చంద్రకేతుదశ గ్రహణదశ. 7 వ భావం దెబ్బతినడం, దానిపైనున్న శనిగురువుల ప్రభావాలు దీనికి కారణాలు. పంచమకేతువువల్ల ప్రేమవియోగం సూచితమౌతున్నది. అప్పటికి వారికి ముగ్గురుపిల్లలు. పంచమభావంలో మూడు గ్రహాలుండటం చూడవచ్చు. 

అప్పటినుండి, తన ముగ్గురు పిల్లలనూ పెంచుకుంటూ, సినిమాలలో పాటలు పాడుతూ కాలం గడిపింది. 

1980 లో తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన సంగీతదర్శకుడు R. D. బర్మన్ ను రెండవపెళ్లి చేసుకుంది. అప్పడు రాహు-కేతుదశ నడిచింది. కొన్ని వందలజాతకాలలో రుజువైన ఈ సూత్రం ఇక్కడ మళ్ళీ రుజువైంది.

కష్టాలు

తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 24-4-1942 న తన 41 వ ఏట చనిపోయాడు. అప్పటికి ఆశాకు 8 ఏళ్ళు మాత్రమే. ఆ సమయంలో ఆమెకు శుక్ర శని కుజ దశ నడిచింది. దశమమైన మకరం నుండి, శని 12 వ భావంలోకి పోవడం, శుక్రుడు మరణాన్ని సూచించే 9 వ భావంలో నీచస్థితిలో ఉండటం, కుజుడు బాధకునిగా దశమం నుండి సుఖస్థానాన్ని చూడటం కారణాలు.  

ఈమెయొక్క  రెండవసంతానమైన వర్షా భోంస్లే, 8-10-2012 న తుపాకీతో తలను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కారణమన్నారు. అప్పుడు ఆశాకు శని రవి బుధ దశ నడిచింది. తులనుండి, యోగకారకుడైన శనికి భ్రష్టత్వం కలగడం, రవి కేతుగ్రస్తుడవడం, బుధునికి అస్తంగత్వం పట్టడం కారణాలు.  ఆనాడు, తులకు 2/8 ఇరుసులో నీచరాహుకేతువులున్నాయి. రాహువుతో కలసి కుజుడున్నాడు. కనుక, డిప్రెషన్లో, దూకుడునిర్ణయం తీసుకుని కాల్చుకుని చనిపోయింది. 

ఈమెయొక్క  మొదటిసంతానమైన హేమంత్ భోంస్లే 26-9-2015 న కేన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పుడీమెకు శని రాహు రాహు దశ నడిచింది. సింహం నుండి, శని రోగాధిపతి అవుతాడు. రాహువు మారకస్థానంలో ఉన్నాడు. శపితదశ నడిచింది. పంచమభావం దెబ్బతిని ఉన్నది. కనుక మొదటికుమారుడు దీర్ఘవ్యాధితో చనిపోయాడు.

ముగింపు

చివరకు 12-4-2026 న 92 వ ఏట తను చనిపోయింది. అప్పుడు బుధ శుక్ర శని దశ నడిచింది. ఈ ముగ్గురూ ఈ లగ్నానికి మారకులే కావడం గమనించవచ్చు.

1937-44 మధ్యలో మొదటిసారి, 1967-74 మధ్య రెండవసారి, 1997-2004 మధ్య మూడవసారి, ఇప్పుడు 2026 లో నాలుగవసారి ఏలినాటిశని వచ్చింది. అవి అనేక కష్టాలనిచ్చినప్పటికీ, 92 ఏళ్ల పూర్ణాయుష్షు నిచ్చాయి. దీనికి కారణం లగ్నాష్టమాధిపతి కుజుడు సప్తమకేంద్రంలో ఉండటం.

సంగీతరంగంలో, కళారంగంలో ఉన్నవారికి జీవితాలు బాగుండవని, సంతృప్తిగా ముగియవని, ఏదో ఒక వెలితి వారికి ఉంటుందని, అంటారు. అది చాలావరకూ నిజమే అనిపిస్తుంది, 

ఈ విధంగా, సుఖదుఃఖాలనేవి పడుగుపేకలలాగా పేనుకుని ఉండటం ఆశాభోంస్లే జాతకంలో గమనించవచ్చు. ఇది ఈమె జాతకంలోని ఒక విలక్షణమైన యోగం. 

read more " ఆశా భోంస్లే జాతకం - కొన్ని ఆలోచనలు "