29, మే 2026, శుక్రవారం
నిజమైన అవధూత
18, మే 2026, సోమవారం
వినాయకుడి గుడి
ఈ మధ్యన కొందరు మా ఆశ్రమానికొచ్చారు.
'మా ఫామ్ హౌస్ లో వినాయకుడి గుడి కడుతున్నాం. భోజనాలకు రండి' అని పిలిచారు.
భోజనాలంటూనే పరిగెత్తుకుంటూ పోవడం ఇక్కడ పల్లెల్లో అలవాటు.
' మేమలా భోజనాలకు రాము. ఎవరు పడితే వారు వండినవి మేము తినము' అని వారితో అన్నాము.
వాళ్లకు కాస్త కోపం వచ్చింది.
'అంతా వెజిటేరియనే, మీకేం ఇబ్బంది ఉండదు' అన్నారు వాళ్ళు.
'వెజిటేరియన్ కూడా మాకు ఇబ్బందే. అందుకే మేము రానంటున్నది' అన్నాను
వాళ్ళకర్ధం కాలేదు.
'అదేంటి? బ్రాహ్మలచేతే వండిస్తున్నాము' అన్నారు వాళ్ళు.
'అలా అయితే అసలు రాము' అన్నాము.
వాళ్లకు ఫ్యూజులెగిరిపోయాయి.
'అదేంటి? వినాయకుడి గుడికి రారా?' అన్నారు వాళ్ళు కోపంగా
'వినాయకుడిని చూడటానికి అక్కడకి రావడమెందుకు?' అన్నాను.
'పూజలు భజనలు ఉన్నాయి. రండి' అని బ్లాక్ మెయిల్ చేయబోయారు.
'మీరు పూజలు చేయకపోతే వినాయకుడికేం తక్కువైంది?' అన్నాను.
వాళ్ళదొక రకంగా చూసి వెళ్లిపోయారు.
పిచ్చి జనం, పిచ్చి గోల. ఒక గుడి కట్టడం, పండుగలు పబ్బాలంటూ తంతులు, మైకులతో సౌండ్ పొల్యూషన్, హుండీతో కలెక్షన్. ఇదొక్కటే ఈ పిచ్చిజనానికి తెలిసిన హిందూమతం. ఇలా చెయ్యడమేదో గొప్పని, ఇలా చెయ్యడం ద్వారా హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామని వీళ్లంతా అనుకుంటున్నారు.
అసలైన హిందూమతాన్ని, అసలైన ఆధ్యాత్మికతను అర్ధం చేసుకోవాలంటే వీళ్లంతా ఎన్ని జన్మలెత్తాలో?
15, మే 2026, శుక్రవారం
సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం
'సనాతనాన్ని నిర్మూలించాలి' అని ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అన్నాడు. దానికి వంతపాడుతూ TVK ఎమ్మెల్యే ముస్తఫా 'సనాతనాన్ని నిర్మూలించడానికే మేము పుట్టాము' అన్నట్లుగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఊరకే చూస్తూ కూచున్నాడు.
కేరళలో కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే ఉంది. తమిళనాడులో హిందూవ్యతిరేక ప్రభుత్వమే ఒక క్రొత్త ముసుగులో మళ్ళీ వచ్చింది. తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. ఆంధ్రా ఒక్కటే అటూ ఇటూ ఊగులాడుతోంది.
ఇది చాలా మంచి పరిణామం.
పదిహేనేళ్ల తర్వాత, రాష్ట్రం సర్వనాశనం కాబోతున్న అంచులో మాత్రమే బెంగాల్ కు బుద్దొచ్చింది. ఇప్పుడు తవ్వుతుంటే సరిహద్దులలో వందలాది సొరంగాలు బయటపడుతున్నాయి. కోటిమంది పైన బాంగ్లాదేశ్ ముస్లిములు, రోహింగ్యాలు మన దేశంలో ఇప్పటికే ఉన్నారు. బెంగాల్లో బీజేపీ రాకపోయి ఉంటే ఒకటి రెండేళ్లలో దేశం మొత్తం పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ల చేతులలోకి వెళ్ళిపోయి ఉండేది. కనీసం చివరి నిముషంలోనైనా బెంగాలీలు కళ్ళు తెరిచారు. సంతోషం.
కానీ దక్షిణాది అయిదురాష్ట్రాలకు మాత్రం ఇంకా తెలివి రావడంలేదు. బహుశా ఇంకా ఇంకా చేతులు కాలాలేమో? అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తారేమో?
ఈ వైరస్ ను ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు పెంచి పోషిస్తున్నాయి. వీటికెప్పుడు బుద్ధొస్తుందో తెలీదు. చూడబోతే మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదని అనిపిస్తోంది. ఇదంతా ఊహించే, ఇలా జరగాలని చాలా ముందునుంచి కోరుకునే, ఇటువంటి పరిపాలనావ్యవస్థను, ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారేమో ఘనత వహించిన నాయకులనిపిస్తోంది.
పూర్తిగా కుళ్లిపోయేదాకా కళ్ళు మూసుకోవడం, చివర్లో లబో దిబో అనడం మనకు అలవాటేగా?
తమిళనాడు హిందువులారా ! లేవకండి. ఇదేవిధంగా నిద్రపోతూ ఉండండి. 'మిమ్మల్ని నాశనం చెయ్యడానికే మేం వచ్చాం' అనేవాళ్లకే ఓట్లేసి గెలిపించుకోండి. ఉదయనిధికి, ముస్తఫాకి, జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళకి పూర్తిగా మద్దతివ్వండి. కాళ్లకు మొక్కండి. సన్మానాలు చెయ్యండి. వెనక్కు తగ్గద్దు. ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. ఒకనాటికి మీకే తెలుస్తుంది. అప్పటికి మీకు ఉనికే ఉండదు.
వ్యక్తిగతస్వార్ధాలకోసం దేశాన్నే ముంచేసేవాళ్ళని మన దేశంలోనే చూడగలం మరి !
It happens only in India !
14, మే 2026, గురువారం
ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు?
తమిళనాడులో ప్రభుత్వం మారింది. సినిమానటుడు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళప్రజలు తెలుగుప్రజలకు ఏమీ తీసిపోరని మళ్ళీ ఋజువైంది.
చూడబోతే దక్షిణాదిరాష్ట్రాలకు వేటికీ దూరదృష్టి, వాస్తవికదృష్టి లేవని అర్థమౌతోంది. కాకపోతే ఒకటి ! ప్రజలకు ఛాయిస్ లేదు. నెగటివ్ ఓటు పనిచేస్తోంది. ఉన్నవాళ్లలో కాస్త మెరుగనిపించిన వాడిని ఎన్నుకుంటున్నారు. అయిదేళ్ల తర్వాత మళ్ళీ మోసపోయామని గ్రహిస్తున్నారు. మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది.
అయితే, తమిళప్రజలకు అన్నామలై నచ్చలేదు. విజయ్ నచ్చాడు.
అన్నామలై విద్యావంతుడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. IIM గ్రాడ్యుయేట్. IPS సాధించాడు. ముక్కుసూటి ఆఫీసర్. వాటిని వదిలేసి దేశంకోసం ప్రజలకోసం రాజకీయాలలోకి వచ్చాడు. అతను ప్రజలకు నచ్చలేదు.
జోసెఫ్ విజయ్ సినిమాకుటుంబం నుంచి వచ్చాడు. ఇంటర్ మాత్రమే పాసయ్యాడు. అదికూడా అవలేదని, మధ్యలో మానేశాడని కొంతమంది అంటున్నారు. తల్లిదండ్రుల అండదండలతో హీరో అయ్యాడు. ఉద్రేకాలను రెచ్చగొట్టే పంచ్ డైలాగులతో, వాస్తవదూరమైన కథలతో జనాలకు దగ్గరయ్యాడు. వాట్సాప్ గ్రూపులతో, ఇంస్టాగ్రామ్ రీళ్ళతో పార్టీ పెట్టాడు. ఆచరణలో చెయ్యలేని, పనికిరాని వాగ్దానాలు గుప్పించాడు. జనాలు మెచ్చారు. గెలిచాడు. ముఖ్యమంత్రి అయ్యాడు.
ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. మరి రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఏంటో చూద్దామా?
2011 లో AIADMK ఓడిపోయి DMK అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.
15 ఏళ్ల తర్వాత ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుతో DMK ప్రభుత్వం విజయ్ కి పగ్గాలు అప్పగించింది. అంటే ఈ 15 ఏళ్ల హయాంలో, 5 లక్షల కోట్ల అప్పు కాస్తా, 10 లక్షల కోట్ల అప్పుగా మారింది.
తమిళనాడు వార్షికబడ్జెట్ 3.44 లక్షల కోట్లు. అంటే, బడ్జెట్ కు మూడురెట్లు అప్పులున్నాయి. ఒక కుటుంబం దృష్టిలో మాట్లాడుకోవాలంటే, నెలకు పదివేలు సంపాదన అయితే, ముప్పై వేలు అప్పుంది. ఇదంతా ఎలా తీరాలి? ఎవరు తీర్చాలి?
ఈ తెచ్చిన అప్పులన్నీ ఎలా ఖర్చుపెట్టబడ్డాయి?
రకరకాల స్కీముల కింద ప్రజలకు కొంత పందేరం చెయ్యడం, కొంత నొక్కెయ్యడం ఇదే ఎక్కడైనా జరిగేది, జరుగుతున్నది కూడా. ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోతున్నాయి? ఏ స్విస్ బ్యాంక్ కో, ఏ సింగపూర్ కో తరలిపోతున్నాయి. అంతేగాని, రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెట్టడంగాని, ఒక రెవెన్యూ సృష్టించే ప్లాన్ గాని లేవు. ఉద్యోగాల సృష్టి లేదు. సంపద సృష్టి లేదు. అప్పులు తేవడం, వాడుకోవడం, దేశసంపదంతా విదేశీ బ్యాంకులకు తరలిపోవడం. ఇదీ గత 70 ఏళ్లుగా జరిగింది. ఈ వరస ఒక్క తమిళనాడులోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ప్రజలు ఎక్కడైనా గొర్రెలేగా !
జనాలకు ఇదంతా పట్టదు. మన కులపోడైతే చాలు, నెలకింత అని డబ్బులిస్తుంటే చాలు, మనోళ్లు చేసే దౌర్జన్యాలు, నేరాలు అన్నీ మాఫీ చేస్తుంటే చాలు, వాడు దేవుడు.
ఈ డబ్బులన్నీ ఎక్కడనుంచి వస్తాయి? అన్న ఆలోచన ఎవడికీ లేదు. రాష్ట్రం ఎటుపోయినా మనకనవసరం ! వాస్తవాలు ఎవరికీ అక్కర్లేదు. నాలుగు డైలాగులు చెప్పి ఉద్రేకాలను రెచ్చగొట్టి, పది వాగ్దానాలు చేస్తే చాలు, ఓట్లు పడిపోతాయి. తర్వాత, మనం కట్టే టాక్స్ ని సగం నొక్కేసి, సగం మనకే పంచేసి చేతులు దులుపుకుంటారు. అదేమంటే కేంద్రం సాయం చెయ్యడం లేదంటారు. ఈలోపల రాష్ట్రం ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇలాంటి ప్రజలకు ఇలాంటి ప్రభుత్వాలు రాక ఇంకేమొస్తాయి?
ఇంకొక విచిత్రం చెప్పనా !
సమాజంలో ఏ ఉద్యోగానికైనా ఒక అర్హత కావాలి. పాతిక ముప్పై ఏళ్ళు చదువుకొని, ఎన్నో పరీక్షలు వ్రాసి, కష్టపడితే గాని ఒక స్థాయి ఉద్యోగం రాదు. కానీ రాజకీయాలకు మాత్రం ఏ విధమైన అర్హతా అవసరం లేదు.
ఆటోడ్రైవర్ మంత్రి కావచ్చు. మేకప్ మ్యాన్ ప్రభుత్వ చీఫ్ విప్ కావచ్చు. స్టూడియో బాయ్ స్పీకర్ కావచ్చు. "అనుభవం లేకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తావు నాయనా?" అంటే, "ఐఏఎస్ లున్నారు కదా, వాళ్ళని పెట్టి నడిపిస్తాం" అంటారు. వాళ్లలో నిజాయితీపరులెందరు?
UPSC లో ఏడాదికేడాది క్వాలిటీ తగ్గిపోతున్నది. మజ్జిగ పలచబడిపోతున్నది. రెండు ముక్కలు ఇంగ్లీషు గట్టిగా మాట్లాడలేని వాళ్ళు IAS, IPS అవుతున్నారు. టెన్త్ తప్పినవాళ్లు, ఇంటర్ నాలుగుసార్లు రాసినవాళ్లు UPSC లో సెలక్ట్ అవుతున్నారు. చాలామందిలో కులపిచ్చి, డబ్బుపిచ్చి చాలా ఎక్కువగా ఉంటోంది. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినవే. ఊహలు కావు.
నేను IRTS కేడర్ లో చూశాను. నిజాయితీపరులను, నిక్కచ్చిగా ఉండేవాళ్ళను, అవినీతి చెయ్యనివాళ్లను కనీసం వేళ్ళపైన కూడా లెక్కపెట్టలేము. చాలావేళ్ళు మిగిలిపోతాయి. అలా ఉంటుంది పరిస్థితి.
అది సెంట్రల్ సర్వీసయినా, స్టేట్ సర్వీసయినా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎటూ మొగ్గకుండా, అవినీతికి పాల్పడకుండా, రూలు ప్రకారం పనిచేసే అధికారులు ఎక్కడా లేరు. అందరూ ఏదో ఒకచోట పడిపోయేవారే, ఏదో ఒక పార్టీకి, ఒక భావజాలానికి కొమ్ముకాసేవారే. ఉంటే గింటే నిజాయితీపరులు ఒకరిద్దరున్నారేమో అక్కడక్కడా ! వాళ్ళనెలాగూ పక్కన పెట్టేస్తారు కాబట్టి బాధ లేదు.
అనుభవం లేని నాయకులతో, నైతికస్థాయిలేని అధికారులతో రాష్ట్రాలుగాని, దేశాలుగాని ఎలా ఎదుగుతాయో, ఎక్కడకు ఎదుగుతాయో దేవుడికే ఎరుక !
ఇకపోతే మరొక కొసమెరుపు !
తన వ్యక్తిగతజ్యోతిష్కుడిని ప్రభుత్వసలహాదారుగా నియమించిన జోసెఫ్ విజయ్, అందరినుంచీ ప్రతిఘటన రావడంతో ఆ ఆర్డర్ ను మర్నాడే హడావుడిగా కేన్సిల్ చేశాడు.
అసలు, క్రైస్తవం భారతీయజ్యోతిష్యాన్ని ఒప్పుకుంటుందా? జోసెఫ్ కి మన జ్యోతిష్యమెందుకు? లేక, అవసరం ఉంటే ఏదైనా పరవాలేదా?
ఆమాత్రం ఒత్తిడిని తట్టుకోలేనివాడు, ముందుముందు రాబోయే రాజకీయసంక్షోభాలను, బలపరీక్షలను, రాష్ట్రసమస్యలను ఎలా తట్టుకుంటాడనేది అసలైన ప్రశ్న !
మళ్ళీ, ఈ విమర్శించిన ప్రతిపక్షాలన్నింటికీ ఎవడో ఒక జ్యోతిష్కుడు, ఒక స్వామీజీ తప్పకుండా ఉంటారు. ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారి, ఎన్టీ రామారావుకు మోహన్ రెడ్డి, ఇపుడు జోసెఫ్ విజయ్ కి రాధన్ పండిట్ ఇలా ప్రతి ఒక్కరికీ ఉంటారు. నార్త్ లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. రాజకీయులకు, జ్యోతిష్కులకు, స్వామీజీలకు ఉండే అక్రమసంబంధాలు లోకానికి కొత్తేమీ కాదు.
కాకపోతే, ఈ మొత్తం ప్రహసనంలో ఒక్క విషయం మాత్రం అర్ధంకావడం లేదు. పదేళ్ల తర్వాత జోసెఫ్ విజయ్ సిఎం అవుతాడన్న విషయాన్ని ముందే చెప్పిన రాధన్ పండిట్ వట్రివేల్ కు, తనకు ఇవ్వబడిన పదవి ఒక్కరోజులో ఊడిపోతుందన్న సంగతి తెలుసా లేదా అనేదే ప్రశ్న ! తన జాతకం తను చూసుకోలేదా?
లోకానికి జోస్యాలు చెప్పే జ్యోతిష్కులకు, తమ జాతకం తమకే తెలీకపోవడం ఏంటో ఈ వింత !
ఎవరికీ దూరదృష్టి లేదు, సరియైన ప్లానింగ్ లేదు. నిజాయితీ లేదు, నిస్వార్ధధోరణి లేదు. ఇలాంటి తెలివిలేని దురాశాపరులైన ప్రజలతో, ఇలాంటి అవకాశవాద అవినీతి రాజకీయాలతో, అవినీతి అధికారులతో, ఈ దేశం, ఈ రాష్ట్రాలు బాగుపడటం చాలా కష్టం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప !
ఏంటా అద్భుతం?
ప్రతిరాష్ట్రానికీ ఒక యోగి, ఒక హిమంతశర్మ లాంటివాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటమే ఆ అద్భుతం. అలాంటి అద్భుతమేదీ కనుచూపుమేరలో కనిపించడం లేదు.
It happens only in India అనుకోవడం తప్ప ఈలోపల మనం చేసేదేముంది?
1, మే 2026, శుక్రవారం
మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల
20, ఏప్రిల్ 2026, సోమవారం
సీనియర్ సిటిజన్స్
మనదేశానికి అనేక సమస్యలున్నాయి. పదేళ్లక్రితం వ్రాశాను, త్వరలో మనం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య 'ఊబకాయం' అని. ఇప్పటికీ ఈ సమస్య తీరలేదు. ఇంకా ఎక్కువైంది.
ఇప్పుడు మరొకసమస్య వచ్చిపడింది. నిజానికి ఈ సమస్య పదేళ్లక్రితం నుంచే ఉన్నప్పటికీ, నేడు ఇంకా ఎక్కువైంది. అదే 'సీనియర్ సిటిజెన్స్' సమస్య.
పదేళ్లక్రితం సీనియర్ సిటిజెన్స్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు 'సూపర్ సీనియర్ సిటిజెన్స్' అయ్యారు.
ప్రస్తుతం మన దేశజనాభా 147 కోట్లు. దీనిలో 7 వ భాగం సీనియర్ సిటిజెన్స్ ఉన్నారు. అంటే, 21 కోట్లు. అందుబాటులోకి వచ్చిన మెడికల్ సదుపాయాలతో, మెరుగుపడిన ఆర్ధికవనరులతో, ఇప్పుడు మనం ఎక్కువకాలం బ్రతుకుతున్నాం. 90 దాకా బ్రతుకుతున్నవారు నేడు చాలామంది ఉన్నారు.
అయితే, వీరిలో క్వాలిటీ లైఫ్ ఉందా? అంటే, లేదనే చెప్పాలి. మందులేసుకుంటూ, సోఫాలకు, వీల్ చెయిర్లకు పరిమితమైపోయి, టీవీలు చూసుకుంటూ బ్రతుకుతున్నవారు కనీసం వీరిలో 5 కోట్లమంది ఉంటారు. ఇంకా పైమాటే కావచ్చు. వీరికి ఎదురౌతున్న అతిపెద్ద సమస్య - చూసుకునేవాళ్ళు లేకపోవడం.
వీళ్ళదగ్గర డబ్బులున్నాయి. ఇంకా కావలసివస్తే, పంపడానికి అమెరికావంటి దేశాలలో పిల్లలు మంచిపొజిషన్లలో ఉన్నారు. కానీ వాళ్ళిక్కడికి రాలేరు. వీళ్ళక్కడికి పోయి ఉండలేరు. ట్రంప్ రానివ్వడు. అయన ఒప్పుకున్నా యుద్ధం రానివ్వదు. అక్కడకెళ్లినా చివరకు ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరవలసిందే.
ఇక్కడా వీళ్ళను చూసుకునేవారు లేరు. అక్కడా ఉండరు. మరేం చెయ్యాలి?
మా ఆశ్రమం దగ్గర్లోనే ఒక ఊరుంది. అందులో, ఇంటికొకరు చొప్పున అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో, ఇంటిలోని ముసలాళ్ళు అరుగులమీద కూచుని శూన్యంలోకి చూస్తూ ఉంటారు. పెద్దపెద్ద ఇళ్ళు. చేసేవారు లేరు. చూసేవారు లేరు. ఏం చెయ్యాలో తెలియని స్థితి.
ఇదీ నేడు మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి.
అందుకనే వృద్ధాశ్రమాలు ఎక్కువౌతున్నాయి. అయితే వాటిలో కూడా తేడాలున్నాయి. కొన్నింటిలో మంచి సదుపాయాలుంటే, చాలావాటిల్లో అరకొర సదుపాయాలే ఉంటున్నాయి.
కొంతమంది సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా 40కే ఉద్యోగాలు మానేసి వృధ్ధాశ్రమాలు నడుపుకుంటూ జీవిస్తున్నారు. టెన్షన్ ఉండదు. వృద్ధులకు సేవ చేసినట్లు ఉంటుంది. అన్న ఆలోచనతో దీనిని చేస్తున్నారు.
వృద్ధాశ్రమం అంటే బాగుండదని, వీటిని 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్' అంటున్నారు. అమెరికాలో అయితే, సీనియర్ సిటిజెన్స్ కోసం పెద్దపెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే సెటిలైన కొంతమంది మనవాళ్ళు కూడా వీటిని పెట్టారు. పెట్టబోతున్నారు.
మొన్న హైద్రాబాద్ వెళ్ళినపుడు ఒకాయన్ని కలిశాను. ఆయనకు 85 ఏళ్ళు.
'నేను 125 వరకూ బ్రతుకుతాను' అన్నాడాయన. 'డైట్ లో జాగ్రత్తగా ఉంటూ, మంచిమందులు వాడుకుంటూ ఉంటే 125 దాకా బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు' అన్నాడు.
'అన్నాళ్ళు బ్రతికి ఏం చేద్దామని?' అన్నాను చనువుగా.
'ఏమీ లేదు. బ్రతకడమే. కొత్తగా చేసేదేమీ లేదు. చేసేదంతా వయసులో ఉన్నపుడు చేశాం. ఇప్పుడు చేసేదేమీ లేదు' అన్నాడాయన.
'మిమ్మల్ని చూసుకునే పనివారి జీతభత్యాలకు నెలకు ఎంత ఖర్చవుతుంది?' అనడిగాను.
'దాదాపుగా లక్షా ఏభై వేలౌతుంది' అన్నాడు.
'మీరు భరించగలరు కాబట్టి భరిస్తున్నారు. అందరూ పెట్టుకోలేరు. వాళ్ళ గతేంటి?' అడిగాను.
'వాళ్లకు తగిన కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్ వారికున్నాయి' అన్నాడాయన.
స్వయానా ఆయనే అటువంటి ఒక సెంటర్ను కొన్నేళ్లపాటు నడిపి ఇప్పుడు చేతకాక విరమించుకున్నాడు.
'మీ ఆశ్రమంలో ఇటువంటి ఫెసిలిటీ పెడితే బాగుంటుంది కదా' అని కొందరడిగారు.
'మాది సాధనాశ్రమం, వృద్ధాశ్రమం కాదు' అని వారికి చెప్పాను.
ఈ వృద్ధులకు హఠాత్తుగా ఏదైనా అయినా కూడా, విదేశాలనుండి వెంటనే వచ్చే పరిస్థితిలో వీళ్ళ పిల్లలు లేరు. 'ఏదో ఒకటి చేసెయ్యండి. వీడియోలో చూస్తాం. డబ్బులు పంపిస్తాం' అని కొందరంటున్నారని ఒక వృద్ధాశ్రమం నడిపేవారు నాతో అన్నారు.
కాళ్ళూచేతులూ సరిగ్గా ఉన్నంతవరకే ఎవరి ఆటలైనా సాగుతాయి. ఏదైనా తేడా వస్తే, మామూలు మనిషైనా, రిటైర్డ్ ఐఏఎస్ అయినా, డిప్యూటీ సిఎం అయినా, ఆస్పత్రిపాలు కావలసిందే. ఒకరిపైన ఆధారపడవలసిందే. డబ్బుంటే కొంతవరకూ నడుస్తుంది. ప్రేమగా చూడకపోయినా, ఏదోరకంగా చూసుకునేవారైనా కనీసం ఉంటారు. అదికూడా లేకపోతే, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
నేడు అలాంటి దారుణపరిస్థితిలో ఉన్న పెద్దవారి సంఖ్య 21 కోట్లు. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.
వీళ్ళను జాగ్రత్తగా చూసుకునే 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్లు' మరిన్ని రావలసిన అవసరం ఉన్నది. టెన్షన్ లేని జీవితం మనదేశంలోనే గడపాలని అనుకునేవారికి ఇదొక మంచి బిజినెస్ అవకాశం. ఔత్సాహికులు ముందుకొస్తే బాగుంటుంది.
రేప్పొద్దున వీళ్ళ పరిస్థితైనా, ఇంకెవరి పరిస్థితైనా ఇంతేగా మరి!
18, ఏప్రిల్ 2026, శనివారం
రాజశ్యామల - బగళాముఖి
కొంతమంది బంధుమిత్రులను కలిసే పనిమీద రెండ్రోజులపాటు హైద్రాబాద్ లో ఉండి ఆశ్రమానికి తిరిగి వచ్చాము. మొదటిసారి హైద్రాబాద్ నరకంలాగా అనిపించింది.
1980 లో నేను హైదరాబాద్ లో మొదటిసారి అడుగుపెట్టాను. బెంగుళూరుకూడా అప్పుడే చూశాను. ఆ రోజులలో ఆ సిటీలు రెండూ స్వర్గాలు. నేడు నరకాలయ్యాయి.
1980 డిసెంబర్ లో చీకటిపడ్డాక దిల్సుఖ్ నగర్ రోడ్డుమీద నడుస్తుంటే, చలి అలవాటు లేనివాళ్లకు స్వెటర్ వేసుకోవలసిన అవసరం అయ్యేది. బడుగువర్గాలు కంబళ్ళు కప్పుకుని చిన్నచిన్న చలిమంటలేసుకుంటూ ఉండేవారు.
నేడు పొద్దున్న పదిగంటలకి రోడ్డుమీద నడుస్తుంటే గాడ్పు కొడుతోంది. వడదెబ్బ తగిలేటట్టుంది. ఒక గంట పనిమీద బయటకెళ్ళి వస్తే, షవర్ క్రింద స్నానం చేసి, ఏసీలో కూర్చోవలసి వస్తోంది. హైద్రాబాద్ వాతావరణం అంతగా పాడైపోయింది. ఇక బెంగుళూరు మాటైతే చెప్పాల్సిన పనే లేదు. జీవితం పైన విరక్తి పుట్టేట్టుగా ఉన్నది.
ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్. నేల, మట్టి, ఎక్కడా లేవు. చెట్లు లేవు. వెహికిల్ పొగ, పెరిగిపోయిన జనాభా, ఏసీల నుండి వస్తున్న వేడి, కాంక్రీట్ బిల్డింగ్స్ నుండి రిఫ్లెక్ట్ అవుతున్న ఎండ, అన్నీ కలసి చల్లటి హైద్రాబాద్ ని నిప్పులకుంపటిగా మార్చేశాయి. నేను విజయవాడలో ఉన్నానా? లేక హైద్రాబాద్ లో ఉన్నానా? అర్ధం కాలేదు. రెండూ ఒకే విధంగా అనిపించాయి.
హైద్రాబాద్ తో పోలిస్తే మా ఆశ్రమం స్వర్గంలాగా ఉంది.
ఈలోపల ప్రక్కనున్న ఒక శిష్యురాలు, 'రాజశ్యామలంటే ఎవరు?' అని అడిగింది ఒక వాల్ పోస్టర్ను చూస్తూ.
అటు చూశాను. విషయం అర్ధమైంది.
'రాజుగారింట్లో ఉండే శ్యామల' అన్నాను.
'జోకులాపి విషయం చెప్పండి' అన్నది.
'రాజశ్యామలంటూ ఎవరూ లేరు. అదొక మాయ. దశమహావిద్యలలో ఆమెపేరు మాతంగి. ఆమె ఉపాసన మంచి కవిత్వశక్తినిస్తుంది. మంచిమేధస్సునిస్తుంది. లలితకళలలో మంచి ప్రజ్ఞనిస్తుంది. తారాదేవికే మరొకపేరు శ్యామల. మామూలుభాషలో సరస్వతీదేవి, తాంత్రికప్రపంచంలో మాతంగి అయింది. మన 'తారాస్తోత్రం' చదివావు కదా. తార అన్నా, మాతంగి అన్నా, శ్యామల అన్నా ఆమెనే. తెలుగు సరిగ్గారాని నేను ఇప్పటికి పదివేలపైగా పద్యాలు వ్రాశానంటే అదెలా కుదిరిందంటావు? ఆలోచించు' అన్నాను.
'మరి రాజశ్యామల అని ఎందుకంటారు?' అడిగింది.
'శ్రీవిద్యోపాసనా విధానంలో, లలితాపరమేశ్వరిని ఒక రాణిగా అనుకుంటే, ఆమెకొక మంత్రి, ఒక సేనాపతి ఉంటారు. ఆ మంత్రిణీదేవత పేరే మాతంగి. రాజపరివారంలో ఉంటుంది గనుక, రాజ్యాధికారాన్ని నడిపిస్తుంది గనుక రాజశ్యామల అని పేరు మార్చారు. ఈమెకు హోమం చేస్తే రాజ్యాధికారం వస్తుందని మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ రాదు. దశమహావిద్యలు తెలుగువారి చేతులలో భ్రష్టు పడుతున్నాయి. అంతే.
మహావిద్యలు అవినీతిని సపోర్ట్ చెయ్యవు. అవి మన గొంతెమ్మకోరికలను తీర్చుకునే మంత్రవిద్యలు కావు. పాతాళభైరవి, బాలనాగమ్మ సినిమాలు చూస్తే ఇలాంటి పైత్యాలు పుడతాయి. అవి ఆత్మసాధనా విద్యలు మరియు మోక్షవిద్యలేగాని, మోసవిద్యలు కావు.
నువ్వు చేసే మినప్పప్పు, కందిపప్పు, మిరపకాయల హోమాలతో జగన్మాత కరుణిస్తుందని, నీ గొంతెమ్మ అవినీతికోరికలను తీరుస్తుందని అనుకుంటే అంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి ఉండదు. దురదృష్టవశాత్తూ, గత పాతికేళ్లుగా ఇటువంటి ట్రెండ్ లను కొంతమంది సోకాల్డ్ స్వాములు పెంచి పోషిస్తున్నారు. వీళ్లకు రాజకీయులు వంతపాడుతున్నారు. నేడు దీనినొక వ్యాపారంగా మార్చారు. వెరసి మహావిద్యోపాసనను క్షుద్రవిద్యల స్థాయికి దిగజార్చారు.
దశమహావిద్యలనేవి ఇనుమును బంగారంగా మారుస్తాయి. కానీ మనం వాటినుపయోగించి బంగారాన్ని మట్టిగా మార్చుకుంటున్నాం. రామకృష్ణులు చెప్పలేదా, రాజు దగ్గరకెళ్ళి పుచ్చువంకాయలు కోరతారని? అంతే' అన్నాను.
'మరి తెలిసినవాళ్ళు చెప్పచ్చు కదా?' అన్నది.
'ఎవరు వింటారు? స్వార్ధపుకోరికలతో కుళ్లిపోతున్న ప్రపంచానికి నిజాలెందుకు? మాయలే కావాలి. ఉన్నతమైన భావజాలం ఎవరికుంది? కోరికలు తీరడం, అప్పనంగా కోట్లు వచ్చి పడటం, పవర్ చేతిలోకి రావడం, దానితో మళ్ళీ అవినీతి చేసి వేలకోట్లు వెనకెయ్యడం ఇదేకదా నేటి ట్రెండ్? సమాజంలోగాని, మనుషులలోగాని నీతి ఎక్కడుంది? అసలైన ఆధ్యాత్మికత ఎవడికి కావాలి ఈరోజుల్లో? అన్నీ నకిలీబ్రతుకులేగా?' అన్నాను.
'దశమహావిద్యలలో అన్నీ అంతేనా?'అడిగింది.
'అంతే. ఉదాహరణకు బగళాముఖిని చూడు. మొన్నొకామె 'నేనుకూడా బగళాముఖి చేస్తున్నా' అన్నది. 'రాత్రికి ఉప్మా చేస్తున్నా' అన్నట్టు.
ఎందుకమ్మా అంటే, 'శత్రుస్తంభన' అన్నది.
'అదేంటంటే, 'శత్రువులు నాశనమైపోతారు' అన్నది.
'ఎవరిదగ్గర ఉపదేశం పొందావు?' అంటే, 'ఉపదేశం ఎందుకు? యూట్యూబ్ లో చూసి మంత్రం జపిస్తున్నా' అన్నది.
'నువ్వేమైనా దావూద్ ఇబ్రహీంవా? లేక ఏవైనా చీకటివ్యాపారాలు చేస్తున్నావా? అంతమంది శత్రువులు నీకెందుకున్నారు?' అని నేనడిగాను.
'అదికాదు. మన మాట చెల్లుబాటు కావడానికి' అంది.
'నువ్వు ధర్మంగా జీవించడం ముఖ్యంగాని, నువ్వు వాగేది ఏదైనా సరే చెల్లుబాటు కావాలని అసలెందుకు కొరుకుంటున్నావు? శత్రువులైనా ఇంకొకరైనా నాశనం కావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది తప్పుకాదా? దీనికి బగళాముఖి సపోర్టా? పైగా యూట్యూబ్ లో చూసి జపిస్తున్నావా?' అని అడిగాను.
జవాబు లేకపోగా, 'నీకింతేనా తెలిసింది?' అన్నట్టు చూసింది' అన్నాను.
శిష్యురాలు ఆలోచనలో పడింది.
'అసలీ దేవతలందరూ ఉన్నారా? మనం చేసే అన్నిపనులలో మనకు సపోర్ట్ చేస్తారా?' అడిగింది.
'ఉన్నది ఒకటే శక్తి. దానిని నీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని ఆరాధిస్తున్నావు. అదికాదు ముఖ్యం. నీ జీవితంలో నువ్వెంత శుద్ధంగా బ్రతుకుతున్నావనేది ముఖ్యం. నీ మంత్రాలకు, హోమాలకు, నైవేద్యాలకు పడిపోవడానికి దేవుడు ఒక వెర్రివెంగళప్ప కాదనే విషయం నువ్వు ముందుగా అర్ధం చేసుకోవాలి. మనుషులకు లంచాలిచ్చి పనులు చేసుకున్నట్టు, దేవుడికి పూజలు హోమాలు చేసి పనులు సాధించాలనుకోవడం ఎంత వెర్రో చూడు.
బగళాముఖి అంటే శత్రుస్తంభన నిజమే. కానీ, వాళ్ళు బయటి శత్రువులు కారు. నీలోపల ఉన్న శత్రువులు. నీలోని షడ్వర్గాలు స్తంభించడమే శత్రుస్తంభన. మూతపడాల్సింది ఎదుటివ్యక్తి నోరు కాదు, నీ నోరు. విచక్షణాశక్తి నీలో కళ్ళు తెరిస్తే అది జరుగుతుంది. అది అసలైన బగళాముఖి.
అలాంటిదే రాజశ్యామల కూడా. రాజ్యాధికారం అంటే ఆత్మజ్ఞానం. అది కలగడమే రాజశ్యామల అనుగ్రహం. అంతేగాని, అవినీతిపనులు చేసి కుర్చీ ఎక్కడం కాదు. ఎక్కి, ఇంకా అవినీతి చెయ్యడమూ కాదు. నీ లౌకికవిజయాలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఆధ్యాత్మికమెలాగూ ధర్మం లేకుండా రాదు. ఇదీ అసలైన మహావిద్యోపాసన' అన్నాను.
'మనం అడిగేది ఏదైనా సరే దేవుడు ఇవ్వడా?' అడిగింది.
'నీ పిల్లలు ఒక గొంతెమ్మకోరిక కోరారనుకో. నువ్విస్తావా?' అడిగాను.
'ఇవ్వను' అంది
'మరి దేవుడికి నీకంటే తెలివి ఎక్కువుందా? తక్కువుందా?' అడిగాను.
'మరి ఈ విషయాన్ని ఎవరూ చెప్పడం లేదేంటి?' అడిగింది.
'వాళ్ళూ వాళ్ళూ భాగస్వాములేగా. నిజాలను ఎందుకు చెప్తారు? చెప్పినా వినేదెవరు? అందరూ అదే తానులో ముక్కలేగా?' అన్నాను.
'మరి ఈ గోలతో హిందూధర్మం నాశనం కావడం లేదా?'అడిగింది.
'నాశనమయ్యేది ధర్మమెలా అవుతుంది? ధర్మం నాశనం కాదు. మనం అవుతాం. సమాజంలో వెర్రిపోకడలు పెరుగుతున్నాయి. అంతే. అందుకే రాజశ్యామల, వారాహి, ఛిన్నమస్త, ప్రత్యంగిర, ఉగ్రభైరవి మొదలైన దేవతల ఆరాధన పెరుగుతున్నది. మనుషులలో పెరుగుతున్న పిచ్చికోరికలకు, దౌర్జన్యపూరిత ధోరణులకు ఇది సంకేతం.
గీతలో కృష్ణభగవానుడు చెప్పలేదా, ఎవరెవరి సంస్కారాలను బట్టి వారువారు ఆయా దేవతలను కొలుస్తారని? సాత్వికం, రాజసికం, తామసికం అంతే. సత్త్వం తగ్గిపోతున్నది. తక్కిన రెండూ పెరుగుతున్నాయి. దానికి తగినట్టే దేవతారాధన కూడా ఉంటోంది. మన కర్మకూడా దానికి తగినట్టే ఉంటుంది. కర్మకు తగినట్టే ఫలితం ఉంటుంది.
నీ కర్మను ఏ దేవతా తగ్గించదు. నువ్వే తగ్గించుకోవాలి. వీళ్ళు ఇంకాఇంకా పెంచుకుంటున్నారు. తెలుసుకునేనాటికి సమయం చేజారిపోతుంది. అంతే. అసలు తెలుసుకోగలుగుతారా లేదా అన్నది కూడా డౌటే' అన్నాను.
'అలాగా' అంది శిష్యురాలు సాలోచనగా.
మాటల్లోనే ఇల్లొచ్చేసింది. కారు దిగి ఇంట్లోకి దారితీశాను.
ఆశా భోంస్లే జాతకం - కొన్ని ఆలోచనలు
తన సోదరి లతామంగేష్కర్ లాగానే ఈమెకూడా 92 ఏళ్ళు బ్రతికింది. కనుక, వీరి జీన్స్ గట్టివే. అయితే వీరి తండ్రి దీనానాధ్ మంగేష్కర్ మాత్రం 41 ఏళ్లకే చనిపోయాడు. కనుక తల్లిగారి జీన్స్ బలమైనవి కావచ్చు. తల్లిగారు శేవంతి 90 ఏళ్ళు బ్రతికారు కాబట్టి లెక్క సరిపోతున్నది.
ఈమె 8-9-1933 న సాంగ్లీ లో పుట్టింది. జననసమయం 9. 30 pm అని ఉంది. దీనిని నేను 9. 28 కి సవరించాను. జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు.
2 మరియు 3 భావాలకు అధిపతులుగా ఈమె జీవితంలోని సంగీతవిజయాలకు బుధశుక్రులే కారకులు. వీరు లలితకళలకు కారకులు కూడా. అయితే, ఈమె పడిన కష్టాలకు కూడా వీరే కారకులయ్యారు. రవిబుధులు సింహంలో ఉండటం బుధాదిత్యయోగం. అయితే, బుధుడు అస్తంగతుడయ్యాడు. కనుక కష్టసుఖాలు కలగలసి ఈమె జీవితంలో వచ్చాయి.
4 వ అధిపతియైన చంద్రునికి, 5 వ అధిపతియైన రవికి ఏర్పడిన కోణదృష్టి రాజయోగాన్నిచ్చింది.
విజయాలు
12-12-2001 న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. అప్పుడు గురు రాహు శుక్ర బుధ దశ నడిచింది. గురువు పూర్వపుణ్యాధిపతి. రాహువు కర్మాధిపతి. అయితే, శనికి సూచకుడు. కనుక శపితయోగం ఉంది. బుధశుక్రులు దోషులు, కానీ యోగకారకులయ్యారు.
5-5-2008 న పద్మవిభూషణ్ అవార్డు ఈమెను వరించింది. ఆనాడు శని కేతు చంద్ర శని దశ నడిచింది. శని కర్మస్థానాధిపతిగా పూర్వపుణ్య స్థానంలోకి వస్తున్నాడు. కేతువు బుధాదిత్యయోగంలో ఉన్నాడు. చంద్రుడు సుఖస్థానాధిపతిగా బలంగా ఉన్నాడు.
అయిదుదేశాలలో, ముఖ్యంగా దుబాయ్, కువైట్ లలో Asha's అనే చైన్ రెస్టారెంట్లను పెట్టింది. అవి బాగా నడుస్తున్నాయి. 10 వ భావంలో ఉన్న వక్రశని, ఆయనపైన ఉన్న గురుశుక్ర దృష్టులు ఈ విజయాలకు కారణాలు. శుక్రుడు 2 వ భావాధిపతిగా ఎలైట్ డైనింగ్ ను సూచిస్తాడు.
1949 లో లతామంగేష్కర్ యొక్క సెక్రటరీ అయిన గణపత్ రావ్ భోంస్లేను ఈమె పెళ్ళిచేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ళు, గణపత్ కు 31 ఏళ్ళు. ఆ సమయంలో అర్ధాష్టమశని నడిచింది. దశగా రవి గురుదశ నడిచింది. పంచమరవి ప్రేమవ్యవహారాలకు, 7వ అధిపతితో కలసి ఉన్న గురువు పెళ్ళికి సూచకులు. నీచశుక్రుడు సాంప్రదాయవ్యతిరేక వివాహాన్ని సూచిస్తున్నాడు.
7 వ అధిపతియైన శుక్రుడు, 9 వ అధిపతి గురువుతో కలసి కర్మస్థానంలో నీచలో ఉండటంతో, తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన గణపత్ రావ్ భోంస్లేను పెళ్లి చేసుకోవలసివచ్చింది. తరువాత తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన R. D. బర్మన్ ను రెండవవివాహం చేసుకుంది. గురువు ధనుస్సు 6 వ డిగ్రీలో ఉండటం చూడవచ్చు. దీనికి తగినట్లుగా, R. D. బర్మన్ ఈమెకంటే 6 ఏళ్ళు చిన్నవాడు.
1960 లో గణపత్ తో విడిపోయింది. అప్పుడు చంద్ర-కేతుదశ నడిచింది. దానికి కారణం సంగీతదర్శకుడు O.P.Nayyar తో ఆమెకున్న ప్రేమసంబంధం కూడా. గణపత్ రావ్ పెడుతున్న హింసను తట్టుకోలేక నయ్యర్ కు దగ్గరైంది. చంద్రకేతుదశ గ్రహణదశ. 7 వ భావం దెబ్బతినడం, దానిపైనున్న శనిగురువుల ప్రభావాలు దీనికి కారణాలు. పంచమకేతువువల్ల ప్రేమవియోగం సూచితమౌతున్నది. అప్పటికి వారికి ముగ్గురుపిల్లలు. పంచమభావంలో మూడు గ్రహాలుండటం చూడవచ్చు.
అప్పటినుండి, తన ముగ్గురు పిల్లలనూ పెంచుకుంటూ, సినిమాలలో పాటలు పాడుతూ కాలం గడిపింది.
1980 లో తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన సంగీతదర్శకుడు R. D. బర్మన్ ను రెండవపెళ్లి చేసుకుంది. అప్పడు రాహు-కేతుదశ నడిచింది. కొన్ని వందలజాతకాలలో రుజువైన ఈ సూత్రం ఇక్కడ మళ్ళీ రుజువైంది.
కష్టాలు
తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 24-4-1942 న తన 41 వ ఏట చనిపోయాడు. అప్పటికి ఆశాకు 8 ఏళ్ళు మాత్రమే. ఆ సమయంలో ఆమెకు శుక్ర శని కుజ దశ నడిచింది. దశమమైన మకరం నుండి, శని 12 వ భావంలోకి పోవడం, శుక్రుడు మరణాన్ని సూచించే 9 వ భావంలో నీచస్థితిలో ఉండటం, కుజుడు బాధకునిగా దశమం నుండి సుఖస్థానాన్ని చూడటం కారణాలు.
ఈమెయొక్క రెండవసంతానమైన వర్షా భోంస్లే, 8-10-2012 న తుపాకీతో తలను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కారణమన్నారు. అప్పుడు ఆశాకు శని రవి బుధ దశ నడిచింది. తులనుండి, యోగకారకుడైన శనికి భ్రష్టత్వం కలగడం, రవి కేతుగ్రస్తుడవడం, బుధునికి అస్తంగత్వం పట్టడం కారణాలు. ఆనాడు, తులకు 2/8 ఇరుసులో నీచరాహుకేతువులున్నాయి. రాహువుతో కలసి కుజుడున్నాడు. కనుక, డిప్రెషన్లో, దూకుడునిర్ణయం తీసుకుని కాల్చుకుని చనిపోయింది.
ఈమెయొక్క మొదటిసంతానమైన హేమంత్ భోంస్లే 26-9-2015 న కేన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పుడీమెకు శని రాహు రాహు దశ నడిచింది. సింహం నుండి, శని రోగాధిపతి అవుతాడు. రాహువు మారకస్థానంలో ఉన్నాడు. శపితదశ నడిచింది. పంచమభావం దెబ్బతిని ఉన్నది. కనుక మొదటికుమారుడు దీర్ఘవ్యాధితో చనిపోయాడు.
ముగింపు
చివరకు 12-4-2026 న 92 వ ఏట తను చనిపోయింది. అప్పుడు బుధ శుక్ర శని దశ నడిచింది. ఈ ముగ్గురూ ఈ లగ్నానికి మారకులే కావడం గమనించవచ్చు.
1937-44 మధ్యలో మొదటిసారి, 1967-74 మధ్య రెండవసారి, 1997-2004 మధ్య మూడవసారి, ఇప్పుడు 2026 లో నాలుగవసారి ఏలినాటిశని వచ్చింది. అవి అనేక కష్టాలనిచ్చినప్పటికీ, 92 ఏళ్ల పూర్ణాయుష్షు నిచ్చాయి. దీనికి కారణం లగ్నాష్టమాధిపతి కుజుడు సప్తమకేంద్రంలో ఉండటం.
సంగీతరంగంలో, కళారంగంలో ఉన్నవారికి జీవితాలు బాగుండవని, సంతృప్తిగా ముగియవని, ఏదో ఒక వెలితి వారికి ఉంటుందని, అంటారు. అది చాలావరకూ నిజమే అనిపిస్తుంది,
ఈ విధంగా, సుఖదుఃఖాలనేవి పడుగుపేకలలాగా పేనుకుని ఉండటం ఆశాభోంస్లే జాతకంలో గమనించవచ్చు. ఇది ఈమె జాతకంలోని ఒక విలక్షణమైన యోగం.
17, ఏప్రిల్ 2026, శుక్రవారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 60 (పునర్జన్మలు)
మర్నాడు ఉదయం 'వ' దగ్గర కాసేపు కూర్చుని వద్దామని వెళ్ళాము.
మాటల సందర్భంలో, 'ఈ ఏడాది జనవరిలో ఇక్కడివారు, వేరేచోట్ల ఉన్న అమ్మ భక్తులు, చాలామంది పోయారు' అని 'వ' అన్నది.
'అవును. అమ్మను చూచినవారు, మాట్లాడినవారు, సన్నిహితంగా మెలిగినవారు అందరూ వెళ్లిపోతున్నారు. ఒక స్వర్ణయుగం గతిస్తున్నది' అన్నాను.
ఆమేం మాట్లాడలేదు.
'అమ్మ పునర్జన్మ లేదన్నది కదా ! మరి వీళ్ళందరూ ఏమౌతారు? ఎక్కడకు పోతారు?' నాకు తెలిసినా, ఆమె ఏం చెబుతుందో చూద్దామని అడిగాను.
'వ' ఇలా అన్నది.
'పునర్జన్మ లేదని అమ్మ ఖరాఖండిగా చెప్పలేదు. ఏదైనా ఒక సందర్భంలో అలా అని ఉండవచ్చు. విన్నవాళ్ళు దానిని ఒక సిద్ధాంతంగా మార్చారు. అమ్మ అలా అనలేదు. 'సముద్రంలో అలలవంటివి జన్మలు. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ ఏ రెండు అలలూ ఒక్కటి కావు' అన్నది. దానిని వీళ్ళు అలా అర్ధం చేసుకున్నారు'.
'ఒకకోణంలో పునర్జన్మ ఉన్నది. మరొక కోణంలో లేదు. క్రొత్త అల వస్తుంది. పాత అలగా మాత్రం మళ్ళీ రాదు. నిజమే. ఇది చాలా లోతైన భావన' అన్నాను.
'అవును. అమ్మ చెప్పేవన్నీ ఇలాగే ఉండేవి. ఆమె దేనినీ వివరించి చెప్పదు, క్లుప్తంగా, సూక్ష్మంగా చెబుతుంది. వినేవారు ఎవరికి అర్ధమైనట్లుగా వారు అన్వయించుకొని అర్ధం చేసుకున్నారు' అన్నది 'వ'.
'పునర్జన్మ ఉండటం నిజమే. రికార్డ్ అయిన కేసులే చాలా ఉన్నాయి. కానీ అదే జన్మ మళ్ళీ రాదనేది కూడా నిజమే. అదే మనుషులుండరుకదా మళ్ళీ అలాగే పుట్టడానికి? ఆత్మ లేదన్న బుద్ధుడే తను గతంలో 500 జన్మలెత్తానని అన్నాడు.
అబ్రహామిక్ మతాలకు ఉన్నతమైన తాత్వికచింతన లేదు గనుక, వారు ఊహించుకున్న స్వర్గనరకాలు వారికున్నాయి. వాళ్లకు బంధమోక్షాల గురించిన చింతన లేదు. పైగా వాళ్ళవి శాశ్వతస్వర్గనరకాలు. అది చాలా మోటుభావన. తెలివిలేనివారు మాత్రమే అటువంటి స్వర్గనరకాలను ఊహించుకుంటారు.
క్రైస్తవస్వర్గంలో ఎప్పుడూ సండే చర్చి జరుగుతూ ఉంటుంది. కాయర్ పాడుతూ, దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. అక్కడ ప్రతిరోజూ ఆదివారమే. నాలుగురోజులు పోయాక అదే పెద్ద నరకమనిపిస్తుంది.
ఇక ఇస్లామిక్ స్వర్గంలో ప్రతిరోజూ శుక్రవారమే. పచ్చికబయళ్ళు, పారే సారాయి సెలయేర్లు, ఒక్కొక్కరికి 72 మంది అమ్మాయిలు, ఒక లాస్ వెగాస్ లాగా ఉంటుంది. వారు ఎడారిజీవులు గనుక అటువంటి స్వర్గాన్ని ఊహించుకున్నారు. ఎవరికేవి లేవో, వాటిని తమ స్వర్గంలో ఊహించుకున్నారు. అదీ మూన్నాళ్ళ ముచ్చటేగా. కొన్నాళ్ళకు అదీ బోరు కొడుతుంది. లేదా అమ్మాయిలకోసం అక్కడకూడా కొట్టుకుని చస్తారు. స్వర్గంలో ఛస్తే ఇంకెక్కడికి పోతారో ఏమో? ఇలా ఉంటుందా అన్న బుర్రకూడా వాళ్లకు లేదు. ఆ మతాల తెలివి అంతవరకే.
మన మతంలో చెప్పబడిన పునర్జన్మ అనేదే సత్యమైన సైంటిఫిక్ భావన. అది వాస్తవం కూడా. అమ్మ ఎవరో ఒకరితో మాట్లాడుతున్న సందర్భంలో 'ఆ వ్యక్తికి ఇక పునర్జన్మ లేదు' అని ఉండవచ్చు. దానిని జనరలైజ్ చెయ్యడం తప్పు. శాంతిదేవి కేసు నుండి నేటివరకూ రికార్డు కాబడిన రుజువులు చాలా ఉన్నాయి. కనుక పునర్జన్మ వాస్తవమే
పునర్జన్మంటే అదే మనిషి అదే రూపంలో మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడని కాదు. అలా జరగడానికి అన్నీ అలాగే ఉండవు కదా. మారిపోతుంటాయి. అదే జీవి ఇంకొక రూపంలో ఇంకొకచోట పుడుతుందని మాత్రమే అర్ధం. అది నిజమే. కోరికలు మిగిలి ఉన్నంతవరకూ పునర్జన్మ లేకుండా ఎలా పోతుంది?' అన్నాను
'ఈ తాత్వికచర్చలు నాకు రుచించవు. అమ్మ ఉన్నపుడు అమ్మ చెప్పినట్లు చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. నాకు తెలిసినది ఇంతవరకే' అన్నది 'వ'.
'మీకు అవసరం లేకపోవచ్చు. మీకు కేవలం విశ్వాసమే సరిపోవచ్చు కూడా. ఇంకొందరికి తంతులు రుచించవచ్చు. కానీ అందరికీ అవే నచ్చాలని రూలేమీ లేదు. ఒకేదారి అందరికీ నచ్చకపోవచ్చు కదా !
తాత్వికచింతన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకది అవసరమే. నన్నడిగితే, అమ్మ బలమంతా అమ్మయొక్క తాత్వికచింతనే అంటాను. అది వేదాంతమే. అది చాలా అవసరం. లేదంటే చివరకు ఇదంతా వ్యక్తిపూజగా మారే ప్రమాదం ఉన్నది. కోరికలు, మొక్కులు, అమ్మని ఒక దేవతగా మార్చి పూజలకు పరిమితం చెయ్యడం. ఇదే చేస్తారు చివరకు ఈ భక్తులు. మహనీయులందరినీ ఇలాగే మార్చారు చివరకు' అన్నాను.
'వ' మౌనం వహించింది.
నేను లేచి సెలవు తీసుకుని బయటకు వచ్చేశాను.
14, ఏప్రిల్ 2026, మంగళవారం
జిల్లెళ్ళమూడి స్మృతులు - 59 (ఆధ్యాత్మిక అనుభవాలు - బైబిలు వాక్యాలు)
'కనుక ఈ అనుభవాలన్నీ ఇంతే. అవేవో గొప్పగొప్ప ఆధ్యాత్మికమైనవి అనుకోకు. అవి చిన్నచిన్న సతోరి స్థితులు మాత్రమే' అన్నాను.
'ఏవైనా సరే, అవి మామూలు మనుషులకు అందేవి కావు కదా' అన్నాడు
'మామూలు మనుషులకు ఏవి అందుతాయి అసలు? పొద్దున్న లేస్తే తిండి, సంపాదన, ఆశలు, కోపతాపాలు, బ్రతుకుపరుగులు ఈ రొచ్చే కదా. వీటిల్లో పడి ఉండే సామాన్యుడికి అసలేం అందుతుంది? ఏమీ అందదు.
సతోరిలు ఉంటాయి. నాకు 12 ఏళ్ల వయసులో మొదటిసారి కలిగింది. దీనికేమంటావు మరి? 'వెలుగుదారులు' లో అదంతా వ్రాశాను. చదివావా?'అడిగాను.
'లేదు. చదవలేదు' అన్నాడు.
'మరేం చదువుతావు? బైబిలా?' అన్నాను నవ్వుతూ.
తనేమీ మాట్లాడలేదు.
'అలాంటి అనుభవాలు రోజుకు పది కలుగుతై నాకు. ఒక్కోరోజున ఇంకా ఎక్కువ ఉంటాయి. అంతమాత్రం చేత అదేదో రామకృష్ణులకు కలిగే సమాధిస్థితులవంటివని అనుకోకూడదు. అంతెందుకు? ఇందాక నువ్వు నన్ను పలకరించినప్పుడు నేనేం స్థితిలో ఉన్నానో నీవు గమనించగలిగావా?' అన్నాను.
'లేదే? మీరు అలాంటి స్థితిలో ఉన్నారా?' అన్నాడు.
'అదేమరి. నీ దృష్టి ఎక్కడో ఉంది. ఎదురుగా ఉన్నదాన్ని మిస్సయ్యావు. ఇది అందరికీ జరిగేదే. ఇప్పటిదాకా నేను చెబుతున్నది అదే. మన దృష్టిని బట్టి మనకు కనిపిస్తుంది. మన దృష్టి ఎక్కడో ఉంటే, ఎదురుగా ఉన్నది కూడా కనిపించదు' అన్నాను.
'ప్రతిరోజూ ఎలా కలుగుతాయి అలాంటి అనుభవాలు?' అన్నాడు.
'ఎందుకు కలగవు? పొద్దున్న లేస్తే, ఎవడికి కలిగే అనుభవాలు వాడికి కలుగుతూనే ఉంటాయి కదా. నువ్వున్న స్థితిని బట్టి నీ అనుభవాలుంటాయి. జ్ఞానీ ఇక్కడే ఉంటాడు. అజ్ఞానులూ ఇక్కడే ఉంటారు. ఈ సృష్టిని దాటి ఎవడున్నాడు? ఇదే సృష్టి ఎవడి అనుభవాన్ని వాడికిస్తుంది. సృష్టిరహస్యాలు తెలిస్తే, వాటిని ఎలా పొందాలో తెలిస్తే, చక్కగా కలుగుతాయి. దానికి అభ్యంతరమేముంటుంది? గ్రహరహస్యాలు, ధ్యానరహస్యాలు, ప్రకృతిరహస్యాలు తెలిస్తే అన్నీ జరుగుతాయి. అన్నీ చేయవచ్చు' అన్నాను.
'అదే ఎలా?' అన్నాడు.
'చూడు. ఇందాక భరద్వాజగారికి కలిగిన అనుభవం వెనకున్న గ్రహస్థితులను వివరించాను కదా. అలాంటి రహస్యాలు జ్యోతిషశాస్త్రంలో కొన్ని వందలున్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే, నీ జీవితంలో ఏరోజు ఏం జరుగుతుందో నీకు స్పష్టంగా అర్ధమౌతుంది. వాటిని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకున్నావనుకో, అనుభవాలెందుకు కలగవు?
మామూలు మనుషులు జ్యోతిష్యాన్ని లౌకికంగా ఉపయోగించుకుంటారు. మనం దానిని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి. తంత్రమంటే అదే. అలాంటి టైం స్లాట్లు అనంతమైన కాలంలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం నీకు తెలియాలి. తంత్రసాధనలో ఇదొక భాగం. అప్పుడన్నీ అవుతాయి. అంతే ' అన్నాను.
ఆ సబ్జెక్ట్ వదిలేసి ఇంకోదానికి దూకాడు.
'మీరిందాక బైబిలన్నారే. నిజానికి నాకు మన గ్రంధాల కంటే బైబిలే ఎక్కువ ఇష్టం. దానిలోని మాటలు నన్ను చాలా కదిలిస్తాయి' అన్నాడు.
'అలాగా నాయనా. నువ్వుకూడా ఈ పిచ్చిలో పడ్డావన్నమాట ! ఈసారి కలిసేసరికి 'శ్రీనివాస్ దైవసహాయం' అని పేరు మార్చుకుంటావేమో?' అన్నాను.
'ఛీ అలా ఎందుకు చేస్తాను. ఊరకే బైబిలంటే నాకిష్టం అని చెప్పానంతే' అన్నాడు.
తన పాండిత్యాన్ని ప్రదర్శించాలని తెగ ఉబలాటపడుతున్నాడు కదా, చూద్దాంలే అనిపించి, 'సరే బైబిల్లోంచి నీకు నచ్చిన ఒక మంచిమాట చెప్పు వింటాను' అన్నాను.
వెంటనే ఉత్సాహంగా, 'ఒకడు సమస్తలోకమునూ జయించినప్పటికీ తన ఆత్మను పోగొట్టుకున్నట్లైతే అతనికేమి ప్రయోజనము?' అని జీసస్ అన్నాడు. ఇదెంత బాగుందో చూడండి' అన్నాడు.
జ్ఞానోపదేశ కాండం మొదలుపెట్టక తప్పదనిపించింది.
'దాంట్లో అంత పరవశించిపోయేది ఏముంది?' అన్నాను.
'అది నిజమే కదా' అన్నాడు భక్తిగా.
'ఎలా నిజమౌతుంది? దానిలో రెండున్నాయి. ఒకటి, లోకాన్నంతా సంపాదించడం లేదా జయించడం. అది కుదిరేపని కాదు. అలెగ్జాండర్ వల్లే ఆ పని కాలేదు. ఇక మామూలు మనిషి వల్ల ఏమౌతుంది? రెండోది నీ ఆత్మను పోగొట్టుకోవడం. అదీ కుదరదు. కనుక అదొక అర్ధం లేని స్టేట్ మెంట్ మాత్రమే' అన్నాను.
'అదేంటి?' అన్నాడు అయోమయంగా.
'నీ ఆత్మను నీవెలా పోగొట్టుకోగలవు? నిన్ను వదలి నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎలా పోతుంది? అసలు ఆత్మంటే ఏమిటి? ఆత్మ ఉందా అసలు? ఏదీ ఒకసారి నీ ఆత్మని పోగొట్టుకొని చూపించు, చూస్తాను' అన్నాను.
నిర్ఘాంతపోయాడు.
'నిజమే కదా. మీరు చెబుతుంటే అర్థమౌతోంది. ఈ విధంగా నాకెవరూ చెప్పలేదు ఇప్పటిదాకా' అన్నాడు.
'ప్రపంచాన్ని జయించడమూ సాధ్యం కాదు. ఆత్మను పోగొట్టుకోవడమూ సాధ్యం కాదు. వెరసి అదొక అర్ధంపర్ధం లేని స్టేట్ మెంట్ మాత్రమే. ఇలాంటివి చదివి, నీలాంటివాళ్ళు గుడ్డలు చించుకోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. అంతే' అన్నాను.
'మరి ఈ ఊరి పాస్టర్ అలా చెప్పలేదే?' అన్నాడు.
'కూటాలకి పోతున్నావా ఏంటి? 'ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటెనకాల' అన్నట్టుంది నీపని' అన్నాను.
'ఛీ ఛీ అదేం లేదు. ఇక్కడొక పాస్టరున్నాడు. అతను అప్పుడప్పుడూ వాకింగ్ లో కలుస్తాడు' అన్నాడు.
'ఓహో. వాకింగులో టైం వేస్ట్ చెయ్యకుండా, నీకు బైబిలెక్కించి, బ్రెయిన్ వాష్ చేద్దామని చూస్తున్నాడు. నీక్కూడా కొద్దో గొప్పో ఎక్కింది. అంతేనా?' అన్నాను.
'అబ్బే అదేం లేదు' అన్నాడు.
'మరైతే బైబిల్ని అంత భక్తిగా చెబుతున్నావేంటి? సరే బైబిలువాక్యం ఒకటి చెప్పావు. భగవద్గీతలోనించి కూడా నాలుగుశ్లోకాలు వినిపించు వింటాను.' అన్నాను.
పిచ్చిచూపులు చూస్తున్నాడు.
'అదీ సంగతి. నువ్వు చదవాల్సింది భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర మన గ్రంధాలు. ముందు వాటినేడువు. ఆ తర్వాత బైబిలు సంగతి చూద్దువుగాని. నీది నీకు తెలీకపోతే రోడ్డుమీదవన్నీ బానే ఉంటాయి' అన్నాను.
'మరి ఆ బైబిలు వాక్యంలో ఏమీ లేదా?' అన్నాడు.
'ఉంది. వేదాంతం ఉంది. జీసస్ నేర్చుకున్నదంతా మన దేశంలోనే నేర్చుకున్నాడు. ఆత్మతత్త్వాన్ని, అవతారతత్త్వాన్ని అన్నీ ఇక్కడున్నపుడే స్టడీ చేశాడు వాటిని తీసుకెళ్లి అక్కడ చెప్పబోయాడు. అవన్నీ పాతనిబంధనకు విరుద్ధమైన భావాలు. వాళ్లకు కోపమొచ్చింది. అందుకే చంపబడ్డాడు' అన్నాను.
'మరి ఆ మాటకు మీరు చెప్పే అర్థమేమిటి?' అన్నాడు.
'నేను చెప్పే అర్ధంకాదు. ఉన్న అర్ధం ఒకటే. 'నువ్వు ప్రపంచసుఖాలను ఎన్నాళ్ళు అనుభవించినా, ఆత్మజ్ఞానివి కానంతవరకూ నీ బ్రతుకు వృధానే' అని ఆ వాక్యం అంటోంది. మన వేదాంతం చెప్పినది అదేగా. రామకృష్ణులు, రమణులు అందరూ అదే అన్నారు. ఇందులో వింతేముంది?
వాళ్ళకేమో ఆత్మ అంటే ఏమిటో తెలీదు. ఆత్మజ్ఞానం అంటే అసలే తెలీదు. కనుక, 'నీ ఆత్మను పోగొట్టుకోవడం' అంటే, 'క్రైస్తవాన్ని కాకుండా వేరే మతాలను నమ్మడం' అని పెడర్ధాన్ని తీసుకుని, మతమార్పిడులు చేస్తూ, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు.
మన వేదాంతం చెప్పినదాన్నే జీసస్ కాపీ కొట్టి ఇజ్రాయెల్ లో చెప్పబోయాడు. బైబిల్ నీకు అర్ధం కావాలంటే, వేదాంతపు పునాదులమీదనే అది సాధ్యమౌతుంది. ఈ మాట నేను చెప్పడం లేదు. వివేకానందస్వామి అంతటివాడే ఈ మాటన్నాడు. మనదగ్గర లేనిది బైబిల్లో ఏమీ లేదు.
ఆ వాక్యానికి నిలువెత్తు నిదర్శనం రమణమహర్షి వారే. ఆ వాక్యంలో జీసస్ చెబుతున్నది రామకృష్ణులు, రమణమహర్షి, అమ్మగారు వంటి జ్ఞానులగురించి మాత్రమే.' అన్నాను.
'ఇంకొక్క చిన్నసందేహం ఉంది. అది చెప్పి మన చర్చ ముగిస్తాను' అన్నాడు శ్రీనివాస్.
అప్పటికి చర్చ మొదలై రెండుగంటలైంది. నేనేదో చిన్నవాకింగ్ కని వచ్చి, మనవాడి చేతుల్లో ఇరుక్కుపోయాను. నాకోసం చూసీ చూసీ, మూర్తి సంధ్యలు భోజనం చేయకుండా, రెండు అరటిపండ్లు తిని, నిద్రపోయారు. మిగతావాళ్ళు మాత్రం డిన్నర్ చేయకుండా నాకోసం వేచిచూస్తున్నారు.
'చూడు నాయనా. అవతల, తిండితినకుండా నాకోసం చూస్తున్నవాళ్లున్నారు. నీతో తెల్లవార్లూ మాట్లాడటానికి నేను సిద్ధమే. కానీ ఈ సోదిచర్చలవల్ల ఉపయోగమేమీ లేదు.
ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు సాధనేమీ చెయ్యవు. చెయ్యకుండా జ్ఞానాన్ని పొందలేవు. దానికి, దారిచూపేవాడు ఒకడు కావాలి. వాడు ఎదురుపడినా, నువ్వు గుర్తించలేవు. పైగా, వాడికే నీ విజ్ఞానప్రదర్శన చెయ్యాలని చూస్తావు.
పోనీ చర్చలో అన్నా consistency ఉందా అంటే, అదీ ఉండదు. ఒక టాపిక్ నుంచి ఇంకోదానికి దూకుతావు. చివరకు ఏదీ తేలదు. ఇంకెందుకు ఈ గోల? కాలక్షేపచర్చలకు అంతూపొంతూ ఉండదు. ఇక చాల్లే. రేపు చూద్దాం'
చివరగా ఒక మాట ! రేపటినుంచీ వాకింగుకెళ్ళినపుడు, అతను చెప్పే బైబిలువాక్యాలు నువ్వెక్కించుకోవడం కాదు, అతనికి నీ భగవద్గీతను ఎక్కించు. దారితప్పిన ఒక్క సోదరుడినైనా మళ్లీ సరైనదారిలోకి తీసుకురా. అలా చెయ్యాలంటే దానిలో ఏముందో ముందు నీకు తెలియాలి. అర్జెంట్ గా గీత చదవడం మొదలుపెట్టు' అని లిఫ్ట్ దగ్గరికి దారితీశాను.
'సరేనండి. గుడ్నైట్' అని తానూ సెలవు తీసుకున్నాడు.
ఆ చర్చ అలా ముగిసింది.


.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)


